నీ మీద నీకు న‌మ్మ‌కం ఉంటే రాజీనామా చేసి ప్ర‌జ‌ల ముందుకురా

చంద్ర‌బాబుకు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌వాల్‌

రాజీనామాల‌పై చంద్ర‌బాబుది వితండ‌వాదం

రాష్ట్ర అభివృద్ధిని ఆటంక‌ప‌రుస్తూ విధ్వంస‌కారిలా మారాడు

13 జిల్లా స‌మ‌గ్రాభివృద్ధే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ల‌క్ష్యం

అమ‌రావ‌తి రాజ‌ధాని కాద‌ని ఎవ‌రు చెప్పారు చంద్ర‌బాబూ..?

విశాఖ‌ప‌ట్నం: రాజీనామాల‌పై చంద్ర‌బాబుది వితండ‌వాదమ‌ని, ద‌మ్ముంటే.. నీ మీద నీకు న‌మ్మ‌కం ఉంటే రాజీనామా చేసి ప్ర‌జ‌ల ముందుకురా చంద్ర‌బాబు అని రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌వాల్ విసిరారు. అమ‌రావ‌తి రాజ‌ధాని కాద‌ని ఎవ‌రు చెప్పార‌ని, శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తి  కొన‌సాగుతుంద‌న్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ రాష్ట్ర అభివృద్ధి కోసం, 5 కోట్ల ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్నార‌ని, చంద్ర‌బాబు మాత్రం త‌న స్వార్థం, దోపిడీ, త‌న సామాజిక వ‌ర్గం కోసం రాష్ట్రాన్ని తాక‌ట్టుపెట్టాడ‌న్నాడు. ఏదైనా స‌మ‌స్యపై పోరాటం చేయాల‌నుకుంటే రాజీనామా చేసి వెళ్లాలని, చంద్ర‌బాబు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారన్నారు.

విశాఖ‌ప‌ట్నంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాల‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏం మాట్లాడారంటే..

ఇంకో 48 గంట‌ల త‌రువాత ముందుకువ‌స్తాన‌ని చంద్ర‌బాబు అంటున్నాడు. వ‌చ్చి ఏం చేస్తావ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేశావ్‌.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు శాస‌న‌స‌భ‌లో ఈర‌కంగా మాట్లాడార‌ని వెనుక‌, ముందు ఉన్న వాఖ్యాలు క‌ట్ చేసి..  ఏ వాఖ్యం కావాలో ఆ వాఖ్యాన్ని అందంగా చూపిస్తున్నారు చంద్ర‌బాబు. ఇలాంటి లాజిక్‌లు, మ్యాజిక్‌ల‌కు చంద్ర‌బాబు పేటెంట్ అని దేశంలోని అంద‌రికీ తెలుసు.
 
చంద్ర‌బాబు యూస్ అండ్ త్రో లీడ‌ర్ అని ఉమ‌ర్ అబ్దుల్లా చెప్పారు. దేశ రాజ‌కీయాల్లోని నాయ‌కుల‌కు కూడా చంద్ర‌బాబు గురించి తెలుసు. చంద్ర‌బాబు భజ‌న చేసే ప‌త్రిక‌ల్లో ప్ర‌భుత్వం తోక‌ముడిచింద‌ని రాశారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ప‌నిచేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో వైయ‌స్ఆర్ సీపీ ప‌నిచేస్తుంది. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ఆర్ స్ఫూర్తితో పుట్టిన పార్టీ ఇది. ఆయ‌న ఎలాగైతే ఎన్నిక‌ల్లో చెప్పిన వాగ్దానాలు నెర‌వేర్చారో.. ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఏర‌కంగా స్థానం సంపాదించారో.. ఆర‌కంగా ఆయ‌న తన‌యుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కూడా ప‌నిచేస్తున్నారు.

చంద్ర‌బాబు నాయుడును సూటిగా ప్ర‌శ్నిస్తున్నా.. ఇచ్చిన మాటను గౌర‌వించి.. నిల‌బ‌డ్డావా..? వైయ‌స్ఆర్ సీపీకి ఓటు వేస్తే క‌రెంటు షాక్ కొడుతుంద‌ని ఆరోజున చెప్పాడంట‌.. అంత‌కు ముందు ఎన్నిక‌ల‌ప్పుడు ఇంకో మాట కూడా చెప్పాడు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగ‌ల మీద బ‌ట్ట‌లు ఆరేసుకోవాల‌ని అన్నాడు.. త‌రువాత ఏమైంది... దేశమంతా ఉచిత విద్యుత్ మాటే చెబుతుంది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, 5 కోట్ల‌ప్ర‌జ‌ల కోసం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌నిచేస్తున్నారు. మూడు ప్రాంతాల్లో రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తున్నారు. చంద్ర‌బాబు మాత్రం త‌న ఆస్తులు పెంచుకోవాల‌ని, బినామీల బాగుండాల‌ని, త‌న సామాజిక‌వ‌ర్గం అభివృద్ధి చెందాల‌ని కోరుకుంటున్నాడు.

ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్ర‌బాబు అంటున్నాడు. కోర్టుల్లో కేసులు వేయిస్తున్నాడు. చిన్న చిన్నసాంకేతిక కార‌ణాల‌ను ప‌ణంగా పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధికి ఆటంక‌ప‌రుస్తూ విధ్వంస‌కారిగా చంద్ర‌బాబు దాప‌రించాడు. వికేంద్రీక‌ర‌ణ అంశంపై హైకోర్టులో కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.

రిట్‌పిటీష‌న్‌లో 2014 విభ‌జ‌న చ‌ట్టంలో సెక్ష‌న్ 6 ప్ర‌కారం కేంద్రం క‌మిటీ వేసింది. 2014లో శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ వేసింది. రాజ‌ధాని ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నే దానిపై క‌మిటీ ప‌రిశీల‌న చేసింది. 2014 ఆగ‌స్టు 30న నివేదిక స‌మ‌ర్పించింది. 2015  అప్ప‌టి ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించింది. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌డంలో కేంద్రం పాత్ర లేదు. 2020 జూలైలో ఏపీ ప్ర‌భుత్వం ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణకు సంబంధించి గెజిట్ విడుద‌ల చేసింది. గెజిట్ ప్ర‌కారం ఏపీలో మూడు పాల‌న కేంద్రాలు ఉంటాయి. గెజిట్‌లో శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తి, ప‌రిపాల‌న రాజ‌ధానిగా విశాఖ‌, న్యాయ రాజ‌ధానిగా క‌ర్నూలును పేర్కొన్నారని కేంద్రం తెలిపింది.

చ‌ట్టాల‌కు, ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు లోబ‌డి పాల‌కుల కార్య‌క్ర‌మాలు ఉండాలి. కానీ నువ్వు చేసిందేమిటీ చంద్ర‌బాబు.. నీ వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం, నీ దోపిడీ కోసం, నీ సామాజిక అభివృద్ధి కోసం, నీ సంపాద‌న కోసం రాష్ట్రాన్ని తాక‌ట్టుపెట్టింది వాస్త‌వం కాదా..? చ‌ంద్ర‌బాబూ..? అమ‌రావ‌తి రాజ‌ధాని కాద‌ని ఎవ‌రు చెప్పారు. విశాఖ‌లో అభివృద్ధి జ‌ర‌గ‌కూడ‌ద‌ని చంద్ర‌బాబు అంటుంటే.. విశాఖ ప్రాంత టీడీపీ నేత‌లు ఏం చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని టీడీపీ నేత‌లు ఆ పార్టీలో కొన‌సాగుతున్నారు. నీ మీద నీకు న‌మ్మ‌కం ఉంటే రాజీనామా చేసి ప్ర‌జ‌ల ముందుకురా చంద్ర‌బాబు

విశాఖ‌లో భూదోపిడీ జ‌రుగుతుంద‌ని టీడీపీ నేత య‌న‌మ‌ల మాట్లాడుతున్నారు. విశాఖ‌లో ద‌స్‌ప‌ల్లా భూములు క‌బ్జాలు చేసింది టీడీపీ నేత‌లు. హుద్‌హుద్ తుపాన్ పేరు చెప్పి భూముల‌న్నీ లాక్కున్నారు. విశాఖ‌లో విచ్చల‌విడిగా భూదోపిడీలు చేసి.. ఈరోజున మాపై ఆరోప‌ణ‌లు చేయ‌డానికి సిగ్గులేదా..?

త్వ‌ర‌లోనే విశాఖ‌ప‌ట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌గా శంకుస్థాప‌న చేయబోతున్నాం. చెప్పిన మ‌ర‌నాడే కోర్టుకు వెళ్లారు. రాష్ట్ర విభ‌జ‌న కంటే.. చంద్ర‌బాబు గ‌త ఐదేళ్లలో ముఖ్య‌మంత్రిగా సాగించిన పాల‌న‌, ప‌నితీరు, తీసుకున్న విధానాలు.. ఈ రాష్ట్రాన్ని 20 సంవ‌త్స‌రాలు వెన‌క్కు తీసుకెళ్లాయి. అమ‌రావ‌తిపై ప్రేమ ఉన్న చంద్ర‌బాబు అద్బుత‌మైన రాజ‌ధాని క‌డ‌తాన‌ని చెప్పి ఐదేళ్ల‌లో రూ.5 వేల కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేక‌పోయారు. త‌న ఐదేళ్ల పాల‌న‌లో క‌నీసం క‌ర‌క‌ట్ట రోడ్డు వేయ‌లేక‌పోయారు. క‌న్స‌ల్టెంట్ల కోస‌మే రూ.348 కోట్లు దోపిడీ చేశారు`. అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ధ్వ‌జ‌మెత్తారు.

Back to Top