గుంటూరు : కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై వైయస్ఆర్సీపీ నేతలు మేరుగ నాగార్జున, నూరి ఫాతిమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి వంటి ప్రజా నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెమ్మసానికి తగదన్నారు. డబ్బు, అధికారం ఉందనే అహంకారంతో పెమ్మసాని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లక్షలాది మంది వైయస్ జగన్ అభిమానులు ఉన్నారని, వారు తలచుకుంటే పెమ్మసాని రాజకీయంగా నిలబడలేరని హెచ్చరించారు. రాజకీయాల్లో సంస్కారం ఎంతో ముఖ్యమని, వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు. ప్రజలకు సేవ చేయలేకపోవడం వల్లే ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇకపై హద్దులు దాటితే ప్రజలు సహించరని, తమ నాలుకల్ని అదుపులో పెట్టుకోవాలని కేంద్రమంత్రి పెమ్మసానికి సూచించారు.