ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన 

 మంత్రి పేర్ని నాని

హీరో నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో తెలియదు 

సిద్ధార్థ  ..స్టాలిన్ కోసమో, మోడీ కోసమో అనుంటాడు

 అమరావతి:  ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌న్న‌దే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వ ఆలోచ‌న అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. సినిమా టికెట్ల ధరలపై హీరో నాని, సిద్దార్థ్‌లకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మాట్లాడేవాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. సెప్టెంబర్‌లో డిస్ట్రిబ్యూటర్‌లు, ఎగ్జిబిటర్లుతో సమావేశం పెట్టాం. ఆ రోజే సినిమా హాళ్ల యజమానులు అనుమతులు, ఫైర్‌ ఎన్‌ఓసీ కానీ తీసుకోవడం లేదు. వీటిని రెన్యువల్‌ చేసుకోమని ఆనాడే చెప్పాము. అయినా అనుమతులు లేకుండా నడిపారు. అనుమతులు తీసుకోని థియేటర్లపైనే చర్యలు తీసుకున్నాం. ఇందులో ఎవరి మీదనో కక్ష ఎందుకు ఉంటుంది.

130 సినిమా హాళ్ల పై చర్యలు తీసుకున్నాము. ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లే. చిత్తూరులో 24, కృష్ణా జిల్లాలో 12 సీజ్ చేశాము. లైసెన్స్ లేని వాళ్ళు 22 థియేటర్లు మూసేశారు. 83 సీజ్ చేశాం, 23 థియేటర్లపై ఫైన్ వేశాం. జీవో 35ని ఏప్రిల్‌లో ఇచ్చాము. మరి ఈ రోజు ఆ జీవోకి నిరసనగా మూసివేయడానికి నాని ఏ ఊరు లో ఉన్నారో.. ఆయన ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో తెలియదు.

 
మరో నటుడు సిద్దార్థ్ ఎక్కడుంటారు..?. ఆయన చెన్నై లో స్టాలిన్ కోసం మాట్లాడారేమో. సిద్దార్థ్ ఏమైనా ఇక్కడ టాక్స్‌లు కట్టాడా. మా ఇళ్లకి వచ్చి చూసాడా. మేము ఎంత విలాసంగా ఉంటున్నామో. ఆయన స్టాలిన్ కోసమో, మోడీ కోసమో అనుంటాడు. ఎవరి కోసమో నిర్ణయాలు తీసుకోము. ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. మేము హైకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటున్నాం. ఎవరితోనైనా ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య అయినా వినడానికి మేం సిద్ధం. ప్రభుత్వానికి ఏదో అపాదించి మాట్లాడటం ధర్మం కాదు' అని మంత్రి పేర్ని నాని అన్నారు. 

‘గతంలో బామ్మర్ది తీసిన సినిమాకి రాయితీ ఇచ్చారని, అదే చిరంజీవి తీసిన సినిమాకి రాయితీ ఇవ్వలేదని చంద్రబాబును ఉద్దేశించి పేర్ని నాని మాట్లాడారు. కానీ సీఎం  వైయ‌స్ జగన్‌ అందరినీ ఒకేలా చూస్తారని పేర్ని నాని స్పష్టం చేశారు. 

Back to Top