బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ బీసీలపై టీడీపీ కపట ప్రేమ

బీసీలకు న్యాయం జరిగిందంటే అది వైయస్‌ఆర్‌ కుటుంబం వల్లే..

సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి

బాబు ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించగలిగాడా..?

సీఎం వైయస్‌ జగన్‌ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారు

బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రిది

చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా స్థాపించారా..?

డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ధ్వజం

తాడేపల్లి: బడుగ, బలహీనవర్గాలను ఓటు బ్యాంకుగానే చంద్రబాబు వాడుకున్నాడని, బీసీల గురించి, వారి అభ్యున్నతి, సంక్షేమం, బీసీ విద్యార్థుల చదువుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. బీసీలంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగిందంటే.. అది వైయస్‌ఆర్‌ కుటుంబం వల్ల మాత్రమేనని, బీసీలను చంద్రబాబు వాడుకొని వదిలేశాడన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయని, బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నాడని, బాబును బీసీలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఏం మాట్లాడారంటే..

2004–09లో బీసీల పిల్లలు ఉన్నత స్థాయి చదువులు చదువుకుంటేనే పేదరికం నిర్మూలన చేయగలం అని చెప్పి ఆరోజు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పెట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పేదలను ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు ఇలాంటి సంస్కరణలను, ఇలాంటి పరిపాలనను ఎందుకు చేయలేకపోయారు. ఎన్నికల తరువాత బాబు ఏ ఒక్క రోజు కూడా బీసీలను పట్టించుకున్న పాపానపోలేదు. 

సీఎం వైయస్‌ జగన్‌ 2019 ఎన్నికల ముందు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ రాష్ట్రంలోని ప్రతీ పేదవాడి కష్టాన్ని తెలుసుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రాష్ట్ర ప్రజల సుస్థిరత, ఆర్థికంగా మెరుగుపరిచేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.  నవరత్నాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రతీ బీసీ పిల్లలు చదువుకోవాలని అమ్మఒడి కార్యక్రమం పెట్టారు. అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదగాలని వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ చేయూత, పిల్లల కోసం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఇలా అనేక కార్యక్రమాలను ప్రతీ బీసీ వర్గాలకు అందజేస్తున్నారు. దేశ చరిత్రలో నిలిచిన ఏకైక నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. 

చంద్రబాబు మాట్లాడితే.. బీసీలు అని మాట్లాడుతాడు. ఈరోజుకూ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మళ్లీ బీసీలను దగ్గర చేర్చుకునేందుకు, మాయమాటలు చెప్పి మాసిపూసి మారేడు కాయచేసుకోవాలని ఈరోజు  చంద్రబాబు బీసీలు గుర్తువచ్చారు. బీసీలకు న్యాయం జరిగిందంటే.. అది వైయస్‌ఆర్‌ కుటుంబం మాత్రమే చేసింది. చంద్రబాబు వాడుకోవడం వరకే.. 

అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజ్యసభలో చంద్రబాబు ఒక్క బీసీనైనా కూర్చోబెట్టాడా..? ఢిల్లీ స్థాయికి పంపించగలిగాడా..? బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలి.. న్యాయం చేయాలని అనేక సంస్కరణలు తీసుకురావడమే కాకుండా బీసీ వర్గాల నుంచి రాజ్యసభకు నలుగురిని పంపించారు. అందులో ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌.. ఇలా నలుగురు నాయకులను ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి రాజ్యసభ సభ్యులుగా కూర్చోబెట్టిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. బీసీలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయి.. ఎన్ని ఉప కులాలు ఉన్నాయి.. వాటిపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి.. ఏ ఒక్క కులం కూడా మిగిలిపోకుండా.. 56బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. గతంలో ఒకే రాష్ట్ర చైర్మన్‌ ఉంటే.. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. ఆ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. ఎప్పటికప్పుడు ఆ కులాలకు సంబంధించిన వారికి ప్రభుత్వం నుంచి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా.. ఏ ఒక్కరికైనా అందకపోతే వెంటనే మంజూరు చేసే విధంగా.. సంవత్సరానికి రెండు సార్లు మిగిలిపోయిన వారికి సాయం కూడా అందిస్తున్నారు. 

గత చంద్రబాబు పాలనలో ఏపథకం కావాలన్నా.. జన్మభూమి కమిటీలు పెట్టి దోపిడీ విధానంతో పరిపాలన చేశారు. 2019లో వైయస్‌ జగన్‌ముఖ్యమంత్రి అయిన తరువాత లంచగొండి విధానానికి స్వస్తి పలికి.. ఏ ఒక్క సిఫారుసు లేకుండా పేదలకు న్యాయం చేయాలని,అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని ప్రతీ పథకం ద్వారా నేరుగా డీబీటీ పద్ధతిలో సాయం చేస్తున్నారు. 

ఆరోజున వైయస్‌ఆర్‌ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను కళ్లారా చూశారు.. తెలుసుకున్నారు. ఆరోజురాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే అనేక సంస్కరణలు తీసుకువచ్చి విప్లవాత్మక పాలన అందించారు. ఆయన మన మధ్య నుంచి దూరమైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆయన్ను ఎప్పుడూ స్మరించుకుంటున్నారు. ఎవరి దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రజలమద్దతుతో, ప్రజాభిమానంతో గెలిచిన నాయకుడిగా వైయస్‌ఆర్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తే.. ఆ నాయకుడి తనయుడు వైయస్‌ జగన్‌ నూతన ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర ప్రభుత్వాన్ని, సంక్షేమ పరిపాలనను అందిస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలు కూడా చూడకుండా అర్హత ఉన్నవారందరికీ సంక్షేమ పథకాలు అందించారు. ప్రజలు ఇదంతా గమనించారు  కాబట్టే.. ప్రతిపక్షాలు ఎలాంటి ఆందోళన చేసినా.. ప్రజలు మద్దతు తెలపలేదు. వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గపథకాలు. 

చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా స్థాపించారా..? ఇచ్చిన పర్మిషన్లు అన్నీ వారి సామాజిక వర్గానికిచెందిన వారికి మాత్రమే మెడికల్‌ ప్రైవేట్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకునే  అవకాశాన్ని కల్పించారు. ఎన్నిలకు వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధంగానే  ఉంది. దానికి నిదర్శనమే.. గడిచిన సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు ఎందుకు నిర్వహించలేకపోయాడు. రాష్ట్ర ప్రజల దగ్గరకు వెళ్లి ఓటు అడిగేధైర్యం చంద్రబాబుకు లేదు కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా.. టీడీపీ వారిని నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చెప్పి పారిపోయాడు. ఇటువంటి పిరికిపంద నాయకత్వంలో పనిచేస్తున్నామా అని టీడీపీ సెకండ్‌ క్యాడర్‌ మాట్లాడారు. 

బీసీల గురించి, వారి అభ్యున్నతి, సంక్షేమం, బీసీ విద్యార్థుల చదువుల గురించి మాట్లాడే అర్హతచంద్రబాబుకు లేదు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత సచివాలయాలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించారు. రైతులకు 12500 ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తరువాత అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి రూ.13500 క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరంక్యాలెండర్‌ పెట్టి అమలు చేస్తున్నారు. కేవలం రెండు పేజీల మేనిఫెస్టోను పెట్టి హామీలన్నీ అమలు చేస్తున్నారు. బీసీతరఫున గట్టిగా చెబుతున్నా.. బీసీలంతా వైయస్‌ఆర్‌ సీపీ వెంటే ఉన్నారు.. టీడీపీకి బీసీలంతా తిలోదకాలు ఇచ్చి ఇంటికి పంపించారు. 
 

Back to Top