తాడేపల్లి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీకి నంబర్ వన్ ర్యాంకు రావడంపై మంత్రి గౌతమ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యల వల్లే ఏపీ టాప్ ర్యాంక్లో నిలిచిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి మొదటిస్థానం రావడంపై మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా వంటి దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ తోడ్పాటునిచ్చారు. పరిశ్రమలు మళ్లీ నడిచేలా ఆర్థిక తోడ్పాటు, భరోసాను సీఎం ఇచ్చారు. పెట్టుబడి దారులకున్న విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని ర్యాంకులిచ్చారు'. 'సింగిల్ డెస్క్ పోర్టల్లో పరిశ్రమలకు భూకేటాయింపులు, వాణిజ్య వివాదాలకు ఈఫైలింగ్ సౌకర్యం. విజయవాడ, విశాఖలో వాణిజ్య వివాదాలకు స్పెషల్ కోర్టు, ఔషదాల విక్రయ లైసెన్స్ ఆన్లైన్లోనే పొందే సౌకర్యం. ఏటా రెన్యూవల్ చేసుకునే అవసరం లేకుండా షాపులకు మినహాయింపు. కార్మిక చట్టాల కింద సింగిల్ ఇంటిగ్రేటెడ్ రిటర్న్స్ దాఖలు, ప్రతి పరిశ్రమలో ఇంజినీర్లతో తప్పనిసరిగా బాయిలర్ ఇన్స్పెక్షన్. ప్రతి జిల్లాలో స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తుంది. హిందూపురం, విజయవాడ, విశాఖ ఇండస్ట్రియల్ పార్కుల్లో వాణిజ్యవేత్తలతో పలుమార్లు ప్రభుత్వం సమావేశాలు నిర్వహించింది’ అని చెప్పారు.