తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతున్నాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. నగరి మండలం తడుకుపేట దళితులపై దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ఆర్ సీపీకి ఓటు వేశారని దళితులు ఇళ్లపై దాడి, వాహనాలు ధ్వంసం అమానుషమన్నారు. చుండూరు, కారంచేడు ఘటనల్ని తలపించేలా తడుకుపేట ఘటన జరిగిందని భూమన మండిపడ్డారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యానాదులు పై కూడా ఇదే తరహాలో దాడులు చేస్తున్నారని, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్టీలకు రక్షణ లేదన్నారు. దళితులకు రక్షణ లేదు వైయస్ఆర్ సీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ తడుకుపేట దళితులు పై దాడి ఘటన పై జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దళితులపై దాడులు ఎక్కువ అయ్యాయన్నారు. దళిత హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని గురుమూర్తి అన్నారు.