విజయవాడ: నాకు, మా అల్లుడు చంద్రబాబుకు మధ్య 26 సంవత్సరాలుగా పిల్లి, ఎలుక మధ్య పోరులా.. పోరాటం కొనసాగుతూనే ఉందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి తెలిపారు. విజయవాడలో.. తాను రచించిన ‘అల్లుడు సుద్దులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని లక్ష్మీపార్వతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతంరెడ్డి తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. నాకు, మా అల్లుడుకి మధ్య 26 సంవత్సరాలుగా ఈ పోరాటం సాగుతూనే ఉందన్నారు.. లోకేష్ కు అర్హత చూడకుండా మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు.. ఇవన్నీ కలిసి సెటైరికల్గా ఈ పుస్తకాన్ని రాసినట్టు తెలిపారు. తండ్రి కొడుకులు (చంద్రబాబు, లోకేష్)తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పండిస్తున్న హాస్యాన్ని మిళితం చేసి చిత్తూరు మాండలికంతో ఇదొక ప్రయత్నం చేశానన్నారు. గత 25 ఏళ్లుగా చంద్రబాబు గురించి అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశానన్న ఆమె.. ప్రస్తుతం ‘అల్లుడు సుద్దులు’ పుస్తకాన్ని చిత్తూరు మాండలికంలో రాశానని తెలిపారు. రాష్ట్రంలో తిరుగుతూ ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారని, నా పుస్తకంలో వాళ్ల గురించి హాస్యంగా రాశానని లక్ష్మీ పార్వతి అన్నారు. వైయస్ఆర్ సీపీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ.. వైయస్ఆర్సీపీ నేతలు స్ధితప్రజ్ఞులుగా అభివర్ణించారు.. సాహిత్యంలో సెటైరికల్ రచనలు ఒక ఆనవాయితీ.. శ్రీరమణ రాసిన పుస్తకాలు పొలిటికల్ సెటైరికల్ రచనలు బాగుంటాయని తెలిపారు.