ఎవరూ ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేదు

ప్రవాసాంధ్రుల సలహాదారులు, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి 

విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు

హంగేరీ చేరుకున్న వెంకట్ ఎస్. మేడపాటి 

అమ‌రావ‌తి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్రవాసాంధ్రుల సలహాదారులు, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి ధైర్యం చెప్పారు.  ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ద నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలలోకి వచ్చిన విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించార‌ని ఆయ‌న తెలిపారు.  అక్క‌డి వారిని క్షేమంగా తీసుకువ‌చ్చేందుకు ప్రవాసాంధ్రుల సలహాదారులు, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి  హంగేరీ చేరుకున్నారు. బుడాపెస్ట్ లో ఉన్న విద్యార్థులను కలసి వసతి, భోజన సదుపాయాలు, క్షేమ సమాచారం, ఇతరత్రా వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందకండని, భారత ప్రభుత్వం (విదేశీ వ్యవహారాలు), భారత రాయబార కార్యాలయం తో సమన్వయము చేసుకుంటూ  మిమ్మల్ని  క్షేమంగా స్వదేశం తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పంపిందని  ధైర్యం చెప్పారు.  విమానాల షెడ్యూల్ ప్రకారం వీలైనంత ఎక్కువ మన రాష్ట్రానికి చెందిన వారిని స్వదేశం తరలిస్తామని చెప్పారు. రేపటి నుంచి  బుడాపెస్ట్ నుండి వెళ్లే విమానాల సంఖ్య తగ్గించారని , విమానాల సంఖ్య పెంచితే త్వరితగతిన విద్యార్థులను స్వదేశానికి  తీసుకురావచ్చని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విదేశీ వ్యవహారాల అధికారులను (MEA)   వెంకట్ ఎస్. మేడపాటి కోరారు. 

Back to Top