ఎన్ని కుట్రలు చేసినా నన్ను ఏం చేయలేరు

మంత్రి కొడాలి నాని
 

అమరావతి: టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా తనను ఏం చేయలేరని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. గుడివాడలోని కే కన్వేన్షన్‌లో క్యాసినో పెట్టినట్లు నిరూపిస్తే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాలు విసిరారు. నా కళ్యాణ మండపంలో ఇలాంటి క్యాసినో జరిగినట్లు మీడియా వెళ్లి చూడాలన్నారు. ఇవాళ టీడీపీ నేతలు అక్కడికి వెళ్లి హడావుడి చేశారట..పోలీసులు ఉండబట్టీ వారు వారు క్షేమంగా బయటపడ్డారని తెలిపారు. న్యూట్రల్‌గా వ్యవహరించే మీడియా గుడివాడకు వస్తే నా రెండున్నర ఎకరాల్లో ఉన్న కళ్యాణ మండపంలో ఎలాంటి జూదం కానీ, క్యాసినో గాని జరిగినట్లు నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని, ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. అలాంటివి లేకపోతే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఏం చేస్తారో సమాధానం చెప్పాలని సవాలు విసిరారు.  

మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే...

  మహిళలను అడ్డం పెట్టుకుని గతంలో రాజకీయం చేసింది, ఇప్పటికీ చేస్తోంది ఎవరో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. గతంలో ఒక మహిళను అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని లాక్కుని, ఆ ప్రభుత్వాన్ని కూలదోసి, ఆ పార్టీ సైకిల్ గుర్తును తెచ్చుకున్న బ్రోకర్ ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు.

  జనవరి 6వ తేదీ నుంచి నేను గుడివాడలో లేను. కొవిడ్ తో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడే ఉన్నాను.  ఈరోజే కేబినెట్ మీటింగ్ కు వచ్చాను. అటువంటిది చంద్రబాబు, ఆయన తొత్తులు, ఆయనకు బాకా ఊదే మీడియా.. గుడివాడలో ఏదో జరిగిపోతుందని, కేసినోలని, జూదాలని ఏవేవో అబద్ధాలను పోగేసి ప్రచారం చేస్తున్నారు. కేసినో అంటే ఏమిటో చంద్రబాబుకు, ఆయన కొడుకు లోకేష్ కే బాగా తెలుసు. ఎందుకంటే, చంద్రబాబు కొడుకు స్విమ్మింగ్ పూల్ లో బట్టలు లేకుండా నిలబడి, మద్యం గ్లాసు పట్టుకుని, తన చుట్టూ నలుగురు మహిళల్ని అర్థనగ్నంగా నిలబెట్టుకుని.. ఏం చేశాడో ఫోటోలతో సహా అంతా చూశారు.

 చంద్రబాబు ఏం చెబితే.. అది చూపించే డబ్బా మీడియా, కుల మీడియా ఆయనకు ఉంది. నేను ఊర్లో లేని సమయంలో గుడివాడలోని నా కళ్యాణ మండపంలో ఏదో జరిగిపోతుందని, ఎక్కడో తీసుకొచ్చిన వీడియోలు చూపించి దుష్ప్రచారం చేస్తున్నారు. రెండున్నర ఎకరాల్లో నా కళ్యాణ మండపం ఉంది.  నా కళ్యాణ మండపంలో క్యాసినోగానీ, పేకాట గానీ పెట్టానని నిరూపిస్తే.. రాజీనామా చేసి, పెట్రోలు పోసుకుని ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. ఛాలెంజ్ చేస్తున్నాను. నిరూపించలేకపోతే చంద్రబాబు, ఆయనకు తొత్తులుగా వ్యవహరించే కుక్కలు ఏం చేస్తాయో చెప్పాలి. 

 రాజకీయంగా చంద్రబాబు ఎప్పుడో సమాధి అయ్యారు. చంద్రబాబుకు ఎటూ సిగ్గూ, శరం లేదు, అందుకే ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు.  ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గుడివాడలో నిజనిర్థారణ కమిటీ పేరుతో చంద్రబాబు రచ్చ చేస్తున్నాడు. అక్కడ ఉద్రిక్తతలు పెంచాలని ప్రయత్నిస్తున్నాడు. నిజ నిర్థారణ కమిటీ పేరుతో వెళ్ళిన వారు ఎవరంటే... ఎప్పుడూ గెలవని వర్ల రామయ్య, విజయవాడలో ఆస్తులు ఆక్రమించి, మహిళల్ని వేధించిన బోండా ఉమ లాంటి వాళ్ళను గుడివాడకు పంపి రచ్చ చేస్తున్నారు. దీనిని పట్టుకుని చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతున్న వారు, ఆయన కుల మీడియా ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. 

 సంక్రాంతి పండుగకు సంప్రదాయంగా జరిగే కోడి పందేలే గుడివాడలో కూడా జరిగాయి. ఎక్కడో డ్యాన్సులు నిర్వహిస్తున్నారని మీడియాలో వార్తలు వస్తే.. నేనే స్వయంగా స్థానిక డీఎస్పీ కి ఫోన్ చేసి, పోలీసుల్ని పంపించి అడ్డుకున్నాం. చంద్రబాబు కాదు కదా.... ఎవరొచ్చినా గుడివాడలో నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.

 చంద్రబాబు ప్రచారం చేసే అబద్ధాలను కాసేపు పక్కన పెట్టి, వాస్తవాలేమిటో, గుడివాడలో ఏం జరిగిందో న్యూట్రల్ గా ఉండే  మీడియా ప్రతినిధులు వెళ్ళి అక్కడి ప్రజలను అడిగితే చెబుతారు. పూర్తి వాస్తవాలను తెలుసుకునే మీడియా ప్రజలకు అందిస్తే మంచిది. చంద్రబాబు కుల మీడియా, డబ్బా మీడియా చెప్పినట్టు గుడివాడలోని నా కళ్యాణ మండపంలో అటువంటివేవీ జరగలేదన్నది వాస్తవం. 

 ఇప్పటికీ ఆడవాళ్ళను అడ్డు పెట్టుకుని బతికుతున్న చరిత్ర చంద్రబాబుదే, ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు ఆయన భార్య లక్ష్మీ పార్వతిని అడ్డు పెట్టుకుని పార్టీని, అధికారాన్ని లాక్కున్న వ్యక్తి. ఆ తర్వాత ఓ మహిళను అడ్డు పెట్టుకుని సైకిల్ గుర్తును తెచ్చుకున్న వ్యక్తి, తన స్వార్థ రాజకీయాలకోసం ఇప్పుడు తన భార్యను రోడ్డు మీదకు తెచ్చిన వ్యక్తి కూడా చంద్రబాబే. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు.

Back to Top