అసెంబ్లీ: డ్వాక్రా సంఘాల మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకొని.. ఏరుదాటిన తరువాత తెప్ప తగలేసిన చందంగా.. అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశాడని మండిపడ్డారు. సున్నావడ్డీ పథకాన్ని కూడా గత టీడీపీ ప్రభుత్వం నీరుగార్చిందని గుర్తుచేశారు. అసెంబ్లీలో మంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ..
‘డ్వాక్రా సంఘాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు ప్రతీ ఒక్కరికీ కులం, మతం, ప్రాంతం, వర్గం, చివరకు పార్టీలు కూడా చూడకుండా వైయస్ఆర్ ఆసరా పథకం ద్వారా బకాయిలు మొత్తాన్ని నాలుగు విడతలుగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం 7.97 లక్షల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. మొత్తం సభ్యులు 78.76 లక్షల మంది ఉన్నారు. 2014 నాటికి అప్పు 14,200 కోట్ల పైచిలుకు అయితే.. వాటన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.25,517 కోట్లను నాలుగు విడతలుగా ఇచ్చే కార్యక్రమాన్ని గొప్పగా అమలు చేస్తుంది. డ్వాక్రా గ్రూపుల్లో కొంతమంది అక్కచెల్లెమ్మలకు టెక్నికల్ సమస్యలతో సాయం అందలేకపోతుందని చెబుతున్నారు.. వాటన్నింటినీ యుద్ధప్రాతిపదిక పరిష్కరిస్తాం.
గడప గడపకూ మన ప్రభుత్వం అనే గొప్ప కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ రూపొందించారు. నవరత్నాల పథకాలు ప్రతీ ఇంటికి అందుతున్నాయా లేదా.. తెలుసుకుంటే సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రతీ ఎమ్మెల్యే ప్రతీ గడపకూ వెళ్తున్నారు. ఇలాంటి టెక్నికల్ సమస్యలపై వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆ గ్రూపు సమాచారం పంపించి పరిష్కరించడం జరుగుతుంది.
గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలను మోసం చేసింది. సున్నావడ్డీ సుమారు రూ.3500 కోట్లు ఎగ్గొట్టారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2019–20లో రూ.1258 కోట్లు మొదటి సంవత్సరంలోనే సున్నావడ్డీ కింద అందించడం జరిగింది. 2020–21లో రూ.1096 కోట్లు ఇవ్వడం జరిగింది. 2021–22 సంవత్సరానికి రూ.1261 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఓట్ల కోసం అక్కచెల్లెమ్మలకు వాగ్దానాలు ఇచ్చి .. ఏరు దాటిన తరువాత తెప్పతగలేసే విధంగా అక్కచెల్లెమ్మలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది.
అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడాలని, ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలని ప్రతీ ఆడబిడ్డను లక్షాధికారిని చేయాలని దివంగత మహానేత వైయస్ఆర్ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి అక్కచెల్లెమ్మలను ఆదుకున్నారు. మనసున్న నాయకుడిగా సీఎం వైయస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి పేదరిక నిర్మూలనకు కృషిచేస్తున్నారు. అమ్మఒడితో అక్కచెల్లెమ్మల పిల్లలను చదివిస్తున్నారు. ఉన్నత విద్యతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని ప్రతీ అక్కచెల్లెమ్మ ఖాతాల్లో పిల్లల విద్యకు సంబంధించిన సాయం చేస్తున్నారు’’ అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు.