డయేరియా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే

మాజీ మంత్రుల స్పష్టీకరణ

డయేరియా వ్యాప్తితో అతలాకుతలమైన శ్రీకాకుళంలోని ప్ర‌భావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తదితరులు, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. డయేరియాతో కన్నుమూసిన వారి కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రులు, వారి గోడు విని చలించిపోయారు. అనంతరం మాజీ మంత్రులు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో నగరంలో కలుషిత నీటి సరఫరా

ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

ఒకవైపు డయేరియాతో ప్రజలు చనిపోతున్నారు

మరోవైపు మీరు అమరావతిలో కబడ్డీ ఆడుతున్నారా?

మాజీ మంత్రుల తీవ్ర ఆక్షేపణ

డయేరియా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

ఆ ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి

మాజీ మంత్రులు ధర్మాన సోదరులు, సీదిరి డిమాండ్‌

శ్రీ‌కాకుళం : డయేరియా బాధితులను ఆదుకోవడంలో కానీ, ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో కానీ, పూర్తిగా విఫలమైన ప్రభుత్వం డయేరియా మరణాలకు వేరే కారణాలు సాకుగా చూపుతోందని మాజీ మంతులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ఆ మరణాలను ఇతర అనారోగ్య సమస్యలు కారణమని చెబుతున్నారని వారు మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రీకాకుళంలో డయేరియా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వారు తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే డయేరియా బాధితులను ఆదుకవాలని, డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి ప్రాంతాల్లో పర్యటించి, బాధితుల పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు డిమాండ్‌ చేశారు.
ఈ సందర్భంగా వారు ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఆ మరణాలు ప్రభుత్వ హత్యలే:
    టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా డయేరియాతో అమాయక ప్రజలు మరణించడం చంద్రబాబు అసమర్థ పాలనకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. అందుకే ఆ మరణాలన్నీ కచ్చితంగా ప్రభుత్వ హత్యలుగానే చూడాలి. డయేరియా నియంత్రణలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం, చివరకు ఆ వ్యాధి మరణాలపై ప్రజలకు తెలియకుండా కుట్ర చేస్తోంది. ఇది అత్యంత హేయం. అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు శ్రీకాకుళం ప్రజలకు కనీసం రక్షిత మంచినీరు కూడా అందించలేరా?. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలు పతనమయ్యాయి. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం కాౖగా, రోగులకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్యానికి నిరాకరిస్తున్నాయి.

రక్షిత తాగునీరు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం: ధర్మాన ప్రసాదరావు. మాజీ మంత్రి
– కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలల్లోనే 61 డయేరియా ప్రబలిన ఘటనలు జరిగితే అందులో 35 ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో చోటుచేసుకోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా రాష్ట్రంలో రోజూ ఏదొక ప్రాంతంలో అమాయకలు బలైపోతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.
    శ్రీకాకుళం నగరంలోని ప్రజలంతా వాంతులు, విరేచనాలతో అల్లాడిపోతున్నారు. ఇప్పటికే నలుగురు చనిపోయారు. వందల మంది ఆస్పత్రుల పాలయ్యారు. కలుషిత నీటి సరఫరా కారణంగానే చనిపోయినట్లు మృతుల కుటుంబ సభ్యులు, వైద్యులు చెబుతుంటే, ప్రభుత్వం మాత్రం వేరే కారణాలతో చనిపోయారని చెప్పి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటు. తాగునీటి సరఫరా చేసే ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు ఇష్టారాజ్యంగా అనుమతులివ్వడమే ఈ ప్రమాదాలకు అసలు కారణం. సురక్షితమైన తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం దౌర్భాగ్యం. చివరకు శ్రీకాకుళం ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో మందు బిళ్లకి దిక్కులేదు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: ధర్మాన కృష్ణదాస్‌. మాజీ మంత్రి.
–  శ్రీకాకుళం మున్సిపాలిటీని ఒక ప్రైవేట్‌ వ్యవస్థగా మార్చేశారు. కూటమి ప్రభుత్వ నిర్వాకాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని వెంటబడి తరిమే రోజు తొందర్లోనే వస్తుంది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రాధాన్య రంగంగా భావించి అభివృద్ధి చేసిన వైద్యారోగ్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటోంది. చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఈ సంఘటనలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంటే దాన్ని డైవర్ట్‌ చేసే కుట్ర చేస్తున్నారు. అమరావతిలో మోటర్లతో నీరు తోడటానికి చేసే ఖర్చు నగరాల్లో రక్షిత తాగునీరు అందించడానికి వెచ్చించడం లేదు. డయేరియాతో చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. తక్షణమే ఆ కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.

20 నెలల్లో 61 డయేరియా ఘటనలు: డాక్టర్‌ సీదిరి అప్పలరాజు. మాజీ మంత్రి.
– శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం. శ్రీకాకుళంలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా ప్రబలిందని మూడు రోజుల క్రితమే స్థానిక న్యూస్‌ ఛానెళ్లు, యూట్యూబర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే, మంత్రి, కేంద్ర మంత్రులు ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు విజయవాడలో కబడ్డీ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కలుషిత నీరు తాగి తన భర్త వాంతులు, విరేచనాలతో చనిపోతే అధికారులు మాత్రం డయేరియల్‌ డెత్‌ కాదని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెబుతున్నారని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరణాల సంఖ్యను తగ్గించే చూపే కుట్రతో ముగ్గురి మరణాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచి పెడుతోంది. వేరే అనారోగ్య కారణాలతో చనిపోయారని ప్రచారం చేస్తోంది. లివర్, గుండె జబ్బులుంటే వారికి డయేరియా రాదని ఏ డాక్టర్‌ చెప్పాడు?.
    చంద్రబాబు సీఎం కాగానే, నాడు విజయనగరం జిల్లా గుర్లాం మండలంలో డయేరియాతో ఒకే గ్రామంలో 13 మంది చనిపోయారు. ఆ సంఘటన మొదలు వరుసగా డయేరియా మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. విజయవాడ సిటీ, గుంటూరులోని తురకపాలెం, గురజాల.. ఇలా ఎన్నో చోట్ల అమాయక ప్రజలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయారు.

Back to Top