తాడేపల్లి: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సూచించారని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని ఆదేశించారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వంపై సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
గడప గడపకూ మన ప్రభుత్వం, ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభం కానున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాలపై సీఎం వైయస్ జగన్ చర్చించారన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆగిపోయిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పునఃప్రారంభించే విధానం గురించి చర్చించారన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనుందని, ఈ కార్యక్రమంలో పార్టీ క్యాడర్తో పాటు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు పూర్తిస్థాయిలో పాల్గొనాలని ఆదేశించారన్నారు. ఈ రెండు విషయాల గురించి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సీఎం వైయస్ జగన్ కులంకశంగా చర్చించారన్నారు. ఎల్లో మీడియా రకరకాల వార్తలు రాసిందని, కొన్ని ఛానల్స్, పత్రికలు ఊహించినట్టుగా ఏమీ జరగలేదన్నారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని, పార్టీని మరింతగా పటిష్టం చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఎన్నికలను ఎదుర్కొనే క్రమంలో పార్టీ క్యాడర్ను, నాయకులను, గృహ సారథులను, కన్వీనర్లను సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించారన్నారు.