తాడేపల్లి: రేపు (26వ తేదీన) ఆంధ్రప్రదేశ్లో ఫెస్టివల్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక పండుగ జరగబోతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా రాజధాని ప్రాంతంలో 52 వేల కుటుంబాలు ఇళ్ల పట్టాలు అందుకోబోతున్నాయని చెప్పారు. కోర్టులు మొట్టికాయలు వేసినా సిగ్గులేకుండా ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని, ఆరు నూరు అయినా ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రాజధాని రైతులతో, పేదప్రజలతో చంద్రబాబు ఆటాడుకుంటున్నాడు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిపోయాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను అమరావతికి తీసుకువచ్చి భూముల ధరలను పెంచాడు. అధికారంలో ఉన్నప్పుడు భూములు కాజేయాలనుకున్న చంద్రబాబు చేతులెత్తేశాడు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని ప్రాంతంలో ప్రజలంతా బాగుండాలని, వ్యవసాయం చేసుకునే రైతులతో పాటు రైతు కూలీలు, కౌలు రైతులు బాగుండాలనే ఆలోచనతో పరిపాలన చేస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయిస్తే.. 45 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు చంద్రబాబు డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్నాడు. రాజధాని ప్రాంతంలో పేదవారు ఉండకూడదు.. పెత్తందార్లు మాత్రమే ఉండాలని చంద్రబాబు ఆలోచన. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చాడు. ఇళ్ల స్థలాల పంపిణీపై దేశ అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా చంద్రబాబు కుయుక్తులు, కుట్రలు చేస్తున్నాడు.
రాజధాని ప్రాంతంలో 52 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు (ఒక్కో ఇంటి పట్టా రూ.10 లక్షల ఖరీదు) ఇస్తున్నాం. పేదవారు రాజధాని ప్రాంతంలో ఉండకూడదని ప్లాన్ ప్రకారం చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. చంద్రబాబు అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్కు పేదప్రజల ఇళ్ల పట్టాలపై కోర్టుల్లో ఓడిపోయినా సిగ్గురాలేదు.
ఉద్యమాలు అని చెప్పేవారు.. అంబేడ్కర్ పేరు చెప్పుకొని పార్టీలు పెట్టుకున్న కొందరు నీచులు వచ్చి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ధర్నాలు చేయడం సిగ్గుచేటు. అంబేడ్కర్ భావజాలాన్ని భుజాన వేసుకొని సీఎం వైయస్ జగన్ పేదలకు పట్టాలు ఇస్తుంటే.. చంద్రబాబు కోర్టులకు వెళ్తున్నాడు, వారికి డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేయిస్తున్నాడు. ఎవరి కోసం ఉద్యమాలు చేస్తున్నారు.. ఎందుకు చప్రాశి ఉద్యమం చేస్తున్నారని వారిని ప్రశ్నిస్తున్నాను.
చంద్రబాబు ఎంత దుర్మార్గుడంటే.. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటాడు.. బీసీల తోకలు కత్తిరిస్తానంటాడు.. బీసీలు జడ్జిలుగా పనికిరారు అంటాడు.. మీ అంతు చేస్తాను అంటాడు.. పేదలను పట్టించుకోకుండా ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నావు చంద్రబాబూ..? మా కులాల అభ్యున్నతిని అడ్డుకట్టవేసే నీచుడివి ఓట్లు ఎలా అడుగుతావు. నీ 45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మా కులాలకు గౌరవం ఇచ్చావా..? మమ్మల్ని అందలం ఎక్కించావా..? మావారికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకట్ట వేస్తావా..? గొడవలు చేయిస్తావా..? ధర్నాలు చేయిస్తావా..? రాజధాని ప్రాంత రైతులు చంద్రబాబు వల్లే మోసపోయారు.
వైయస్ఆర్ కుటుంబం రైతుపక్షపాతి కుటుంబం. చంద్రబాబులా వాడుకొని వదిలేసే రకం కాదు. పేదల బతుకులు మారాలని సీఎం వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడైనా పేదల కోసం ఆలోచన చేశావా..? నీకున్న తోకపత్రికలు, తోక టీవీలను పెట్టుకొని బాకాలు ఊదిస్తే జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలు సీఎం వైయస్ జగన్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు రాజధాని ప్రాంతంలో ఆరు నూరైనా రాష్ట్రంలో సామాజిక పండగ జరగబోతోంది’’ అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.