ఇంటర్‌ వరకు అమ్మఒడి పథకం వర్తింపు

మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పాటిస్తాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

అమరావతి: అమ్మఒడి పథకాన్నిఇంటర్మీడియట్‌ వరకు  వర్తింపజేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యారంగంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సోమవారం అసెంబ్లీలో సమాధానమిచ్చారు.  మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పాటిస్తామని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలుచేస్తున్నారని, దీనిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను సేవా దృక్పథంతో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సురేశ్‌ తెలిపారు. 

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. ప్రైవేటు విద్య వ్యాపారంలా మారిపోయిందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు సరైన ప్రమాణాలు పాటించడంలేదని, నాణ్యమైన విద్య అందివ్వడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ఎల్‌కేజీ చదువు కోసం రూ. 25వేల నుంచి లక్ష వరకు ప్రైవేటు స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని సభకు తెలిపారు. అనుమతులు లేకపోయినా కొన్ని ప్రైవేటు స్కూళ్లు రెసిడెన్షియల్‌ క్యాంపస్‌లను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ.. చాలావరకు ప్రైవేటు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నారాయణ సంస్థలకు ధారాదత్తం  చేసిందని మండిపడ్డారు. 
 

Back to Top