ఉద్యోగుల‌కు వైయ‌స్ జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 

ఈనెలాఖరుకల్లా రూ. 3 వేల కోట్ల బిల్లులు చెల్లింపు

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం.. జీపీఎఫ్‌ పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేస్తాం

ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అనుకూలమే..

ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సజ్జల రామ‌కృష్ణారెడ్డి,  ఆదిమూలపు సురేష్‌

స‌చివాల‌యం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగ­మని, వారి స‌మ‌స్య‌ల‌న్నీ పరి­ష్క­రిస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల ప్రకారం ఈ నెలాఖ­రు­కల్లా ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర­నాథ్, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్‌. జవహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, అధికారులు భేటీ అయ్యారు. సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం మంత్రివ‌ర్గ ఉప‌సంఘం స‌భ్యులు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆదిమూల‌పు సురేష్ మీడియాతో మాట్లాడారు. 

ఉద్యో­గుల సంక్షేమంపై ఎప్పుటికప్పుడు చర్చిస్తు­న్నా­మని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, అందరూ కలిసికట్టుగా పనిచేయడంవల్లే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతోందన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు కొలిక్కివస్తున్నాయని చెప్పారు. కోవిడ్‌వల్ల ఉద్యోగులకు చేయాల్సిన వాటిని కొన్నింటినీ సమయానికి చేయలేకపోయామని తెలిపారు. చర్చల ద్వారానే ఆయా సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు చెప్పారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకే సీఎం వైయ‌స్‌ జగన్‌ మంత్రివర్గ ఉపసంఘాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు ఏ విషయాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ వేదికను ఏర్పాటుచేశారని చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులకు అనుకూలంగానే ఉంటుందన్నారు. 

పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేస్తాం: మంత్రి ఆదిమూల‌పు సురేష్‌
ఉద్యోగులకు సంబంధించిన అన్ని పెండింగ్‌ బిల్లులను మార్చి 31లోపు క్లియర్‌ చేస్తామని మంత్రివ‌ర్గ ఉప‌సంఘం స‌భ్యులు, మంత్రి ఆదిమూల‌పు సురేష్ చెప్పారు. ఇప్పటివరకు ఉన్న జీపీఎఫ్‌ పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేస్తామన్నారు. రిటైర్మెంట్‌కి సంబంధించి గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ను పూర్తిగా చెల్లిస్తామన్నారు. మెడికల్‌ బిల్లుల్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా చెల్లిస్తామని చెప్పారు. టీఏ, ఏపీజీఎల్‌ఐ కూడా ఇస్తామన్నారు. ఆర్థికపరమైన అన్ని అంశాలపై చర్చించామని, దీర్ఘకాలికంగా ఉండి గత ప్రభుత్వంలో కూడా పరిష్కారం కాని అంశాలపైనా స్పష్టత ఇచ్చామని, పరిష్కార మార్గం కనుగొన్నామన్నారు. ఉద్యోగ సంఘ నాయకులతో మంత్రివర్గం ఉపసంఘం తరచూ సమావేశమవుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూస్తామని మంత్రి చెప్పారు.

Back to Top