ఆ మాట చెప్పిస్తే.. రాజకీయాల్లోంచి తప్పుకుంటా

పిల్లకుంక లోకేష్‌కు బుద్ధిచెప్పే సమయం దగ్గరపడింది

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం

దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోంది

ప్రయాణికులను చూపి దొంగ ఓట్లు అంటూ చిత్రీకరించడం సిగ్గుచేటు

పేదవాళ్లు బస్సుల్లో వెళ్లకుండా విమానాల్లో వెళ్తారా..?

తిరుపతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ములేక.. ఎల్లో మీడియా సహకారంతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని, శ్రీకాళహస్తికి బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను చూపించి దొంగ ఓట్లు అంటూ చిత్రీకరించడం టీడీపీ దిగజారుడు తనానికి నిదర్శనమని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పేదవాళ్లు బస్సుల్లో ప్రయాణించకుండా విమానాల్లో ప్రయాణిస్తారా..? ఓటమి తప్పదని వైయస్‌ఆర్‌ సీపీపై అభాండాలు వేస్తున్నారని, ప్రయాణికులను చూపించి దొంగ ఓట్లు అంటూ మాట్లాడటం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాబలం లేక టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బస్సుల్లో ప్రయాణించేవారిని అడ్డుకొని ఏ ఊరు, ఎక్కడకు వెళ్తున్నారు.. డబ్బులు ఇచ్చారా లేదా..? అని ఆడవారిని కూడా మర్యాదలేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ నుంచి వచ్చారు.. ఓటర్‌ కార్డు ఇవ్వండి అని పోలింగ్‌ స్టేషన్‌లో అడిగితే బాగుండేదన్నారు. కానీ, బస్సులను ఆపి ప్రయాణికులతో అసభ్యకరంగా మాట్లాడటం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.  

ఏబీఎన్, టీవీ5 మిగతా కొన్ని ఛానళ్లు పోలింగ్‌ స్టేషన్‌ లోపలికి వెళ్లి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, దీనిపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. గత మూడ్రోజులుగా ఫంక్షన్‌ హాల్‌లో పార్కు చేసి ఉన్న బస్సును చూపించి దుష్ప్రచారాలు చేయడం టీడీపీకే చెల్లుతుందన్నారు. 

తనపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని చంద్రబాబు, లోకేష్‌లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరప్పన్‌.. ఎర్ర‌చంద‌నం తరలిస్తున్నారని లోకేష్‌ ట్వీట్‌ చేశాడని మంత్రి ధ్వజమెత్తారు. ఇదే మాట చిత్తూరు జిల్లాలోని టీడీపీకి చెందిన 10 మంది నాయకులతో చెప్పించగలిగితే.. ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌ విసిరారు. లేదంటే.. లోకేష్‌ తిరుపతికి వచ్చినప్పుడు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. పిల్లకుంక లోకేష్‌కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. 

అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 24 డివిజన్లలో వన్‌ ప్లస్‌ ఫోర్‌ గాడ్స్‌ ఇచ్చి కొత్త వెహికిల్స్‌ ఇచ్చి ఎ్రర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టానని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఆ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ ఎ్రరచందనం స్మగ్లింగ్‌ చేశారని,  2009లో ఎ్రరచందనం స్మగ్లర్‌ అని మాట్లాడిన వ్యక్తినే 2014లో టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తండ్రీకొడుకులకు తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు.  

 

Back to Top