రాజమండ్రి: ఇద్దరు ఆడబిడ్డలకు తండ్రిగా, ఒక చెల్లికి అన్నగా, ఆంధ్రరాష్ట్రంలోని ప్రతి మహిళను తన తోబుట్టువులా ఆలోచించి వారి రక్షణ కోసం సీఎం వైయస్ జగన్ దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. దిశ చట్టం ఆంధ్రరాష్ట్ర మహిళలకు సీఎం వైయస్ జగన్ ఇచ్చిన కానుక అని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. దిశ చట్టం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో దిశ చట్టంపై నిర్వహిస్తున్న సెమినార్కు హోంమంత్రి సుచరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మహిళా భద్రత మీద ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం కానీ, ఈ రోజు వాటిని చేతల రూపంలో చూడగలుగుతున్నాం. దీనికి ఒకే ఒక్క కారణం సీఎం వైయస్ జగన్. రాష్ట్రంలో హోంమంత్రి పదవి దళిత మహిళకు ఇవ్వడం సీఎం వైయస్ జగన్ ఆడపడుచులకు అండగా, మహిళా పక్షపాతిగా ఉన్నారనేందుకు నిదర్శనం. నిర్భయ, దిశ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని, ముందు జాగ్రత్తలు ఉండాలని, మహిళలకు ఆపద కలిగితే సత్వర న్యాయం జరగాలని సీఎం వైయస్ జగన్ ఆలోచన చేసి చట్టరూపంలో తీసుకువచ్చిన నాయకుడు సీఎం వైయస్ జగన్. దిశ ఘటన తెలంగాణలో జరిగింది.. మనకేం సంబంధం అని, ట్విట్టర్లో పోస్టు పెట్టి, ఒక స్పీచ్ ఇచ్చి వదిలేయకుండా.. మహిళా భద్రత ఏ విధంగా ఉండాలని ఆలోచించి దిశ చట్టం చేయడం గొప్ప విషయం.
ఇద్దరు ఆడబిడ్డలకు తండ్రిగా, ఒక చెల్లికి అన్నగా, ఆంధ్రరాష్ట్రంలోని ప్రతి మహిళను తన తోబుట్టువులా ఆలోచించి దిశ చట్టం చేయడం ఆంధ్రరాష్ట్ర మహిళలకు సీఎం వైయస్ జగన్ ఇచ్చిన కానుక. ఏ ఆడపడుచుకు ఆపద రాకూడదని, విధి వశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ చర్యలు ఎంత తీవ్రంగా ఉండాలని ఆలోచించి సమాజానికి సంకేతం ఇచ్చేలాంటి చర్యలు తీసుకున్నారు. ఇది పూర్తిగా సీఎం వైయస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది ఈ దిశ చట్టం. చట్టం చేసి ఆగిపోకుండా నేరాలు జరిగిన వారికి ఎటువంటి శిక్షలు విధించాలని సమగ్రంగా చట్టంలో రూపొందించారు. దిశ చట్టాన్ని మన రాష్ట్రంలో తీసుకువచ్చిన తరువాత చుట్టు పక్కల రాష్ట్రాలు కూడా దిశ చట్టం కాపీలు పంపించండి.. మా రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని అడుగుతున్నారు. మహిళలకు మెరుగైన భద్రత కల్పించాలి, మెరుగైన రక్షణ, సంక్షేమం, ఆర్థిక సుస్థిరత కల్పించాలి, ఉత్తమ గౌరవం, చదువు, ఆరోగ్యం, సమానత్వం ఇవ్వాలని యోచించి మహిళా రిజర్వేషన్ ద్వారా 50 శాతం పదవుల్లో, అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్న ఘనత సీఎం వైయస్ జగన్ది.
ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, అమ్మఒడి, దిశ ఏది తీసుకున్నా.. రాష్ట్ర మహిళలకు సీఎం వైయస్ జగన్ భరోసాగా నిలబడ్డారు. ఇది రాష్ట్ర ఆడపడుచులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరి సంక్షేమానికి ఒక అడుగు ముందుకువేస్తే.. నేను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని ముందుకు వచ్చిన మహిళలందరి తరుఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఇవే కాకుండా రూరల్, అర్బన్ ప్రాంతాల్లో 18 పోలీస్ స్టేషన్లను మార్చి నెలాఖరు కల్లా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అందుకు సంబంధించి రూ. 87 కోట్లు వెంటనే మంజూరు చేసిన సీఎంకు మహిళా లోకం రుణపడి ఉంటుంది. టెక్నాలజీ పరంగా కూడా ఏపీ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. ప్రతి ఒక్క మహిళకు దిశ చట్టంపై పూర్తి అవగాహన ఉండాలని, పురుషులకు కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. మహత్తరమైన దిశ చట్టాన్ని కానుకగా ఇచ్చిన సీఎం వైయస్ జగన్కు మహిళా లోకం తరుఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ను అని హోంమంత్రి సుచరిత అన్నారు.