విజయనగరం: లబ్ధిదారుల చిరునవ్వులే సంక్షేమానికి నిదర్శనమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గుర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ ఆసరా మూడో విడత వారోత్సవాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, పలాస నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కే వి సూర్యనారాయణ రాజు(పులి రాజు) తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అక్కా చెల్లెమ్మల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్ఆర్ ఆసరా మూడో విడత నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. కరోనా వంటి మహమ్మారి వల్ల రెండు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం వైయస్ జగన్ ప్రతి ఏడాది కూడా చెప్పిన సమయానికి మీ మీ ఖాతాలలో క్రమం తప్పకుండా జమ చేయడం జరుగుతున్నదన్నారు. ఇదంతా కూడా జగనన్నకు అక్కా చెల్లెమ్మలైన మీ మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ వల్లనే చేస్తున్నారన్నారు. మహిళలు ఎందులోనూ తీసిపోకూడదని వారు ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే జగనన్న లక్ష్యమన్నారు. కాబట్టి వారికి మీ అండదండలు ఉండాలని రాబోయే 2024 ఎన్నికల్లో మీ అభిమానాన్ని జగనన్న పై చూపాలని ఆకాంక్షించారు.