శ్రీకాకుళం: కోటబొమ్మాళిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా పార్టీ శ్రేణులు బంద్ నిర్వహిస్తున్నారు. వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడిని నిరసిస్తూ శుక్రవారం కోటబొమ్మాళి లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బంద్కు అన్నివర్గాల ప్రజలు సహకరిస్తున్నారు. కొత్తపేట నుంచి కోటబొమ్మాళి వరకూ ర్యాలీ నిర్వహించారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం బంద్లో పాల్గొని టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో టీడీపీ నాయకులు.. కార్యకర్తలు దౌర్జన్యకాండ రోజు రోజుకు అధికమవుతుందన్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి పట్టుతగ్గుతోందనే భయంతో అధికార పార్టీ కార్యకర్తలు బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓటమి భయాన్ని సహించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే కోటబొమ్మాళిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి గురువారం ఉదయం పది గంటల సమయంలో దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ ఉన్న కార్యకర్తలు.. నాయకులపై విచక్షణ రహితంగా దాడిచేశారన్నారు. కర్రలు, మారణాయుధాలతో దాడి చేసి కొట్టడంతో 8 మంది వైయస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయడినవారిలో వైయస్ఆర్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బొయిన నాగేశ్వరరావు, నేతింటి నగేష్, అన్నెపు రామారావు, దుబ్బ వెంకట్రావు, మెండ తాతయ్య, తోట వెంటరమణ, కళ్ల ఆదినారాయణ, పిల్లల లక్ష్మణరావు ఉన్నారన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, తిలక్లు పాల్గొన్నారు.