తాడేపల్లి: అన్నదాతలకు అడుగడుగునా అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగ చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. దేశం మొత్తం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తోందని తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పాడంటే..చేస్తాడంటే అంటూ ప్రజలు సంతోషంగా ఉన్నారు. వైయస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ నిధి కింద ఈ రోజు వైయస్ఆర్ రైతు భరోసా సాయం అందిస్తున్నారు. ఇదే రోజు వైయస్సార్ రైతుభరోసా, వైయస్సార్ సున్నావడ్డీ, వైయస్సార్ యంత్ర సేవాపథకం.. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,197 కోట్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేస్తుండటంతో రాష్ట్రంలోని రైతులకు దీపావళి పండుగ ముందే వచ్చింది. ఈ మూడు పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేయడం వల్ల మీకు రైతుల పట్ల ఉన్న ప్రేమ మరోసారి రుజువైంది. ఈ రోజు అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఇందుకు మీ ఆలోచనలు, మీ సంకల్పమే. ఈ రోజు వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాలపై కేంద్రం ప్రశంసిస్తోంది. నీతి అయోగ్ వారు మన నుంచి సమాచారం తీసుకుంటూ అభినందనలు తెలిపాయి. వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు మన రాష్ట్రంలో పర్యటించి రైతు భరోసా కేంద్రాలను అభినందిస్తున్నారు. ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటున్నాం. కేవలం రైతులకు ఇన్పుట్ ఇచ్చే షాప్ మాదిరిగా ఆర్బీకేలు ఉండకుండా ఒక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు ఈ కేంద్రాలు తోడుగా నిలుస్తున్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కటి సోషల్ ఆడిట్ ద్వారా ఆ గ్రామంలో ఏం జరుగుతుందో రైతులకు తెలియజేస్తున్నాం. అర్హులందరికీ ఫలితాలు అందుతున్నాయి. ఈ రోజు 2,197 కోట్లను రైతాంగానికి సహాయం అందించే ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు రైతుల తరపున ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్రెడ్డికి మంత్రి కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు.