నెల్లూరు: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పోట్లపూడి సచివాలయ పరిధిలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.1కోటి 14 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కాకాణి ప్రారంభించారు.
తోటపల్లి గూడూరు మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగింపు సందర్భంగా అభిమానుల కేరింతల మధ్య మంత్రి కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి గడప తలుపు తట్టి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆరా తీస్తున్నామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం విశిష్టమైన కార్యక్రమం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సమర్ధవంతంగా, సమగ్రంగా, సంపూర్ణంగా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా జన్మభూమి కమిటీల జోక్యం లేకుండా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. గ్రామాలకు వెళ్లే రహదారులకు నిధులు కేటాయించి, పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా పక్షపాత వైఖరి లేకుండా, గ్రామాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కరువు విలయ తాండవం ఆడేదని ఎద్దేవా చేశారు. రైతులకు మొదటి పంటకు కూడా సాగునీరు అందించే పరిస్థితి టీడీపీ పాలనలో లేదన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎప్పుడూ లేనివిధంగా రెండో పంటకు కూడా సాగు నీరు అందిస్తున్నామని వెల్లడించారు. రైతులు సంతోషంగా నాట్లు వేసుకుంటుంటే ఆనందం కలుగుతుందన్నారు.