సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంఘ సంస్కర్తగా నిల్చారు

నిరుపేద‌ల‌కు ఉన్న‌త విద్య‌ను మ‌రింత ద‌గ్గ‌ర చేశారు

విద్యా రంగంలో దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మనది

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

గుంటూరు: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు.. గతంలో ఎవరూ చేయలేదని, కనీసం ఆలోచన కూడా చేయలేదని పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్సీ సిలబస్‌ ఇంకా అనేక కార్యక్రమాలు, పథకాలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నార‌ని గుర్తుచేశారు. అమ్మ ఒడి నిజంగా ఒక గొప్ప పథకమ‌ని, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఒక సంఘ సంస్కర్తగా నిల్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యను మరింత చేరువ చేశార‌ని, గతంలో బడుగు, బలహీనవర్గాలకు విద్య, ఉన్నత విద్య అందనంత దూరంలో ఉండేదన్నారు. 

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ స‌మీపంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో విద్యారంగంపై మంత్రి ఆదిమూల‌పు సురేష్ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏం మాట్లాడారంటే.. 

విద్య అనేది ఒక గొప్ప ఆయుధం. అది సమాజాన్ని మార్చగలుగుతుంది అని చాలా మంది చెప్పినా, ఆ దిశలో ఎవరూ అడుగులు వేయలేదు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఏ విధంగా మారిపోయాయో మనం స్వయంగా చూస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలన్నీ మారిపోతున్నాయి. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని చెప్పే, మన తలరాతను మారుస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. ఆ దిశలోనే అధికారంలోకి వచ్చిన నాటి నుంచే విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. 

ఇంకా ఒక దళితుడిని అయిన నాకు విద్యా శాఖను అప్పగించారు. ఇది దళిత జాతికి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. ఒక తల్లి మనసు గుర్తించిన వ్యక్తిగా సీఎం వైయ‌స్ జగన్‌ పథకాలు ప్రవేశపెట్టారు. అన్నీ పక్కాగా అమలు చేస్తున్నారు. తల్లి తన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడుతుందని తెలుసు కాబట్టే, అమ్మ ఒడి పథకం అమలు చేస్తూ, ఆమెకు ఒక అండగా నిలుస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పథకం ఆదర్శంగా నిలుస్తోంది. ఆ విధంగా వైయ‌స్ జగన్ అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యా రంగానికి కొమ్ము కాసింది. నారాయణ, చైతన్య యాజమాన్యాలకు అనుగుణంగా చట్టాలు కూడా చేశారు. దానికి పూర్తి భిన్నంగా నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లు సమూలంగా మారుస్తున్నాం. తొలి దశలో 15వేలకు పైగా పాఠశాలల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇందుకు రూ.3667 కోట్లు వ్యయం చేస్తున్నాం.

అంతే కాకుండా రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తూ అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గోరుముద్ద ఇంకా ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌ది. ఇంగ్లిష్‌ మీద పట్టు సాధించడం అంటే, అది పులి పాల వంటిదని నాడు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చెప్పారు. ఆ విషయం తెలుసు కాబట్టే సీఎం వైయ‌స్ జగన్ ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టారు. ఇంకా డిజిటల్‌ విద్య వైపు కూడా అడుగులు వేశారు. అందుకోసం రూ.600 కోట్లతో బైజూస్‌ కంపెనీతో కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా తప్పు పడుతున్న చంద్రబాబు, అది జగన్‌ జూస్‌ అని విమర్శించారు. 

చంద్రబాబు చేసిన ప్రైవేటు యూనివర్సిటీ చట్టం ఒక్కటి చాలు, ఆయన విద్యా రంగం çపట్ల వ్యవహరించిన విధానం. దాన్ని కూడా మారుస్తూ, ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా 35 శాతం సీట్లు పేదలకు ఇస్తూ, ఆ ఫీజు ప్రభుత్వమే చెల్లించే విధంగా ఎంసెట్‌ పరిధిలోకి తీసుకొచ్చాం.  విద్య మీద చేసే వ్యయం, భావి భారత పౌరుల భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అని సీఎంగారు చెప్పారు. ఆ దిశలోనే అనేక పథకాలు, కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరు ముద్ద.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.. ఆనాడు విద్యార్థుల కోసం ఆలోచించిన మహానేత వైయస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తే, దాన్ని మరో నాలుగు అడుగులు ముందుకు నడిపించారు సీఎం వైయ‌స్‌ జగన్‌. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ, విద్యాదీవెన అమలు చేస్తున్నారు.

ఈ మూడేళ్లలో విద్యా రంగంలో దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మనది. జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇస్తామన్న గత తెలుగుదేశం ప్రభుత్వం, ఆ మాట కూడా నిలబెట్టుకోకపోతే, ఈ ప్రభుత్వం దాన్ని సాకారం చేస్తోంది. విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి.

Back to Top