చిత్తూరు: స్వామి వివేకానంద అందరికీ ముఖ్య మార్గదర్శకులని, యువతకు ఆయన స్ఫూర్తి అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. యువతను మంచిమార్గంలో నడవడానికి వారిని చైతన్య పరచడానికి ఆయన దేశమంతా తిరిగి ఎన్నో ప్రసంగాలు చేశారని మంత్రి తెలిపారు. పుత్తూరు ఎస్.ఆర్.ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని బుధవారం ఆర్కే రోజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్.కె.రోజా మాట్లాడుతూ …పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో వివేకానంద విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ సైతం స్వామి వివేకానంద ప్రసంగానికి మంత్ర ముగ్ధులయ్యారని తెలిపారు. స్వామి వివేకానంద మనమధ్యనుంచి దూరమయి నూట ఇరవై సంవత్సరాలు అవుతున్నప్పటికీ మనం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకొని, ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప మనిషి ఒకసారి అందరూ కూడా ఆలోచించాలన్నారు. ఎప్పుడు స్వామి వివేకానంద మందలో కాదు వందలో ఒకరుగా ఉండాలి అని చెప్తూ ఉంటారని ఆయన వ్యాఖ్యలను మంత్రి రోజా గుర్తుచేశారు. ఒక లక్ష్య సాధనలో కొందరు విఫలం అయినప్పుడు అక్కడ ఆపేస్తారు కానీ తిరిగి మనం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలని అన్నారు. ఈ రోజు కాలేజీలో స్వామి వివేకానంద విగ్రహాన్ని పెట్టడం ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ఒక మంచి ఆదర్శవంతమైన సమాజాన్నిఏర్పాటుచేయాలంటే యువత చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆయన చెప్పిన మాటలు కూడా చదివి విద్యార్థులు ఆదర్శవంతంగా ఉండే విధంగా ముందుకు నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు. స్వామి వివేకానంద చెప్పటమే కాకుండా నూతన సన్మార్గంలో పెట్టడం కోసం రామకృష్ణ మిషన్ ,రామకృష్ణ సమాజాన్ని స్థాపించి ఎంతో మందిని నడిపించారని చెప్పారు. యువత వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగితే తిరుగులేని విజయాలు స్వంతం అవుతాయన్నారు.