అపోహలు పెట్టుకోవద్దు.. క్లీన్‌స్వీప్‌ చేస్తాం

మా ప్రభుత్వం సంక్షేమానికి మారుపేరుగా నిలిచింది

పార్టీ సమీక్షా సమావేశంపై ఇష్టం వచ్చినట్లు రాస్తారా? 

రిషికొండపై గెస్ట్‌హౌస్, కార్యాలయాలు కడుతున్నాం.. నిర్మాణాలు చేస్తే తప్పేమిటి?

నాడు మ‌హానేత‌ వైయస్ఆర్ హయాంలోనే విశాఖ అభివృద్ధి

మొత్తం రాష్ట్ర అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ

అసలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారో చెప్పండి

టీడీపీ నేత‌లపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వ‌జం

విశాఖపట్నం: మా నాయకుడు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 175 సీట్లు గెలవాలని టార్గెట్‌ ఫిక్స్ చేశార‌ని, కచ్చితంగా 175 అసెంబ్లీ సీట్లకు 175 గెలుస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మళ్లీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని, దానికి తగ్గట్టు కార్యాచరణ జరుగుతుందన్నారు. ఎవ్వరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని క్లీన్‌స్వీప్‌ చేస్తామని ఎల్లోమీడియాకు చురకలంటించారు. విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. పది సీట్లు పోయినా పర్వాలేదని ఏ రాజకీయ పార్టీ ఆలోచించదని, అలా ఆలోచన చేస్తే త‌న‌ దృష్టిలో అది రాజకీయ పార్టీయే కాదన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ 175 సీట్లకు 175 గెలవాలని టార్గెట్‌ పెట్టుకున్నారని, తప్పకుండా గెలిస్తామన్నారు. దివంగత మహానేత  వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా.. తండ్రి ఒక అడుగు వేస్తే తాను రెండు అడుగులు వేస్తానని చెప్పిన మాట ప్రకారం సీఎం వైయస్‌ జగన్‌.. గత మూడు సంవత్సరాలుగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో నూటికి 97 శాతం నెరవేర్చారన్నారు. సంక్షేమానికి సంబంధించి నూటికి నూరు శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. ఒక పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రభుత్వంపై బురదజల్లే విధంగా తప్పుడు కథనాలు రాస్తున్నాయన్నారు. ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందన్నారు. 

ఎవరి కోసం యాత్ర?..
విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అది వద్దు అని, తెలుగుదేశం పార్టీ రైతుల పేరుతో, ఆ ముసుగులో అమరావతి టు అరసవెల్లికి పాదయాత్ర చేస్తోంది. తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం, తమ భూముల ధరల కోసమే ఆ యాత్ర చేస్తున్నారు. 26 జిల్లాలు అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వ ఆశయం. అందులో భాగంగానే విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. కానీ అది వద్దని అంటున్నారు. అది ఏ మాత్రం సరి?

ఆయన ఒక మహాజ్ఞాని!..
ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక మహాజ్ఞాని, యుగ పురుషుడు. అందుకే మమ్మల్ని దద్దమ్మలు అంటున్నాడు. మనిషి పెరిగాడు కానీ, బుర్ర ఎదగలేదు. వాయిస్‌ ఉంది కదా.. అని ఏదో మాట్లాడుతున్నాడు. ఈ మూడేళ్లలో మేమేం చేశామని అడుగుతున్నాడు. మరి మీరు కూడా అంతకు ముందు మీ ప్రభుత్వం 14 ఏళ్లు ఉంది కదా? నీకు కూడా మంత్రిగా పని చేశావు కదా? మరి ఈ మూడు జిల్లాలలో ఏం చేశావో, నీ మార్క్‌ ఏమిటో చెప్పండి. అలాగే మున్సిపల్‌ మంత్రిగా బండారు సత్యనారాయణమూర్తి పని చేశారు. ఆయన అయినా తన మార్క్‌ ఏమిటన్నది చెబుతారా?

మేము చెప్పగలం..
కానీ నేను చెబుతాను. విశాఖలో గతంలో కేంద్ర సంస్థలు కాకుండా, ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే, అది కచ్చితంగా వైయస్సార్ హయాంలోనే. ఆయన హయాంలోనే లా యూనివర్సిటీ, హెల్త్‌ సిటీ, విమ్స్, ఫార్మా సిటీ, సెజ్, గంగవరం పోర్టు, కొండ మీద ఐటీ పార్క్‌.. ఇవన్నీ వచ్చాయి. కాదంటారా టీడీపీ వారిని చెప్పమనండి. హుద్‌హుద్‌ తుపాన్‌ వస్తే, ఆ పేరుతో ఎమ్మార్వో ఆఫీస్‌లో రికార్డులు తడిచిపోయాయని చెప్పి, మొత్తం ఈ ప్రాంతాన్ని దోచుకుతిన్నారు. తుపాన్‌ పేరు చెప్పి, రికార్డులు తారుమారు చేసిన దౌర్భాగ్యులు, మా గురించి మాట్లాడుతున్నారు. వైయస్సార్‌ హయాంలో చేసిన పనుల వల్లే కదా.. విశాఖకు గుర్తింపు వచ్చింది. నగరం అభివృద్ధి చెందింది.

అక్కడ కడితే తప్పేమిటి?..
రిషికొండ గురించి మాట్లాడుతున్నారు. దానిపై గతంలో ఏముంది? ఒక హరిత గెస్ట్‌హౌజ్‌ ఉంది. అది దారుణంగా మారడంతో.. ప్రభుత్వం అక్కడ మరో గెస్ట్‌హౌజ్‌ కడితే తప్పేమిటి? అక్కడ ప్రభుత్వ కార్యాలయం, సీఎం అధికార నివాసం కడితే తప్పేమిటి?. గతంలో హైదరాబాద్‌లో నాటి సీఎం వైయస్సార్, అధికార నివాసం కట్టారు. ఆ తర్వాత కేసీఆర్‌ వచ్చాక, మరో భవనం కట్టారు. ఎవరు సీఎంగా ఉన్నా, అవి అధికార నివాసంగా ఉంటాయి. రిషికొండ మీద ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ ప్రభుత్వ కార్యాలయం, గెస్ట్‌హౌజ్‌ కడితే తప్పేమిటి? అక్కడ గుడి, మసీదు లేక చర్చి లేవు కదా?

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కోరుతున్నాం..
తల్చుకుంటే యాత్రను 5 నిమిషాల్లో ఆపేస్తామని మంత్రి అన్నారని విమర్శిస్తున్నారు. కానీ మేము ఆ పని చేయబోమని చెప్పాం. వ్యవస్థలను గౌరవిస్తామని చెప్పాం. కానీ దాన్ని కూడా తప్పు పడుతూ, ఈనాడు వంటి పత్రికలో విమర్శలు చేశారు. రైతుల కండువా వేసుకుని ఎందుకా యాత్ర? ఏకంగా టీడీపీ కండువాలు వేసుకోవడం ఎందుకు? మీకు ఆ ధైర్యం లేదా? కానీ నాకు ఆ ధైర్యం ఉంది. ఉత్తరాంధ్రలో పుట్టిన వ్యక్తిగా నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతం అభివృద్ది కోరుకుంటున్నాను. నేను అలా అంటే యాత్ర నిర్వహిస్తున్న ఒకరు నాపై విమర్శలు చేశారు. ఇప్పుడు చెబుతున్నాను. ఆయన ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. నేను మంత్రిగా ఉన్నప్పుడు సమస్యలపై నన్ను కలిశారు. కాదంటారా? చెప్పండి. 

మీది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం..
ల్యాండ్‌ పూలింగ్‌ అనేది కొత్త కార్యక్రమం ఏదీ కాదు. గతంలో వైయస్సార్ కూడా చేశారు. ఇటీవలే ఇక్కడ పేదల ఇళ్ల కోసం దాదాపు 6 వేల ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌ చేసి, డెవలప్‌ చేసి ఇచ్చాం. అదేమీ కొత్త స్కీమ్‌ కాదే?. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి, ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడం కోసం తప్ప ఏముంది. అది వాస్తవం కాదా? అందుకే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. మీరు అలా మాట్లాడితే, ఇక్కడ కూడా ఎవరో ఒకరు మాట్లాడతారు. దాని వల్ల రాజకీయాలు పల్చన అవుతున్నాయి. రాజకీయ నేతలకు నోరు అదుపులో ఉండాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. భాష మీద అదుపు, విషయం మీద పట్టు ఉండాలి.

రాజు ఏం వెలగబెట్టారు?..
ఇక విజయనగరంలో మా రాజు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేశారు. సుదీర్ఘకాలం రాష్ట్ర మంత్రిగా పని చేశారు. మరి విజయనగరంకు ఏం చేశాడో చెప్పమనండి? కనీసం ఒక్క గుర్తింపు చెప్పమనండి?. కానీ నేను చెబుతాను. విజయనగరానికి మెడికల్‌ కాలేజీ, ఒక ఇంజనీరింగ్‌ కాలేజీ, యూనివర్సిటీ, పాలిటెక్నిక్‌ కాలేజీ తెచ్చాం. కాదంటారా? తాగునీటి కోసం వైయస్సార్ హయాంలోనే పనులు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో, ఆ పనులూ ఆపేశారు. ఇప్పుడు మా రాజు కూడా విమర్శలు చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు. కనీసం విభజన చట్టంలో ఉన్న యూనివర్సిటీని కూడా తీసుకురాలేకపోయావు? ఏం మాట్లాడుతున్నావు?

ఆ విషయం చెప్పండి..
అసలు విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఎందుకు వద్దు? చెప్పండి. అమరావతిలోనే అన్నీ ఎందుకు వద్దో మేము స్పష్టంగా చెబుతున్నాం. ఒకేచోట జాతి సంపద దాదాపు రూ.5 లక్షల కోట్లు పెట్టడం సరికాదని అంటున్నాం. ఇక్కడ విశాఖలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. నిజానికి ఈ నగరం అన్నింటా వెనకబడి ఉంది. నగరం అభివృద్ధి చెందకూడదా? ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని వద్దని ఏ రకంగా అంటున్నారు?. ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వచ్చి తీరుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అది ఆగబోదు.

 

తాజా వీడియోలు

Back to Top