పశ్చిమగోదావరి: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, విలేజ్ హెల్త్ క్లినిక్స్, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడిలో డాక్టర్ వైయస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కోసం రు.10.20 కోట్లతో భవనాల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో 12 వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.94.88 కోట్లను సీఎం మంజూరు చేశారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామని వివరించారు. కోవిడ్ నివారణలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందంజలో ఉందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్య పరీక్షలు రేటును రూ.1600 నుంచి రూ. 800లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైద్యం నిమిత్తం 1563 బెడ్స్, ఆక్సిజన్ పైప్లైన్స్ కోసం రూ. 3.10 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రూ. 7500 కోట్లతో 16 నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామన్నారు.