తాడేపల్లి: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్, ఎకనామిక్ అఫైర్స్) దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై .. మేము ఇస్తున్న గణాంకాలు, ఆధారాలు కొత్తవి కావు. ఇప్పటికే ఎన్నోసార్లు వివరణలు ఇచ్చాం. ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ట్ర అప్పులు, ద్రవ్యలోటు విషయంలో స్పష్టంగా అసెంబ్లీలో వివరణ ఇచ్చినా, టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మంగళవారం మీడియా సమావేశంలో వాస్తవాలను వివరించారు. విభజన జరిగే నాటికి రాష్ట్రానికి రూ. 1,13,797 కోట్ల అప్పు ఉందని శ్రీ కృష్ణ చెప్పారు. టీడీపీ హయాంలో అది రెండింతలకు పైగా పెరిగిందన్నారు. కేంద్రం ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4,42,000 కోట్లని పేర్కొంటే.. దాన్ని వక్రీకరించడానికి రాష్ట్రం అప్పులు రెండింతలుగా పెరిగాయని ఎల్లో మీడియా తన సొంత భాష్యం చెబుతోంది. ఇదొక దుష్ప్రచారం. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో 2.4 రెట్లుకు అప్పు పెరిగినట్లు నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ తనకు అనుకూలంగా ఓట్లు వేయడానికి అలవిమాలిన అప్పులు చేసింది. నిజానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో కరోనా లాంటి ఏ విపత్తు లేదు. ఆదాయం పడిపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం బాగా తగ్గింది. పవన్ కళ్యాణ్ సైతం అప్పులపై అసత్యాలు మాట్లాడటం అసమంజసం. ఆధారరహితంగా ఇలాంటి విమర్శలు చేయడం హేయం. కరోనా వంటి విపత్కర పరిస్థితిలోనూ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందించినా టీడీపీ హయాంలో పెరిగినంతగా అప్పులు పెరగలేదన్నది వాస్తవం. రూ. 1,92,000 కోట్ల డీబీటీ ద్వారా, అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లో వేసింది ఈ ప్రభుత్వం. ప్రస్తుత ప్రభుత్వంలో రెండు రెట్లు అప్పు పెరిగిందనడం అవాస్తవం. అలా పెరగాలంటే, ఈ సంవత్సరంలో మరో రూ. లక్ష కోట్ల అప్పు చేస్తేనే అది సాధ్యం. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోదని స్పష్టం చేస్తున్నాం. జనాన్ని వంచించింది బాబే... రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీలోనూ గత ప్రభుత్వంలో చెప్పిందొకటి. చేసిందొకటి. ఆడినమాట తప్పిన ఆ ప్రభుత్వంలో మాదిరిగా అలాంటి వంచనలేవీ ప్రస్తుత ప్రభుత్వంలో జరగలేదన్నది వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో రుణాలు పెరిగిపోవడం వల్ల రాష్ట్ర పరిస్థితి దిగజారిందని ఎల్లో మీడియా, టీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. ఎంత ద్రవ్యలోటు ఉందో ఆర్బీఐ ఏటా నివేదిక విడుదల చేస్తుంది. ద్రవ్యలోటు ప్రస్తుతమే తక్కువ... 2014–2022 మధ్య కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్యలోటులో మన రాష్ట ద్రవ్యలోటు నిష్పత్తి చూస్తే, టీడీపీ హయాంలో ఇది 7.06 శాతం ఉంటె, ప్రస్తుత ప్రభుత్వంలో ఈ లోటు 5.76 శాతం కి తగ్గింది. ఇది ఆర్బీఐ గణాంకాల పుస్తకం నుంచి తీసుకున్నవే తప్ప మేము సొంతంగా చెబుతున్నవి కావు. ఫైనాన్స్ కమిషన్ నిబంధన లను అతిక్రమించి టీడీపీ ప్రభుత్వం రూ 48,000 కోట్ల అప్పు ఎక్కువగా తీసుకుంది. 2014– 19 కాలంలో కేంద్రం అప్పు కూడా పెరిగింది. 2019–22 కాలంలో రాష్ట్ర అప్పు ఆ అప్పు శాతంతో పోలిస్తే తక్కువే నని చెప్పాలి. కేంద్రం చెప్పిన దాని ప్రకారం రూ. 4,42,000 కోట్ల అప్పు తప్పని, 9.16 లక్షల కోట్లని ఎల్లో మీడియా రాస్తోంది. పూచీకత్తు లేని రుణాల్లోనూ అవాస్తవ రాతలే... పూచీకత్తు లేని రుణాలు రూ.87,000 కోట్లని టీడీపీ, ఎల్లో మీడియా రాస్తోంది. ఇదీ అవాస్తవమే. రూ. 55,000 కోట్ల అప్పు టీడీపీ హయాంలో ఉన్నా ఎల్లో మీడియాకు ఎందుకు కనిపించలేదో వారే చెప్పాలి. పెండింగ్ బిల్లులు రూ. 1,85,000 కోట్లని కూడా అవాస్తవాలు రాస్తున్నారు. ఆర్థిక మంత్రి స్పష్టంగా చెప్పినా లెక్కల వక్రీకరణ చేస్తున్నారు. పారదర్శకంగా నాలుగు నెలల కిందట అసెంబ్లీ లో పెండింగ్ బిల్లులు మొత్తం రూ. 21,673 కోట్లని రాష్ట్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.దీన్ని ఇష్టమొచ్చినట్లు రూ. 1,85,000 కోట్లని ఈ సంఖ్యను పెంచేశారు. అదేమంటే నిపుణులు చెబుతున్నారంటారు.దీనికి ఆధారాలు వెల్లడించరు. వారి ఊహకు చిక్కిన నెంబరు రాస్తారు. పూచీకత్తు రుణాల విషయంలోనూ ఇలాగే వక్రభాష్యాలు చేస్తున్నారు. చంద్రబాబు దిగిపోయే నాటికి పూచీకత్తు లేని రుణాలను చూస్తే ఒక విద్యుత్తు శాఖ పరిధిలోనే రూ. 55,108 కోట్లుగా ఉంది. దాన్ని ప్రశ్నించరు. ఈ ప్రభుత్వానే ఎందుకు ఈ విషయంలో నిలదీస్తారో అర్థం కాదు. ప్రభుత్వం నిజాలను దాచాలనుకోదు. అంతకుముందు టీడీపీ, కాంగ్రెస్ కానీ పెండింగ్ బిల్లుల గురించి చెప్పలేదు. 2022 లో తక్కువ అప్పులు చేశాం. పెండింగ్ బిల్లుల పేరుతో ఇష్టమొచ్చిన సంఖ్య రాసేస్తున్నారు. ఇది బాధ్యతాయుతమైన పాత్రికేయం కాదు. ఇది ఎంతవరకు సమంజసం. పాత్రికేయ మిత్రులు దీన్ని ఆలోచించాలి. మీకు ఆధారముంటే దాన్ని ఉటంకించండి. అంతేకాని తప్పుల తడకలతో వార్తలు రాయవద్దని హితవు పలుకుతున్నాను. ఆర్థికంగా రాష్ట్రం కుదేలైపోయిందని రాయడం ఇది సమంజసం కాదు. పెండింగ్ బిల్లులుగా రూ.21,673 కోట్లు ఉందని అసెంబ్లీలోనే ఆర్థికమంత్రి స్పష్టం చేసినా, మీరిలా ఆధారాలు లేకుండా అడగడం తగదని దువ్వూరి కృష్ణ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మీరు చెప్పిన రూ.1,85,000 కోట్ల పెండింగ్ బిల్లులని అనడానికి మీ దగ్గర ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు. కాగ్కు మేం వివరణ ఇచ్చినా, ఆ వ్యవస్థ దాన్ని సరిచేయకపోతే దానికి ప్రభుత్వం ఏం చేయగలుగుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏది పడితే అదే రాస్తామనే ధోరణి మీడియాకు ఉండకూడదన్నారు. కొన్నిసార్లు పెండింగ్ బిల్లుల పరిష్కారంలో ఆలస్యం కావచ్చని, దానికి ఆర్థిక శాఖను తప్పు పట్టడం సరికాదన్నారు. అన్నిటినీ మించిగత టీడీపీ ప్రభుత్వంలో చేసినంత అప్పు వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో జరగలేదని పేర్కొన్నారు. ఆర్బీఐ విడుదల చేసిన లెక్కలనే తాను పేర్కొంటున్నానని స్పష్టం చేశారు. కోవిడ్ లేకపోతే రాష్ట్ర ఆదాయం దెబ్బతిని ఉండేది కాదన్నారు. పెండింగ్ బిల్లులను చాలా వరకు విడుదల చేశామని శ్రీ దువ్వూరి కృష్ణ వివరించారు.