కర్నూలు: చంద్రబాబు అండ్ కో దోపిడీకి ఇన్కం ట్యాక్స్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ నిదర్శనమని, రూ.2 కోట్లు టీడీపీ దోపిడీకి మచ్చుతునక మాత్రమేనని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం పెట్టి మరీ అప్పు తెచ్చిన సొమ్మును బోగస్ కంపెనీలు పెట్టి దొంగ బిల్లులు సృష్టించి డబ్బులు దోచేశారని, దోచుకున్న డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించారని మండిపడ్డారు. 25 సంవత్సరాలుగా చంద్రబాబు దగ్గర పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాస్పై ఐటీ సోదాలు జరిగితే తమకేం సంబంధం అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఐటీ దాడులపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
కర్నూలులో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంట్ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 40 స్థావరాల్లో తనిఖీలు చేపడితే.. కొన్ని వ్యాపార సంస్థలు బోగస్ కంపెనీలు పెట్టి వాటి ద్వారా డబ్బులు ఖర్చు అయినట్లుగా చూపించుకొని నగదుగా మార్చి దొంగ బిల్లులు సృష్టించి పెద్ద కంపెనీల్లో సబ్ కాంట్రాక్టులు చేసినట్లుగా నటించి డబ్బును హవాలా ద్వారా ఇతర దేశాలకు పంపించడం. ఇది రూ.2 వేల కోట్లు ప్రాథమికంగా బయటపడిన అంచనా.. ఇంతకంటే ఎక్కవగానే ఉంటుంది. రూ.2 వేల కోట్ల టర్నోవర్ కంటే తక్కువగా ఉండేట్లు ఎన్నో కంపెనీలు సృష్టించారు. రూ.2కోట్ల కంటే తక్కువ ఉంటే జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. దీని వల్ల ఇన్కంట్యాక్స్ పరిధిలోకి రాదు.
జీఎస్టీ రిటర్న్స్, ఐటీ ఫైల్ చేశారో.. అవన్నీ కూడా ఐపీ అడ్రస్ ఒకటే ఉంది. ప్రతి కంప్యూటర్కు ఒక ప్రత్యేకమైన అడ్రస్ ఉంటుంది. ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఇదంతా జరిగిందని నిర్ధారణ జరిగింది. ఇన్కంట్యాక్స్ డిపార్టుమెంట్ అఫీషియల్ స్పోక్స్మెన్, కమిషనర్ ర్యాంకు అధికారి సురభి అహ్లూవాలియా రూ.2 వేల కోట్ల అక్రమాలపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. రూ.2 వేల కోట్ల పైగా దొంగబిల్లులు, హవాలా జరిగిందో.. పేరుగాంచిన వ్యక్తికి పర్సనల్ సెక్రటరీ దీంట్లో ప్రధాన వ్యక్తి అని తేల్చింది. ఎవరు మెయిన్ పర్సన్ అంటే పెండ్యాల శ్రీనివాస్ ఇతను 1995 నుంచి 2004 వరకు నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా శ్రీనివాస్ అప్పటి సీఎం కార్యాలయంలో పనిచేశారు. 2004లో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా.. శ్రీనివాస్ పీఏగా చేరాడు. 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబుకు పీఎస్గా మారాడు. 25 సంవత్సరాలుగా పెండ్యాల శ్రీనివాస్.. చంద్రబాబు దగ్గర ఉంటున్నాడు.
రూ.2 వేల కోట్లు దొంగ కంపెనీలు సృష్టించి క్యాష్ విత్డ్రా చేసి ఇతర దేశాలకు హవాలా రూపంలో పంపించడం. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్తో పాటు ఇంకా ఎవరెవరి మీద తనిఖీలు జరిగాయంటే.. కిలారి రాజేష్. ఇతను ఎవరంటే నారా లోకేష్కు బాల్య స్నేహితుడు.. ఆ తరువాత అంచలంచెలుగా బంధం ముదిరి టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమింపబడ్డాడు. కిలారి రాజేష్కు నిర్వాణ హోల్డింగ్స్, హెరిటేజ్ గ్రూపు సంస్థల్లో పాత్ర ఉందనేది అభియోగం.
ఆ తరువాత ఆర్కే ఇన్ఫ్రా.. 2014 నుంచి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులురెడ్డికి సంబంధించిన కంపెనీ. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్బాబు కంపెనీ. పెద్ద కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టు చేస్తున్నట్లుగా సృష్టించి.. పనిచేయకుండానే బిల్లులు సృష్టించడం.. ఖర్చు అయ్యిందని డబ్బు డ్రా చేసి హవాలా ద్వారా వేరే దేశాలకు తరలించడం. పెండ్యాల శ్రీనివాస్, కిలారి రాజేష్, ఆర్కే ఇన్ఫ్రా, శరత్బాబు వీళ్లంతా ఎవరి తరుఫు అనేది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు.
వీళ్లు ప్రతి రోజు నీతి, పద్ధతి, నియమం గురించి లెక్చర్స్ ఇస్తుంటారు. వాళ్ల దగ్గర నీతి, పద్ధతి నేర్చుకోవాలంట. పీఎస్ మీద ఐటీ రైడ్స్ జరిగితే మాకేం సంబంధం అని మాట్లాడుతున్నారు. 25 సంవత్సరాలుగా టీడీపీ ముఖ్య అనుచరుడిగా ఉన్న వ్యక్తిపై సోదాలు జరిగితే సంబంధం లేదంటున్నారు. ప్రత్యర్థి పార్టీకి సంబంధం ఉంటుందా..? యనమల ఇంగ్లిష్ ప్రెస్ రిలీజ్ మాకు అర్థం కావడం లేదని మాట్లాడుతున్నారు. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్లో ఏముందో యనమల మీడియాకు వివరించాలి. ఇంత జరుగుతుంటే చంద్రబాబు, లోకేష్ నాయుడు ఎందుకు మాట్లాడడం లేదు.
టీడీపీ ప్రభుత్వం విపరీతంగా అవినీతి చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. సీఆర్డీఏ ప్రాంతంలో దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన పనులు ఫస్ట్ ఫేజ్లో చేపడతామని చెప్పి.. రూ. 50 వేల కోట్లకు టెండర్లు ఫ్లోడ్ చేసి.. రూ.5 వేల కోట్లు కూడా బ్యాంక్ అనుసంధానం లేకుండా ఫ్లోడ్ చేసి బడా కాంట్రాక్టర్లకు అప్పగించి 2019 ఎన్నికలు మూడు నెలలు ఉందనగా.. హుటాహుటిన మధ్యాహ్న భోజనం, ఔట్సోర్సింగ్, ఆరోగ్యశ్రీ బిల్లులు ఆపి అప్పటికప్పుడు వేల కోట్ల రూపాయల బిల్లులు చేసిన మాట వాస్తవమా కాదా..? కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి రూ. 40 కోట్లు ఖర్చు చేసింది. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా చంద్రబాబు దుర్వినియోగం చేశారు.
ఐదు సంవత్సరాల పరిపాలనలో కేవలం రూ. 177 కోట్లు మాత్రమే రాజధాని నగరం కోసం ఖర్చు చేశారు. మిగతా అంతా అప్పు చేసి ప్రజల తలపై మోపారు. అప్పు తెచ్చిన డబ్బులను దోచుకొని వేరే దేశాలకు తరలించినట్లుగా నిర్ధారణ అవుతుంది. అమరావతిలో తాత్కాలిక భవనాలకు చదరపు అడుగు రూ. 10 వేలు ఖర్చు చేశారు. నాలుగు శతాబ్దాల చరిత్ర గల హైదరాబాద్లో గచ్చిబౌలి, నానక్రాంగూడలో భూమి విలువతో కలిసి రూ.6 వేలకు అడుగు దొరుకుతుంది. అడ్డగోలుగా కాంట్రాక్టులు ఇచ్చి ఆ డబ్బంతా సబ్ కాంట్రాక్టుల పేరుతో దొచుకొని ఇతర దేశాలకు పంపించారు.
అమరావతిలో భూ కేటాయింపులు ఎలా ఉన్నాయంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఎస్బీఐ, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకులకు ఎకరం రూ.4 కోట్లకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 60 సంవత్సరాలు లీజ్ అని చెప్పి రూ.2 కోట్లకు కేటాయించారు. భారత నేవీ, ఆర్మీకి 60 సంవత్సరాలు లీజ్ అని చెప్పి రూ. 2 కోట్లకు లీజ్కు ఇచ్చారు. కానీ, చంద్రబాబుకు నచ్చిన కాలేజీలకు మాత్రం ఎకరం రూ.50 లక్షల చొప్పున 150 ఎకరాలు, 200 ఎకరాలు అమ్మేశారు. పరిశ్రమలకు ఇష్టం వచ్చినట్లుగా భూ కేటాయింపులు చేశారు. ఒక పాలసీ, పద్ధతి లేకుండా నచ్చినట్లుగా చేశారు. ఇది చంద్రబాబు చేసిన ఘనకార్యం. ప్రజల తల మీద అప్పు చేసి దాన్ని ఇన్ఫ్రా కంపెనీల పేరుతో దొచుకొని ఇతర దేశాలకు పంపిస్తే సంతోషం జనానికి ఎందుకు వస్తుంది. 2014 జూన్లో ప్రభుత్వం ఏర్పాటయితే డిసెంబర్ 31 అమరావతి రాజధాని అని చెప్పారు. రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు.