శ్రీకాకుళం: మగువల ఆత్మ గౌరవం పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక రీతిలో వైయస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేస్తోందని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇందుకోసం నాలుగు విడతల్లో రుణాల చెల్లింపునకు సమ్మతించిందని,ఇంటిని నడిపే సారథికి చేయూతగా నిలిచి, బాధ్యతలు పంచుకునే గృహిణులకు మరింత ఊతం ఇచ్చేందుకు ఈ పథకం రూపకల్పన సాగిందని,దీని ఉద్దేశం గ్రహించి మేలు చేసే ప్రభుత్వానికి అంతా మద్దతుగా నిలవాలని ధర్మాన ప్రసాదరావు పిలుపు ఇచ్చారు. అంబటివానిపేట, సాందీపని స్కూల్ ప్రాంగణాన వైయస్ఆర్ ఆసరా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకూర్మం, కె.సైరిగాం,అంపోలు,గొంటి,రామ చంద్రపురం,వాడాడ గ్రామాల్లోని లబ్ధిదారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.."సీఎం వైయస్ జగన్ కు మీ మీద అపారమైన నమ్మకం ఉంది, రానున్న రోజుల్లో మీ అండదండలు ఉండాలి. ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాల రద్దుకు కార్యాచరణ రూపొందించి, ఇచ్చిన మాట ప్రకారం రుణాలు చెల్లింపునకు మార్గ నిర్దేశం చేస్తూ, ఇప్పటికే మూడు విడతలలో చెల్లించిన విషయాన్ని మీరంతా గుర్తించాలి. నిత్యం కుటుంబ భారం మోసే మహిళలకు అండగా ఉండేందుకు, వారి బాధ్యతల నిర్వర్తింపుల్లో ఆర్థిక అవరోధాలు అధిగమించేందుకు, రానున్న కాలంలో రుణాల చెల్లింపు పూర్తయితే కొత్త రుణాల వర్తింపు సుసాధ్యం అయ్యేందుకు వీలుగా ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న సహాయం దుర్వినియోగం కాకుండా అంతా నడుచుకోవాలి. గ్రూపులను మరింతగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. నిరంతరం ఇంటి బాధ్యతల్లో భాగం పంచుకునే గృహిణులకు మరింత ఆర్థిక చేయూత అవసరం అని భావించి, ఆ రోజు బకాయిలు ఉన్న డ్వాక్రా రుణాల చెల్లింపునకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం రుణా చెల్లింపుల్లో మూడు విడతలు పూర్తి చేసి మీ అందరి సంతోషానికీ కారణం అయింది. ఆర్థిక పురోగతి ఉంటే ఓ కుటుంబం జీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యం. ఆ విధంగా జీవన ప్రమాణాల మెరుగుదలతో పాటు గృహిణులకు సమాజంలో గౌరవం పెంచేందుకు ఈ ప్రభుత్వం ఆసరా తోసహా మరికొన్ని పథకాలను సమర్థంగా నిర్వహిస్తోంది. వారి ఉన్నతికి కారణం అవుతోంది. పురుషులతో సమానంగా రాణించే గ్రామీణ మహిళలకు ఓ అన్నగా జగన్ అండగా నిలుస్తున్నారు. ఓ కొడుకుగా ఆయా కుటుంబాలకు చేదోడు వాదోడు అవుతున్నా రు. ఈ విషయాన్ని గుర్తించి మీరంతా మీ మీ సంఘాల బలోపేతానికి, కుటుంబాలలో ఆర్థిక సంబంధ వ్యవహారాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి. మేలు చేసే ప్రభుత్వానికి మరోసారి మద్దతుగా నిలవాలి... ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వెనుక సామాజిక కారణాలు ఉద్దేశాలను గ్రహించాలి. ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నా ఇలాంటి పెద్ద ఎత్తున సహాయం దేశంలో మరే ఇతర రాష్ట్రం చేయడం లేదు.దీనికి కారణం 2019 ఎన్నికల్లో మీరు ఓట్లు వేసి గెలిపించడం వల్లనే సాధ్యం అయ్యింది. గత ప్రభుత్వం మీకు ఇవ్వాల్సినవి మింగేస్తే.. మన ప్రభుత్వం మాత్రం పేదలకు అందాల్సినవి అన్నీ సజావుగా మధ్యవర్తుల ప్రమేయం అన్నది లేకుండా అందిస్తోంది. గొప్ప మనసు ఉన్న ముఖ్యమంత్రి జగన్ నిలిచిపోతారు. లంచాలకు తావులేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం చరిత్రలో స్థానం దక్కించుకోనుంది. మీరంతా ఆయనను ఓ కొడుకుగా దీవించాలి. మీ అందరికీ ఆయన కొడుకుగా, అన్నగా, మీ పిల్లలకు మేనమామగా అండగా ఉంటున్నారు అన్న విషయాన్ని గ్రహించాలి. మరోసారి ఆయన్ను మీరంతా గెలిపించాలి. సంక్షేమ పథకాల వర్తింపు అన్నది నిష్పక్షపాతంగా సాగిస్తున్న వైనం కారణంగానే ఇవాళ పేదలు ఆనందంగా ఉండగలుగుతు న్నారు. ఆ రోజు మాదిరిగా ఇక్కడ మధ్యవర్తుల ప్రమేయం అన్నది లేనేలేదు. పథకాలు వర్తింపు చేస్తూ ఉంటే,సంక్షేమాన్ని ఇంత పెద్ద ఎత్తున పారదర్శకంగా అమలు చేస్తూ ఉంటే సీఎం ను ఉద్దేశించి విపక్షాలు ఏవేవో ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ అనాలోచిత పనులు అని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి డబ్బులు వృథా చేస్తున్నారని అంటున్నాయి. వీటిని మీరంతా తిప్పికొట్టాలి. ఓటు ద్వారా మరోసారి ఆయనకు అధికారం అందించగలిగే అధికారం మీకే ఉంది అని మరోసారి విన్నవిస్తూ ఉన్నాను. సీఎం వైయస్ జగన్ డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అర్హులయిన పేదలకు ఆర్థికంగా చేయూత ఇవ్వడం,వారి స్థితిగతులు పెంచడం అన్నది దుర్వినియోగమా ? పేద,దిగువ మధ్య తరగతి కుటుంబాలు సంతోషంగా ఉండాలి. వారి పిల్లలు ఆనందంగా ఉండాలి. ఆ విధంగా జీవన ప్రమాణాలు పెరగాలి. అని అనుకోవడం తప్పా ? సమాజంలో మీ గౌరవం పెంచడం దుర్వినియోగమా ? వీటికి సమాధానం చెప్పాల్సిందిగా నేను విపక్ష నేతను కోరుతున్నాను. మీరంతా విపక్ష నేతల మాటలు నమ్మి మోసపోవద్దు. గతంలో ఇదే మాదిరిగా డ్వాక్రా రుణాలను మేమే తిరిగి చెల్లిస్తాం అని, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి, మాట ఇచ్చి తప్పారు. కనుక వీరిని నమ్మి మరోమారు మీరు నిండా మునిగిపోవద్దు. మళ్లీ సైకిల్ పార్టీకి చెందిన నాయకులు అధికారంలోకి వస్తే ఇప్పటి పథకాలు మీకు అందకుండా పోతాయి. మీరు అన్నం తినే చేయిని మీ అంతట మీరే నరుక్కోవద్దు అని విన్నవిస్తూ ఉన్నాను. నిత్యావసర ధరలు పెరిగాయి అని టీడీపీ అంటుంది... దేశం మొత్తం మీద ధరలు పెరిగాయి. అలా చెబుతున్న టీడీపీ నేతలను అడుగుతున్నా దేశంలో ఏ రాష్ట్రంలో తక్కువ ధరలు ఉన్నాయో చెబితే అక్కడి నుంచే మేం సరకులు తెచ్చుకుంటాం. అదేవిధంగా ఇవాళ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలుఇచ్చాము. ఇల్లు లేని పేద వాడు..నా తాతకు ఇల్లు లేదు, నా తండ్రికి ఇల్లు లేదు..నాక్కూడా ఇల్లు లేదు అని బాధ పడే వారు. ఆఖరికి నా కొడుక్కి కూడా ఇల్లు లేదు అని బాధ పడే వారు. సొంత ఇంట్లో పడుకున్నాము అనే తృప్తి లేని పేదలు ఎందరో ఉండేవారు. కానీ ఇవాళ జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక, 12 వేళ కోట్ల రూపాయలు వెచ్చించి, 31 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చాము. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దేశంలో ఎన్నడూ ఈ విధంగా జరిగింది లేదు. ఆ రోజు రైతుల అప్పు తీర్చుతాము అని బాబూ చెప్పారు? తీర్చరా ? లేదు. అదే రైతులకు ఇవాళ పెట్టుబడి సహాయం కింద రూ.13500 ఏటా ఇస్తున్నాము. అంతేకాదు ఏ పేదవాడికి చదువు భారం అవ్వకూడదు అని భావించి,స్కూల్స్ లో మార్పులు చేశాం. పిల్లలకు మంచి ఆహారం అందిస్తూ ఉన్నాం. ధనవంతుల పిల్లలలానే నాణ్యమయిన విద్య అందుకునేందు కు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం. వారికి షూస్,బెల్ట్,యూనిఫాం,బుక్స్ ఇచ్చాం. ప్రపంచంతో పోటీ పడే విధంగా వారి సిలబస్ లో మార్పులు తీసుకు వచ్చాం. బిడ్డలను చదివించడం అన్నది పేద,దిగువ మధ్యతరగతి కుటుంబాలకు భారం కాకూడదు అని భావించి అమ్మ ఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాలకు రూ.15వేలు ఏటా జమ చేస్తున్నాం. ఇంకా అనేక పథకాలు విద్యా,వైద్య రంగాల బలోపేతానికి అమలు చేస్తున్నాం. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, రాష్ట్ర తూర్పు కాపు కార్పోరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ పైడిశెట్టి జయంతి, బొడ్డేపల్లి పద్మజ, ఎంపీపీ గొండు రఘురాం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, సర్పంచ్ గొలివి వెంకటరమణమూర్తి,సుగ్గు లక్ష్మీ నరసింహ దేవి, బరాటం నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీలు అరవల రామకృష్ణ, అందవరపు బాలకృష్ణ పీస శ్రీహరి రావు, పీసా గోపి తదితరులు పాల్గొన్నారు.