రమ్య కుటుంబానికి హోంమంత్రి సుచరిత పరామర్శ

ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కు అందజేత‌

గుంటూరు : నిన్న గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. సోమవారం జీజీహెచ్‌లో వారిని కలిసిన ఆమె ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కు అందజేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ తాడేపల్లి ఘటనలో నిందితులను గుర్తించి ఒకరిని పట్టుకున్నాము. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంటనే స్పందించి నిందితులను పట్టుకోమని పోలీసులను ఆదేశించారు. ఒక్క నిందితుడు కూడా తప్పించుకోవడానికి వీలులేదని సీఎం చెప్పారు.

పార్లమెంట్‌లో దిశ చట్టం అయితే ప్రత్యేక న్యాయ స్థానాలు అందుబాటులోకి వస్తాయి. సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగానే నిన్నటి ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశాం. సురక్షితంగా లేని ప్రదేశాలకు వెళ్లకూడదని ప్రజలు భావించాలి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి’’ అని అన్నారు.
 

Back to Top