తాడేపల్లి: నామినేటెడ్ పద్ధతుల్లో కాంట్రాక్టులు కట్టబెట్టి దోచుకోవడం, పంచుకోవడం చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణలకు అలవాటని, వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పారదర్శకంగా టెండర్ ప్రక్రియ జరుగుతోందని, ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసేందుకు సీఎం వైయస్ జగన్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకువచ్చారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏరోజూ పోలవరం అనే పదాన్నే ఉచ్చరించిన పాపాన పోలేదని, అలాంటి వ్యక్తి పోలవరం స్పిల్ వేపై నిల్చొని బాధగా ఉందని ప్రాజెక్టుపై కపట ప్రేమ చూపిస్తున్నాడన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా పోలవరం నిర్మాణం రామోజీరావు బంధువు నవయుగ కంపెనీకి కట్టబెట్టి అడ్డగోలుగా దోపిడీ చేశారని మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. సెల్ఫోన్ కనిపెట్టిన చంద్రబాబుకు సెల్ఫీ తీసుకోవడం కూడా కష్టంగా మారిందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.
మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..
చంద్రబాబు ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడు. ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉందని పదే పదే చెప్పుకునే వ్యక్తి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కనీసం పోలవరం అనే పదాన్ని కూడా ఉచ్చరించలేదు. పోలవరం రూపకర్త తానేనని పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పోలవరం ప్రాజెక్టును ప్రారంభించారు. వైయస్ఆర్ చనిపోయినా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టు బతికే ఉంది.
పోలవరం మీద లెక్చర్ ఇవ్వడానికి చంద్రబాబు క్రరపట్టుకొని బయల్దేరాడు. మైకేల్ జాక్సన్ పెట్టుకున్నట్టుగా మెడకో మైక్ వేసుకొని అద్భుతమైన నటనతో ప్రభుత్వంపై బురదజల్లాలనే డ్రామాలు చేస్తున్నాడు. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టు నవయుగ కంపెనీ నుంచి తీసేసి రివర్స్ టెండరింగ్, రీటెండరింగ్ పెట్టి తిరిగి కొత్త కంపెనీకి ఇవ్వడం వల్ల చంద్రబాబు, రామోజీ బాధపడుతున్నాడు. నవయుగ కంపెనీ రామోజీరావు బంధువు కంపెనీ. చంద్రబాబు, రామోజీ దోచుకుంటుంటే మధ్యలో రివర్స్టెండరింగ్ చేసి తీసేశారనే బాధతో రోజుకో రాతరాసే కార్యక్రమం చేస్తున్నారు. అన్నదమ్ములు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ విపరీతంగా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు.
‘అంచనాలను పెంచేసి, అయినవారికి పంచేసి’ అనే శీర్షికతో ఈనాడులో వార్త రాశారు. రూ.1194 కోట్ల పనులను రాఘవ కంపెనీకి, పొంగులేటికి అడ్డగోలుగా ఇచ్చేశారని రామోజీరావు విషం కక్కుతున్నాడు. అంచనాలు పెంచేది, సొంత మనుషులకు ఇచ్చింది, దోచుకుంది చంద్రబాబు హయాంలోనే జరిగింది. రామోజీరావు రాతలన్నీ చంద్రబాబుకే వర్తిస్తాయి. టెండర్లు అన్నీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టెండర్ విధానాన్ని సీఎం వైయస్ జగన్ మార్చారు. ఈ–టెండరింగ్ విధానం తెచ్చారు. వంద కోట్ల పైచిలుకు టెండర్లు ఉంటే జ్యుడీషియల్ రివ్యూకు పంపిస్తున్నారు. పారదర్శకంగా టెండరింగ్ విధానం జరుగుతుంటే గందరగోళం, అన్యాయం, అక్రమం అంటూ రామోజీరావు తప్పుడు వార్తలు రాసి విషప్రచారం చేస్తున్నారు. ప్రజాధనాన్ని వృథా కాకుండా ప్రభుత్వం కాపాడుతుంటే చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ విషం కక్కుతున్నారు.
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బంధువు, సీఎంకు సన్నిహితుడు అని తప్పుడు రాతలు రాస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వైయస్ఆర్ సీపీ ఎంపీగా పనిచేశారు. ఆ తరువాత బీఆర్ఎస్లో, తరువాత కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్కు బద్ధశత్రువుగా ఉన్న వైయస్ఆర్సీపీకి పొంగులేటి సన్నిహితుడు ఎలా అవుతాడు..? రామోజీరావు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాడని ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.
నవయుగ కంపెనీ, ఆర్వీఆర్ కంపెనీ రామోజీ బంధువులదే. టీడీపీ హయాంలో ఈ రెండు కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి అడ్డగోలుగా దోచుకునే కార్యక్రమానికి చంద్రబాబు తెగబడ్డాడు. పుట్టా సుధాకర్ యాదవ్ యనమల రామకృష్ణుడి బంధువు. ఆయనకు పోలవరంలో కాంట్రాక్ట్ ఇచ్చి దోపిడీని ప్రోత్సహించారు. కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు కాంట్రాక్టులు ఇచ్చి దోచుకునే కార్యక్రమం చేశారు. అలాగే సీఎం రమేష్ కంపెనీ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంది. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే మరెన్నో కంపెనీలు.. రామోజీరావు రికమండేషన్తో చంద్రబాబు కాంట్రాక్టులు అడ్డగోలుగా ఇవ్వడం, దోచుకోవడం, పంచుకోవడం.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 3 నుంచి 5 వేల కోట్ల రూపాయలు కృష్ణ, గోదావరి పుష్కరాలకు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. ఇష్టానుసారంగా దోచుకున్నారు. రూ.14 వేల కోట్లు నీరు–చెట్టు మీద ఖర్చుచేశారు. ఆ పనులు కూడా నామినేషన్ పద్ధతిలోనే ఇచ్చి టీడీపీ కార్యకర్తలతో దోపిడీని ప్రోత్సహించారు. ఈ విధంగా సమయాన్ని, డబ్బును అన్నీ దోచుకొని ఇవాళ వైయస్ఆర్ సీపీ మీద బురదజల్లాలనే దుర్బుద్ధితో చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ ప్రవర్తిస్తున్నారు.
పారదర్శకంగా జరుగుతున్న టెండరింగ్ విధానంలో పాల్గొని ఉంటే పొంగులేటి కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చి ఉండొచ్చు. వస్తే అదేదో బంధుత్వం, దోచిపెట్టారని ప్రభుత్వం మీద కడుపుమంటతో తప్పుడు రాతలు రాయడం చాలా దురదృష్టకరం’ అని మంత్రి అంబటి అన్నారు.