తాడేపల్లి: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్తూ ప్రజల ఆశీర్వాదం పొందుతున్నాం. అలా ఇళ్లకు ఊర్కే వెళ్లకుండా, ఈ ప్రభుత్వం వారికి ఏమేం చేసిందో చెప్పే విధంగా, ‘మూడో ఏట సంక్షేమ బావుటా’ అన్న బుక్లెట్ కూడా ఇస్తున్నాం. దానిపై వారి పేరు కూడా ఉంటుంది. వారికి ఈ మూడేళ్లలో ఏయే పథకంలో ఏమేం అందాయన్న వివరాలు ఉంటాయి. అదే సమయంలో ఈ మూడేళ్లు మేమేం చేశామన్నది స్పష్టంగా ప్రచురించి ఇస్తున్నామని చెప్పారు. ఆదివారం తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని చెబుతూ, అవి అందాయా లేదా అని అడిగిన ప్రభుత్వం ఈ దేశంలోనే కాదు, బహుషా ప్రపంచంలోనే ఉండదేమో. ఒక్క జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తప్ప. ఇంత వరకు ప్రజాస్వామ్య చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీ తాను ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టోను ఇంటింటికీ వెళ్లి ఇవి అమలు చేశామా? లేదా? అని అడిగిన దాఖలా ఎక్కడా లేదు. చేసిందే చెబుతున్నాం: అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలోనే వాటిలో 95 శాతం అమలు చేశాం. అదే విషయం చెబుతూ, అమలు చేశామా లేదా అని అడుగుతున్నాం. గతంలో చంద్రబాబు హయాంలో 45 పేజీల మేనిఫెస్టో ప్రకటించి, ఏదీ అమలు చేయకుండా, చివరకు ఆ మేనిఫెస్టో కనిపించకుండా చేశారు. అన్నీ అబద్ధాలే చెప్పాడు. ఏనాడూ నిజాలు మాట్లాడని వ్యక్తి: ఇక్కడ ప్రత్యేకించి ఒక విషయం చెప్పాలి. జీవితంలో అబద్ధమే చెప్పని క్యారెక్టర్ను సత్య హరిశ్చంద్రుడు అంటారు. మరి ఆయనకు అపోజిట్ ఎవరు? పురాణాలన్నీ జల్లెడ పట్టి చూసినా నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే క్యారెక్టర్ ఇంత పెద్ద భారతదేశ ఇతిహాసం, పురాణాల చరిత్రలో ఎక్కడా కనిపించదు. కానీ మనకు ఒకరు దొరికారు. తన జీవితంలో అబద్ధాలు తప్ప నిజాలు చెప్పని వ్యక్తి, సత్యహరిశ్చంద్రుడికి పూర్తి వ్యతిరేకం అయిన వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబునాయుడు. మేనిఫెస్టోలో ప్రకటించింది ఏదీ అమలు చేయలేదు. చివరకు పార్టీ వెబ్సైట్ నుంచి ఆ మేనిఫెస్టోను తీసి పారేశాడు. ఘనంగా ఆదరిస్తున్నారు: జగన్గారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి రావాలని చంద్రబాబు అంటున్నారు. అలా ఎందుకు అంటున్నాడనేది మాకు ఇప్పుడు తెలిసింది. గడప గడపకు కార్యక్రమంలో మేము ఎక్కడికి వెళ్లినా ఘనంగా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. మొన్న నేను ఒక ఊరికి వెళ్తే, ఒక మూడు కుటుంబాలకు తప్ప, అందరికీ పథకాలు అందాయి. ఎందుకంటే వారు ఆదాయపు పన్ను కడుతున్నారు. ప్రతి చోటా, ప్రతి ఇంటా, గ్రామ గ్రామాన మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. అభిమానం చూపుతున్నారు. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం: కానీ ఎల్లో మీడియాలో మాత్రం పూర్తి భిన్నంగా చూపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల మీద ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని. వారు ప్రతి చోటా తిరగబడుతున్నారని చూపుతున్నారు. రాస్తున్నారు. చంద్రబాబు మాటలను అచ్చం వల్లె వేస్తున్నారు. నిజానికి మేము అన్ని పార్టీల వారి ఇళ్లకు వెళ్తున్నాం. తెలుగుదేశం, జనసేన, సీపీఐ, సీపీఎం, బీజేపీ వాళ్ల ఇళ్లకు వెళ్తున్నాం. ఎక్కడో ఒక దగ్గర ఆయా పార్టీల అభిమానులు ఉంటారు. అలా ఒకరో ఇద్దరో ప్రశ్నిస్తే, దాన్నే పదే పదే చూపుతున్నారు. ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. సమాధానం చెప్పండి: మేం ఒక్కటి అడుగుతున్నాం. చంద్రబాబు హయాంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా అని అడుగుతున్నాం. ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. మేము చెప్పింది చేశాం కాబట్టి, ««ధైర్యంగా గడప గడపకు వెళ్లి అడుగుతున్నాం. వారి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. వాస్తవాలు గమనించండి: నేను కొన్ని అంశాలు ప్రత్యేకించి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. చంద్రబాబు 5 ఏళ్లలో మూడేళ్లు మాత్రమే అది కూడా అరకొరగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. అంటే బాబు సీఎంగా ఉండగా, మిగతా రెండేళ్ల డబ్బులు కట్టింది జగన్గారి ప్రభుత్వం కాబట్టి, నిజానికి 2017–18, 2018–19 విద్యార్థులంతా ఫీజు రీయింబర్స్మెంట్లో చదువకున్నది బాబు ప్రభుత్వం డబ్బుతో కాదు. అది చెల్లించింది జగన్గారి ప్రభుత్వం. అలాగే 2017–18, 2018–19 సంవత్సరాలకు చంద్రబాబు ఉచిత విద్యుత్కు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆ డబ్బు చెల్లించింది కూడా జగన్గారి ప్రభుత్వం. కాబట్టి గత 5 ఏళ్లుగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది జగన్గారి ప్రభుత్వమే. అయినా దాన్ని కూడా రాయరు. గడప గడపకూ..: జగన్గారు ప్రతి కుటుంబానికి స్వయంగా ఒక లేఖ రాశారు. అందులో తన పరిపాలన క్రమాన్ని రాశారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పథకాలు ఎలా అమలు చేశామన్నది కూడా చెబుతున్నారు. దాంతో పాటు, ప్రజా బ్యాలెట్. 50 ప్రశ్నలు అందులో ఉన్నాయి. గతంలో రైతు భరోసా వంటి పథకం ఉందా? కౌలు రైతులకు కూడా ఆ సాయం చేశారా? వంటి దాదాపు 50 ప్రశ్నలతో ఆ బ్యాలెట్ ఇస్తున్నాం. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అంటూ ఒక నెంబర్ కూడా ఇస్తున్నాం. ఆ విధంగా మొత్తం మూడు పత్రాలు ప్రజలకు ఇస్తూ, గడప గడపకూ నిర్వహిస్తున్నాం. మళ్లీ మాదే ప్రభుత్వం: ప్రజల్లో మాకు ఆదరణ ఉంది కాబట్టే, అంతా కట్ట కట్టుకుని వస్తామని విపక్షాలు చెబుతున్నాయి. ప్రజా వ్యతిరేకత ఉందని చంద్రబాబు చెబుతున్నాడు. దాన్ని ఎల్లో మీడియా చూపుతోంది. ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోంది. నాపైనా దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు అసరా అంటే తెలియదని. అదేమిటో ఇప్పుడు ఎల్లో మీడియాకు కూడా తెలిసింది కదా? ఇక దాదాపు రూ.1.40 లక్షల కోట్లు ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్పై ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉంది. అందుకే జగన్గారిపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే. చంద్రబాబుకు మెళకువ వచ్చినప్పుడల్లా క్విట్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. కానీ నిజానికి ప్రజలంతా చంద్రబాబునే క్విట్ అంటున్నారు. పులిచింతలపై దురుద్దేశ కధనం: ఇక మరో విషయం. ఈనాడులో పదే పదే ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెంచాలన్న ఉద్దేశంతో, ఒక పద్ధతి ప్రకారం కధనాలు, వ్యాసాలు రాస్తున్నారు. ఇవాళ కూడా పులిచింతల ప్రాజెక్టుకు కనీసం ఒక్క గేటు కూడా పెట్టలేరా అని రాశారు. గత ఏడాది ఆగస్టు 5న పులిచింతలలో 16వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. వెంటనే అప్పటి మంత్రి వెళ్లారు. ఆగస్టు 8 నాటికే స్టాప్ లాక్ గేట్ అమర్చారు. అప్పటి నుంచి కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. రూ.21 కోట్లతో కొత్త గేట్ పనులకు ప్రతిపాదనలు కూడా పంపారు. ఆ గేటు బిగించడానికి అన్ని పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రానున్న ఒకటి, రెండు నెలల్లో ఆ పని పూర్తవుతుంది. మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ, చింతకాయలు రాలే సమయానికి మంత్రాలు చదవాలని అంటారు. సరిగ్గా, అలాగే రామోజీరావుగారు చేస్తున్నారు. గేటు బిగించే పని వేగంగా సాగుతోంది. అందుకే ఆ స్టోరీ రాశారు. వరదలు వచ్చినా, నీరు వదిలినా, స్పిల్వే మీదుగా నీరు వదిలినా గేటు పెట్టడానికి ఏ ఇబ్బంది ఉండదు. గతంలో గేట్లన్నీ మాన్యువల్గా ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం హైడ్రాలిక్ గేట్లు పెడుతున్నారు. అది మాత్రం రాయరు!: గతంలో పులిచింతల నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చంద్రబాబు హయాంలో ఇవ్వలేదు. కానీ జగన్గారు ఇచ్చారు. రూ.100 కోట్లు ఖర్చుచేసి నిర్వాసితుల సమస్య పరిష్కరించారు. కానీ ఈనాడు పత్రిక అది మాత్రం రాయదు. ఎంతసేపూ జగన్గారి మీద విమర్శ. చంద్రబాబుకు మళ్లీ అధికారం కట్టబెట్టాలన్న ఆరాటం. అయితే ఎల్లో మీడియా ఎంత ఆరాటపడినా అది సాధ్యం కాదు. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి ఎంత చేసినా, ఏం చేసినా ఆయన మళ్లీ సీఎం కాలేరు.. అని మంత్రి శ్రీ అంబటి రాంబాబు స్పష్టం చేశారు.