అమరావతి: కోడెల శివప్రసాద్ అకాల మరణం దురదృష్టకరమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. కోడెల కుటుంబంతో పాటు, గోదావరిలో లాంచీ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదన్నారు. సీనియర్ నేత చనిపోయాడనే బాధ లేకుండా తెలుగుదేశం పార్టీ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నారన్నారు. టీడీపీ నేతల విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వాస్తవాలు అందరికీ తెలుస్తాయన్నారు.