అమరావతి: చంద్రబాబు ఏడుపంతా బూటకమేనని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. అందుకే టీడీపీ నేతలు ఇవాళ చంద్రబాబు మాదిరిగా బాయ్కట్ చేయకుండా సభకు వచ్చారన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధాన్యవాద తీర్మానం సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..అంబటి రాంబాబు మాటల్లోనే.. రెండున్నరేళ్ల వైయస్ జగన్ పాలనలో అద్భుతమైన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందించారు. వీటి గురించి గవర్నర్ చక్కగా వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు కావడం లేదని గర్వంగా చెబుతున్నాను. విద్యా, వైద్యానికి వైయస్ జగన్ పెద్ద పీట వేశారు. ఏపీలో నిరక్షరాస్యత 37 శాతం ఉంది. గతంలో పాలకులు సక్రమంగా పట్టించుకోకపోవడం వల్ల నిరక్ష్యరాస్యత పెరిగింది. వైయస్ జగన్ సీఎం అయ్యాక ప్రతి పేదవాడు విద్యనభ్యసించాలని సంకల్పించారు. గత ప్రభుత్వం చైతన్య, నారాయణ విద్యా సంస్థలపై శ్రద్ధ పెట్టింది. డబ్బులున్నవాడికి కార్పొరేషన్ విద్య, డబ్బులేని వారికి చెట్టు కింద విద్య అన్నట్లుగా పాలించారు. వైయస్ జగన్ ఎంతో విశాల హృదయంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలను నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రతిపక్షం అభినందించకపోవడం బాధాకరం. ఆరోగ్యం: ఆరోగ్యమే మహాభాగ్యం. డబ్బులు ఉన్నవాడు ఆపరేషన్ కోసం హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలకు వెళ్తాడు. పేదవాడు ఎక్కడికి వెళ్తాడు. పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందాలని ఆలోచన చేసిన వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మొదటి వ్యక్తి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు చేశారు.16 మెడికల్కాలేజీలను ఇవాళ ప్రారంభించారు. ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబు ఆలోచన చేశారా? 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి పేదవాడి గురించి 14 నిమిషాలైనా ఆలోచన చేశారా? పేదలందరికీ ఇళ్లు: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవాడు ఉండకూడదని భావించి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైయస్ జగన్ది. గతంలో కమ్యూనిస్టులు పేదవారికి ఇళ్లు ఇవ్వాలని ఆందోళన చేసేవారు. ఏ రాష్ట్రంలోనూ, ఏ దేశంలోనూ ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సందర్భాలు లేవు. ఒక్క వైయస్ జగన్ ఒక్కరే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి వైయస్ జగన్. చక్కని ఇల్లు ఇస్తుంటే దానికి కూడా పేర్లు పెడుతున్నారు. మీ పాలనలో ఎందుకు ఇవ్వలేకపోయారు. ఇవాళ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని వైయస్ జగన్ చెబుతున్నారు. ఓటీఎస్: గతంలో పేదవారికి ఇల్లు సబ్సిడీలో నిర్మించే వారు. గతంలో మూడు వేలు తీసుకున్న అప్పులు ఎవరూ కట్టలేదు. ఆ అప్పులు తడిసి మోపెడు అయ్యాయి. వాటిని తీర్చలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో వైయస్ జగన్ ఒక మంచి ఆలోచన చేసి ఓటీఎస్ తీసుకువచ్చారు. పల్లెలో ఉన్న వారికి రూ.10, పట్టణాల్లో రూ.15 వేలు చెల్లిస్తే ఇళ్ల పట్టాలు ఇస్తామని వైయస్ జగన్ ఓటీఎస్ పథకాన్ని తీసుకువచ్చారు. గతంలో చంద్రబాబు ఎందుకు ఇలాంటి ఆలోచన చేయలేదు.పేదవాడికి ఇళ్లు ఉండకూడదన్నదే చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ రంద్రాన్వేషణ చేస్తున్నారు. సంక్షేమం: పెన్షన్ కానుక అనే పథకాన్నిప్రతిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీనే సూర్యోదయం కంటే ముందే ఇంటికి వెళ్లి పింఛన్ సొమ్ము ఇస్తున్నారు. వృద్ధ్యాప్య పింఛన్, వికలాంగుల పింఛన్, కళాకారుల పింఛన్, దీర్ఘకాలిక రోగులకు పింఛన్ ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా అందజేస్తున్నారు. గత నెలలో నేనే స్వయంగా వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశాను. పింఛన్ ఇస్తున్నప్పుడు వారి కళ్లలో ఆనందం చూసి సంతోషించాను. నా కొడుకు ఓ కూలోడు. వాడి కుటుంబ పోషణ వారికే సరిపోదు. జగనన్న ఇచ్చే డబ్బుతో జీవనం సాగిస్తున్నామని ఆ అవ్వ చెబుతుంటే సంతోషమనిపించింది. వాస్తవాలు టీడీపీ నేతలు గమనించాలి. స్వచ్ఛ భారత్: ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలో జనాభా పెరుగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో ఎస్డబ్ల్యూపీసీలు ఉపాధి హామీ పథకం కింద నిర్మించి పచ్చ రంగులు వేసి బిల్లులు చేసుకున్నారు. గ్రీన్అంబాసిడర్లు లేరు. వైయస్ జగన్ సీఎం అయ్యాక వర్క్షెడ్డులు నిర్మించాం. పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. వైయస్ జగన్కు నా వయసు అంత అనుభవం లేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు. వైయస్ జగన్కు మీ కుమారుడి వయసు మాత్రమే ఉంది. మరి వైయస్ జగన్ అంటే ఎందుకంత భయం. సభకు రాకుండా ఎందుకు పారిపోయారు. తుంటరి మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఇది గౌరవ సభ కాదంటున్నారు. అలాంటప్పుడు మీరంతా ఎందుకు వచ్చారు. మీ నాయకుడు సభకు రాడు. గౌరవ సభ అంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు..ప్రతిపక్ష నేతగా ఉంటే అది కౌరవ సభ అవుతుందా? వైయస్ జగన్ కూడా ప్రతిపక్ష నేతగా ఆ రోజు సభ నుంచి బాయ్ కాట్ చేసి వెళ్లారు. అప్పుడు మా సైన్యం ఒక్కరూ సభకు రాలేదు. ఇవాళ చంద్రబాబు బాయ్కట్ చేస్తే మీరంతా ఎందుకు వచ్చారు. వైయస్ జగన్ వెళ్లి పాదయాత్ర చేశారు. ఆ రోజు అందుకే రాలేదు. చంద్రబాబు ఏడ్చుకుంటూ వెళ్తే మిగతా టీడీపీ నేతలకు ఎందుకు బాధ కలుగలేదు. అంటే చంద్రబాబు ఏడ్చిన ఏడ్పు బూటకమని మీరు నమ్మి ఇవాళ సభకు వచ్చారు. నావికుడు లేని నావ మునిగిపోతుంది. వైయస్ జగన్ గతంలో శాసనసభకు రాకుండా బాయ్కట్ చేసి పాదయాత్ర చేశారు. అప్పట్లో అసెంబ్లీ అంటే గౌరవం లేదు. జగన్కు రాజకీయ పరిపక్వత లేదు..అందుకే బాయ్కట్ నిర్ణయం అని ఆ రోజు అన్నారు. ఇవాళ చంద్రబాబు ఎందుకు బాయ్కట్ చేశారు. వారి మనసుకు వారే సమాధానం చెప్పుకోవాలి. వారి కార్యకర్తలకు సమాధానం చెప్పాలి. అప్పుడు 173 సీట్లు గెలుస్తామన్నారు. తీరా 23కు పరిమితం అయ్యారు. పులివెందుల కూడా మేమే గెలుస్తామని ప్రగల్భాలు పలికారు. ఇవాళ కుప్పంలో కూడా టీడీపీ ఓడిపోయింది కదా? మంగళగిరిలో ఘోర ఓటమిని మరిచిపోయారా? ముందస్తు ఎన్నికలు అంటూ చంద్రబాబు అంటున్నారు. అసెంబ్లీ నుంచి పారిపోయి..టీడీపీ ఆఫీస్లో దాక్కుని తన అనుకూలమీడియా ముందు ఏడిచారు. ఇవాళ జగన్ ముందస్తు ఎన్నికలు అంటూ కొత్త తాళం అందుకున్నారు. ఇవాళ సభకు 8 మంది మాత్రమే హాజరయ్యారు. టీడీపీ శ్రేణులు పారిపోతారనే చంద్రబాబు ముందస్తు రాగం అందుకున్నారు. మంత్రి పదవి గురించి కక్కుర్తి పడే వ్యక్తిని కాదన్నారు. వికేంద్రీకరణ మా ప్రభుత్వం నిర్ణయం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధానంతో ముందుకు వెళ్తుంది. హైకోర్టు తీర్పుపై సీనియర్ సభ్యులు ధర్మాన ప్రసాదరావు సీఎం వైయస్ జగన్కు ఓ లేఖ రాశారు. శాసన సభ హక్కులు, విధులు, బాధ్యతలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఆయన వ్యాఖ్యలను ఏకీభవిస్తూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అంబటి రాంబాబు సీఎం వైయస్ జగన్కు విజ్ఞప్తి చేశారు.