అబద్ధాలను నిజాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజల్లోకి తప్పుడు ప్రచారం తీసుకెళ్లాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ర్యాలీలో ఇన్స్పెక్టర్ కిందపడితే వైయస్ఆర్సీపీ కార్యకర్త లేపి సపర్యాలు చేశారని మంత్రి తెలిపారు. సహాయాన్ని కూడా చంద్రబాబు దుష్ప్రచారానికి వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి సీఎం వైయస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు.
విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
అమరావతిపై రెఫరెండానికి ముందు విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. 70 ఏళ్ల వయస్సులోనూ చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ను బీజేపీ తాత్సరం చేస్తోందన్నారు. పోలవరం నిధుల విషయంలో బీజేపీ నేతలు కేంద్రాన్ని అడగాలన్నారు.
టూరిజం కొత్త పాలసీ
ఏపీ టూరిజం కొత్త పాలసీని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. టూరిజం రంగానికి కూడా రీస్టార్ట్ ప్యాకేజీ అందిస్తున్నామన్నారు.రూ.200 కోట్ల ప్యాకేజీని అతిథ్య రంగానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.రాష్ట్రంలోని పర్యాటక రంగంలో హోటల్స్ నిర్మాణం కోసం 10 సంస్థలను ఆహ్వానించామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టూరిజం రంగాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఏపీలోని పర్యాటక స్థలాల విశిష్టతపై రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని తెలిపారు. టూరిజం రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపి౦దని, పర్యాటక రంగంలో ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోయిందని అన్నారు. గత ఐదేళ్లలో ఒక్క టూరిజం ప్రాజెక్ట్ కూడా రాలేదని, గత ప్రభుత్వ పాలసీ కారణముగా ఏ ఒక్క సంస్థ ముందుకు రాలేదని తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ఆకర్షణీయంగా టూరిజం పాలసీని రూపొందించామని చెప్పారు. బంగ్లాదేశ్ షిప్ను ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మారుస్తున్నామని తెలిపారు. షిప్ యజమానితో చర్చలు చివరదశలో ఉన్నాయని, కొలిక్కి రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. కైలాసగిరిపై వాచ్ టవర్ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు.