తాడేపల్లి: రాష్ట్ర ప్రజలపై, రాజధానిపై నిబద్ధత ఉన్న వ్యక్తి అయితే చంద్రబాబు రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావాలని మంత్రి మేరుగ నాగార్జున సవాలు విసిరారు. నీ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చిద్దామన్నారు. సీఎం వైయస్ జగన్ నిరంతరం కంటికి రెప్పలా ప్రజలను చూస్తున్నారు కాబట్టి ఇక చంద్రబాబు ఆటలు సాగడం లేదన్నారు. దళితులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అయితే..బలహీనవర్గాలకు పట్టం కట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ పేదలకు అండగా నిలిచారన్నారు. సీఎం వైయస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలతో పాలన సాగిస్తున్నారు. 2023 ఏప్రిల్ నాటికి విజయవాడ నడిబొడ్డన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు పూర్తి చేస్తామని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.
దళిత కుటుంబాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అవహేళనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. రాజధానిని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా వదిలేశారు. అంబేద్కర్ భావజాలాన్ని భుజాన వేసుకున్న వ్యక్తి సీఎం వైయస్ జగన్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టించాలనే ఆత్రుత, ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. మేం ఢిల్లీ వెళ్లి విగ్రహాన్ని తయారు చేస్తున్న శిల్పాకారులతో మాట్లాడి వచ్చాం. 2023 ఏప్రిల్ నాటికి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాం.
కూలికి వెళ్తే కాని పూట గడవని వారు ఉన్నారని, ఈ ఉద్యమంలో ఎందుకు భాగస్వాములను చేయలేదని ప్రశ్నించారు. గెలాక్సీ వాచ్లను ధరించిన వారు..బెంజి కార్లలో తిరిగేవారా అమరావతి యాత్రలో నడుస్తున్నారు. వీరా ఉద్యమకారులు. 29 గ్రామాలు ఉన్న అమరావతి ప్రాంతంలో సీఎం వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కులాన్ని, మతాన్ని, రాజకీయాలను చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వీటిపై చంద్రబాబు చర్చకు సిద్ధమా?
రాజధాని కావాలని మేం కూడా కోరుకుంటున్నాం. అన్ని ప్రాంతాలు బాగుండాలనే మూడు రాజధానులు కావాలని ఆకాంక్షిస్తున్నాం. మూడు ప్రాంతాలు బాగుండాలని మేం ప్రయత్నం చేస్తున్నాం. రాజధానిని అభివృద్ధి చేయాలని ఎందుకు ఆ రోజు ఆలోచన చేయలేదు చంద్రబాబు. ఐదేళ్లు ఏం చేశావు చంద్రబాబు. రాజధాని ప్రాంత ప్రజలను అడ్డుపెట్టుకొని నీ పబ్బం గడుపుకోవాలని, కోటాని కోట్లు దండుకున్నావే కాని పేద రైతులు, కార్మికులు, కర్షకులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను ఐదేళ్లు దగా చేసిన వ్యక్తి చంద్రబాబు. నీలాంటి మోతుబరులు, దగాకోరులు ఉద్యమం చేస్తున్నారు. మీ ఉద్యమానికి పేదలు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదో సమాధానం చెబుతావా చంద్రబాబు?. కొత్త రాష్ట్రంలో రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయలేదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ నీకు గుర్తుకు రాలేదు. అంతిమయాత్రకు దగ్గరైన రోజుల్లో ఇప్పుడు ఆలోచిస్తున్నావా?. ఇప్పటికే వాటన్నింటిని చంద్రబాబు అగాధంలో తొక్కారు. వైయస్ జగన్ నీలా కాకుండా మూడు ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతున్నారు.
నిజంగా నీవు నిజమైన రాజకీయ నాయకుడివి అయితే రేపు ఎన్నికల్లో మీ సత్తా ఏంటో రుజువు చేసుకోండి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. నీవు బలమైన నాయకుడివి అయితే రాజధాని విషయంలో చర్చించుకుందాం రా. నీవు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని వదిలేశావు. మేం పేదలకు 31 లక్షల పట్టాలు ఇస్తుంటే నీవు ఏం మాట్లాడావో..నీ వైఖరి ఏంటో సమావేశాల్లో నీకు గుర్తు చేస్తాం. రాజధాని ప్రాంతంలో డెమోగ్రఫి ఇన్బ్యాలెన్స్ వస్తుందని చెప్పింది చంద్రబాబు కాదా? మోసాలతో ఇప్పటి దాకా మనగలిగావు. వైయస్ జగన్ నీలా కాదు..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బలంగా పని చేస్తున్నారు. నిరంతరం కంటికి రెప్పలా ప్రజలను చూసుకుంటున్నారు కాబట్టి నీ ఆటలు సాగడం లేదు. నీపై ప్రజలకు విశ్వాసం లేదు. నమ్మకం పోగొట్టుకున్నావు. నీవు ఎలాంటి ఉద్యమాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానులు ఏర్పాటు కావడం ఖాయమని స్పష్టం చేశారు.