రైతులను మోసం చేసినందుకే చంద్రబాబును చిత్తుగా ఓడించారు

మంత్రి కన్నబాబు

అమరావతి తానే నిర్మిస్తానని తప్పుడు హామీ ఇవ్వడంతో ఆయన కుమారుడిని ఓడించారు

వ్యవసాయాన్ని ఉద్దరించానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు

వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం రైతులకు కీలకం

రైతుల పక్షాన ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది

రెండేళ్ల వైయస్‌ జగన్‌ పాలనలో రైతులకు రూ.83 వేల కోట్లు ఖర్చు

తాడేపల్లి:  2014 ఎన్నికల సమయంలో రైతులను పంట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకొని మోసం చేసిన చంద్రబాబును 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకొని చంద్రబాబు ..రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచిందని, ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా నిలిచిందని చెప్పారు. వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంపై టీడీపీ నేతల ఆరోపణలను మంత్రి ఖండించారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకున్నారు. ఐదేళ్లలో రుణాలు మాఫీ చేయకుండా మోసం చేయడంతో 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. టీడీపీ అధికారంలోకి  వచ్చిన తరువాత అమరావతిని తానే కడుతున్నానని ప్రచారం చేస్తే ..2019 ఎన్నికల్లో అమరావతిలో ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఘోరంగా ఓడిపోయారు.  కుక్క తోక వంక అన్నట్లుగా టీడీపీ నేతల తీరు ఉంది. వ్యవసాయాన్ని తానే ఉద్దరించినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. చంద్రబాబు మహా మేధావి అని ఆయన అంతకు ఆయనే అనుకుంటారు. ఇది తప్పు అని ఖండించారు.

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతులు నష్టపోకూడదని ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలిచారు. గత 23 నెలల్లోనే రైతులకు ఏకంగా రూ.83 వేల కోట్లు ఖర్చు చేశాం.  రైతుల కోసం ఎన్నో పథకాలను సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. ఇందులో కీలకమైన పథకం ఏంటంటే..వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం. గతంలో ఎవరైన రైతులు పంట రుణాలు తీసుకొని, పంటలు చేతికందని పరిస్థితిలో రుణాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడేవారు. పంటల బీమా సకాలంలో అందక అవస్థలు పడేవారు. వైయస్‌ జగన్‌ తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత పంటల బీమా పథకాన్ని ఏర్పాటు చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని నెరవేర్చారు. మొదటి ఏడాది ఒక కంపెనీతో గతంలో మాదిరిగానే పరిహారం అందించాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఓ బీమా కంపెనీ స్థాపించి బీమా చెల్లిస్తోంది. 

గతేడాది నుంచి ఇప్పటి వరకు రూ.1968 కోట్లు బీమా క్లైమ్‌లు, నిన్న రూ.1820 కోట్లు కలిపి రూ.3,788 కోట్లు పంటల బీమాను రెండేళ్లలో చెల్లించాం. ఇందులో విచిత్రం ఏంటంటే..గతంలో ప్రభుత్వం తరఫున ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారు. చెల్లించిన ప్రీమియానికి క్లైమ్‌ చెల్లించలేదు. దాదాపుగా రూ.715 కోట్లు బకాయిలు పెట్టారు. పులివెందుల ప్రాంతంలో పంట వేసిన తేదీలు నమోదు చేయకపోవడంతో పరిహారం చెల్లించలేదు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక రూ.110 కోట్లు చెల్లించారు. 
టీడీపీ ప్రభుత్వం రూ.2009 కోట్లు మాత్రమే బీమా కింద అందజేసింది.  టీడీపీ హయాం కంటే వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక 120 శాతం మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారని మంత్రి కన్నబాబు తెలిపారు.  

 

Back to Top