సత్యకుమార్.. ఒళ్లు దగ్గర పెట్టుకో..

మ‌రోసారి నోరుజారితే త‌గిన‌శాస్తి జ‌రుగుతుంది

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ హెచ్చ‌రిక‌

విజ‌య‌వాడ‌: రాష్ట్ర ప్రభుత్వం గురించి, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి మాట్లాడే ముందు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడాల‌ని బీజేపీ నేత స‌త్య‌కుమార్‌ను గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ హెచ్చ‌రించారు. అసలు ఈ రాష్ట్రంలో స‌త్య‌కుమార్ అనే వ్య‌క్తిని ఎవరైనా గుర్తుపడతారా..?. అని ప్ర‌శ్నించారు. సత్య కుమార్ అనే వ్యక్తి అసత్య కుమార్‌గా మారి అబద్ధాలు ప్రచారం చేస్తూ, తద్వారా మరెవరికో రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాడని మండిప‌డ్డారు. ఆయ‌న‌ మాటలు చూస్తుంటే.. అసలు ఆ వ్యక్తి బీజెపి కార్యదర్శా..? లేక‌ టీడీపీ కార్యదర్శా అనే అనుమానం క‌లుగుతుంద‌న్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి బీజేపీ నేర్చుకోవాల‌న్నారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు ఉన్నాయా అని ప్ర‌శ్నించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ప‌రిపాల‌న గ్రామ స్థాయికి చేరింద‌న్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ బటన్ నొక్కితే ప్రతి గడపకూ, ప్రతి రైతు కుటుంబానికీ, ప్రతి అక్కచెల్లెమ్మకూ సంక్షేమ సాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జ‌మ అవుతుంద‌న్నారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చూశావా సత్యకుమార్..? అని మంత్రి జోగి ర‌మేష్ ప్ర‌శ్నించారు. 

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ నేతృత్వంలో జరుగుతున్న సంక్షేమం చూసి ఓర్వలేక, సత్య కుమార్ లాంటి వారు చేస్తున్న అసత్య, అసందర్భ పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అలాంటి వారికి ప్ర‌జ‌లు సరైన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ ఎజెండాతో  సత్యకుమార్ అసత్యాలను, అవాస్తవాలు ప్రచారం చేసి ప్రభుత్వంపై బురదచల్లాలని చూస్తున్నాడని మండిప‌డ్డారు. మరొకసారి పిచ్చిపిచ్చి మాట‌లు మాట్లాడితే సత్యకుమార్ కి తగిన శాస్తి జరుగుతుందని  మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు.

Back to Top