వైయస్‌ జగన్‌ మొదటి పథకం రవాణా శాఖ కావడం సంతోషం

రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని)

ప్రజల సమస్యలు తెలుసుకుని పథకాలకు రూపకల్పన చేశారు

ఆటో కార్మికుల కష్టాన్ని కళ్లారా చూసి వైయస్‌ జగన్‌ చలించారు

మాటకు కట్టుబడి సీఎం వైయస్‌ జగన్‌ హామీలు అమలు చేస్తున్నారు

గత ప్రభుత్వం 600 హామీలిచ్చి అమలు చేయకుండా పోయారు

ఏలూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మొదటి పథకం రవాణా శాఖకు చెందిన వైయస్ఆర్‌  వాహన మిత్ర కావడం సంతోషంగా ఉందని, ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట రామయ్య(నాని) పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లక్షా 73 వేల 201 మంది ఆటో కార్మికులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఏలూరులో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేర్ని నాని మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..నాని మాటల్లోనే.. నేను విన్నాను..నేను ఉన్నానని ఎవరు అన్నారు? మాటలు నేర్వటం ఒక వరమైతే..మాట  ఇవ్వడం ఒక సహసం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నది ఒక వ్యక్తిత్వం. ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తిత్వం నాడు వైయస్‌ఆర్‌ ఒక్క అడుగు వేస్తే..నేడు తండ్రిని మించిన తనయుడిగా వైయస్‌ జగన్‌ రెండు అడుగులు ముందుకు వేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు మనుషులు కనబడితే మాటలు చెప్పుకుంటూ పోతుంటారు. కానీ వైయస్‌ జగన్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత రాజకీయ నాయకుడి మాటలకు విలువ ఏంటో రూచి చూపించారు. నాడు మే 14, 2018న ఏలూరు పాత బస్టాండ్‌లో ఆటో కార్మికులు తమ చెమటనే రక్తంగా మార్చి వైయస్‌ జగన్‌కు వేసినప్పుడు ..మీ చెమట సువాసన ఆయనకు అంటి..ప్రతి కష్టాన్ని చూసి స్పందించిన తీరు చూశాం. మీకిచ్చిన మాటను ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,73,201 మంది ఆటో, మ్యాక్సీ, ట్యాక్సీ డ్రైవర్లకు వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నారు. నలుగురు రాజకీయ నాయకులు, నలుగురు ఐఏఎస్‌ అధికారులు ఒక గదిలో కూర్చోని పెట్టిన పథకాలు ఎన్నో చూశాం. ఓట్లు, రాజకీయాల కోసం పథకాలు మార్చిన దుస్థితి చూశాం. కానీ ప్రజల మధ్యే, రోడ్డు మీదే  మీ అందరి సమక్షంలోనే పథకాలను రూపొందించిన మహనీయుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇవాళ ప్రతి పథకం వైయస్‌ జగన్‌  ప్రజల మధ్యే రచించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3468 కిలోమీటర్ల పాదయాత్రలో అనేక పథకాలకు రూపకల్పన చేశారని, ఇచ్చిన మాటను తూచ తప్పకుండా నెరవేర్చుతున్నారు. వైయస్‌ జగన్‌ మొదటి పథకం నా శాఖకు చెందినదిగా అమలు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధ్రువీకరణ పత్రాలు లేవని డబ్బులు గుంజుతున్న తరుణంలో మా శాఖ ప్రజలకు డబ్బులు ఇచ్చే శాఖగా మార్చేశారు. దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అనుభవం ఉన్న చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలు అమలు చేయకుండా ప్రజలకు అసత్యాలు, అబద్దాలు చెబుతూ ఐదేళ్లు కాలయాపన చేశారు. ఇవాళ వైయస్‌ జగన్‌ మీ అందరి ఆశీస్సులతో 50 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చి ప్రతి హామీని నెరవేర్చుతున్నారు. చంద్రబాబు ఖజానాను లూటీ చేస్తే..వైయస్‌ జగన్‌ ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి పైన భగవంతుడు ఉన్నాడని, ఆయనే మనకు సహాయం చేస్తారని వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకానికి శ్రీకారం చుట్టారు. మన కష్టాలు మనకు తెలుసు. ఇంట్లో నుంచి బయటకు వచ్చింది మొదలు రోడ్డుపైకి రాగానే ఏ పోలీసు ఆపుతాడో, ఎక్కడ బ్రేక్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆపుతాడో అని భయపడుతాం. ఇవన్నీ చట్టాన్ని మీరి చేయాలని కాదు. జీవనం గడపటం కష్టంగా ఉన్న సమయంలో  ఇలాంటివి చేస్తారు. దాని కోసమే మన బాధలు తీర్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైయస్‌ జగన్‌ ఇస్తున్న రూ.10 వేలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆశిస్తున్నాను. మీరు కూడా ప్రజాసేవకులే కాబట్టి ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను. ఆటోలకు ఉన్న చిన్న చిన్న రిపేరీలు చేయించుకోవాలని, ఇన్సూరెన్స్‌ చేయించుకోవాలని మనవి. ఇవాళ వైయస్‌ జగన్‌ను నమ్మి మీ అందరు ఎలాగైతే 151 సీట్లు ఇచ్చారో.. అలాగే ఈ రాష్ట్రంలోని పేదలందరూ కూడా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను నమ్ముకొని మీతో ప్రయాణం చేస్తున్నారు. వారికి మీరు భద్రత కల్పించాలని కోరుతున్నాను. ఆటో డ్రైవర్లు ప్రమాదాలను సున్నా శాతానికి తగ్గించాలని సూచించారు. ఫ్రెంట్‌ సీట్లో ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గర్భిణులు, దివ్యాంగులను ఉచితంగా ఆటోలు ఎక్కించుకోవాలని కోరారు. ఈ పథకం రూపకల్పనకు ప్రభుత్వ అధికారులు అహోరాత్రులు కృషి చేశారని అభినందించారు. 

Back to Top