రాజకీయ దురుద్దేశంతోనే దుష్ప్రచారం

చంద్రబాబు అసమర్ధత వల్లే విత్తన సేకరణకు ఆలస్యం

అయినా అడ్డంకులు అధిగమించి నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేశాం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి: రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వంపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. విత్తన సేకరణ డబ్బులను దారి మళ్లించిన టీడీపీ, విత్తనాల బకాయిలు చెల్లించకుండా కుట్ర చేసిందని మండిపడ్డారు. దాదాపు రూ. 380 కోట్ల బకాయి చెల్లించకుండా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టాలనే దుర్బుద్దితో గత టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. విత్తనాల సేకరణ, పంపిణీపై మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు బకాయిలు చెల్లించాలని, చెల్లింపులు చేస్తే కానీ కొత్తగా వచ్చి విత్తనాలు సరఫరా చేయరని 50 ఉత్తరాలు అధికారికంగా రాసినా గత ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. ఆనాటి వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శికి రెండుసార్లు నోట్‌ పంపించారని, ఇదే పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వకపోతే 2019 ఖరీఫ్‌లో విత్తనాలు సరఫరా చేయడం కష్టం అవుతుందని చెప్పినా గత టీడీపీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆ లేఖలకు ఆర్థిక శాఖ మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తామని నిర్లక్ష్య సమాధానం ఇచ్చిందని చెప్పారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్‌ను డిమాండ్‌ చేసి కమిషన్‌కు ఎజెండా పంపించి మరీ కేబినెట్‌ మీటింగ్‌ పెట్టారు.. కానీ విత్తనాలు, పంపిణీ, నిధుల కేటాయింపు గురించి చర్చించలేకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు అసమర్ధత వల్లే విత్తనాల సేకరణకు ఆలస్యమైందన్నారు. 
 
వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేనాటికి రాష్ట్రంలో అత్యవసరమైన వేరుశనగ విత్తనం 4.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కావాలని అంచనా ఉంటే కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఎంతధర అయినా పర్వాలేదు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి రైతులకు పంపిణీ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినవి అనంతపురం జిల్లాలో 2,74,079 క్వింటాళ్లు, కడప జిల్లాలో 30,867 క్వింటాళ్ల, కర్నూలులో 29,021 క్వింటాళ్ల, చిత్తూరులో 63,312 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశామన్నారు. ఇవే కాకుండా రైతులు కోరితే వెంటనే ఇచ్చేందుకు విత్తనాలు నిల్వ ఉంచామన్నారు. రైతు ఏ దశలోనూ ఇబ్బది పడకూడదని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చేశారన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారని, రైతుకు అందించే ప్రతి ఇన్‌పుట్‌ విత్తనం, పురుగుల మందు, ఎరువులు, మట్టి నమూనాలను పరీక్ష చేస్తారన్నారు. ఈ సంవత్సరమే ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురుపడినా వాటిని అధిగమించి రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడగలిగామన్నారు. 

Back to Top