దేశంలో అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఏపీనే

ఆర్థిక లోటున్నా ప్రతి సంక్షేమ పథకం కొనసాగిస్తున్నాం

పేద అర్చకులకు ఆర్థికసాయం అందజేస్తున్నాం

విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్, కన్నా దిగజారి మాట్లాడుతున్నారు

కన్నాకు రాష్ట్రంపై ప్రేమ ఉంటే ఆదుకోమని ప్రధానికి లేఖ రాయాలి

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
 

తాడేపల్లి: కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ఏ లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా ప్రజలు ఇబ్బందులు పడకూడదని ప్రతి సంక్షేమ పథకాన్ని సీఎం కొనసాగిస్తున్నారన్నారు. అమ్మ ఒడి నుంచి నిన్నటి రోజున ప్రార్థమైన సున్నావడ్డీ వరకు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. పేద బ్రాహ్మణులకు ఆర్థికాసాయం అందించిన సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రి వెల్లంపల్లి కృతజ్ఞతలు తెలిపారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. అన్నదానం చేసే పరిస్థితి ఉన్న దేవాలయాల్లో సుమారు 50 వేల మందికి సరిపడా ఆహారాన్ని తయారు చేయించి కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అన్నదాన కార్యక్రమాలు చేపడుతుంది.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు గత వారం రోజుల క్రితం అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ నుంచి సుమారు 2500 దేవస్థానాల్లో తక్కువ జీతాలు డ్రా చేస్తున్న అర్చకులను గుర్తించి ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున సాయం అందించాం. అదే విధంగా చర్చిల్లో పనిచేసే పాస్టర్లు, మసీద్‌లలో ఉండే ఇమామ్‌లు, మౌజన్లకు కూడా ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే మంచి ఉద్దేశంతో అన్ని మతాలను సమానంగా చూస్తూ ముందుకెళ్తుంటే కొంతమంది సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారం బాధేస్తుంది.

చంద్రబాబు, పవన్, కన్నాలక్ష్మీనారాయణ ఇతర తోక పార్టీలు రాష్ట్రంలో ఏదో జరుగుతుందని అభూత కల్పన కల్పించడం బాధాకరం. 40 ఏళ్ల ఇండస్ట్రీ, ప్యాకేజీలకు అమ్ముడుపోయే పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో కూర్చున్నారు. అవినీతికి అడ్రస్‌గా మిగిలిన కన్నా గుంటూరులో కూర్చొని విమర్శలు చేస్తున్నాడు. అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో నిలబడింది. ఇప్పటి వరకు సుమారు 74,551 టెస్టులు చేస్తే దాంట్లో 11 వందలకుపైగా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అదే తెలంగాణలో ఇప్పటి వరకు 18,756 టెస్టులు మాత్రమే చేసినట్లుగా రికార్డులు చూపిస్తున్నాయి. దాంట్లో 1001 పాజిటివ్‌ కేసులు. ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచన చేయాలి.

బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎన్ని కేసులు.. ఎన్ని టెస్టులు చేస్తున్నారో ఆలోచించుకోవాలి. కన్నాలక్ష్మీనారాయణ సీఎం వైయస్‌ జగన్‌కు లేఖ రాయడం కాదు.. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ఆదుకోవాలని లేఖ రాయాలి. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరాలి’ అని మంత్రి వెల్లంపల్లి అన్నారు.   

Back to Top