

















వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ భరోసా
వైయస్ జగన్ను కలిసిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్, పొగాకు రైతులు
తాడేపల్లి: రైతులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్, పొగాకు రైతులు కలిశారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని వారికి వైయస్ జగన్ భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడారు. వారి మాటల్లోనే..
అన్నవరపు గణేష్, రైతు, రావికంపాడు, చింతలపూడి నియోజకవర్గం, ఏలూరు జిల్లా
నాకు నాలుగెకరాలు పామాయిల్ ఉంది, సీజన్ ప్రారంభం అయింది, గతంలో సీజన్ లేనప్పుడు పామాయిల్ టన్ను రూ. 21,400 ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం టన్ను రూ. 18,600 కు వచ్చింది, మాకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి, రైతులకు ఏం మిగలడం లేదు, ఇంకా రేటు తగ్గితే మేం పూర్తిగా నష్టపోతాం, దయచేసి ప్రభుత్వం కనీసం టన్నుకు రూ. 20,000 మద్దతు ధర అయినా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మేం మా సమస్యను జగన్ గారి దృష్టికి తీసుకొచ్చాం, జగన్ గారు తప్పక మాకు అండగా ఉంటామన్నారు.
తాతా రవి, రైతు, బాదరాల గ్రామం, ఏలూరు జిల్లా
మేం కోకో రైతులం, జగన్ గారిని కలిసి మా కోకో రైతుల సమస్యను వివరించాం, కోకోను ప్రైవేట్ కంపెనీలు గతంలో కేజీ రూ. 1,000 కి కొనుగోలు చేశాయి, కానీ ఇప్పుడు మాత్రం కేజీ రూ. 750 సీజన్ ప్రారంభంలో ఇచ్చి ఇప్పుడు రూ. 400 ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం కేజీ రూ. 850 అమ్ముతుంటే ఇక్కడ మాత్రం సిండికేట్ అయి రూ. 300-400 మధ్య కొనుగోలు చేస్తున్నారు, పైగా టీడీపీ రైతుల దగ్గరే కొంటున్నారు, మేం వైఎస్సార్సీపీ సానుభూతిపరులమని మా దగ్గర కొనడం లేదు. ఇవన్నీ వైయస్ జగన్ గారికి చెప్పాం, పైగా నిరుడు రేట్ పలికిందని ఈ ఏడు కౌలు రేట్లు కూడా పెంచడంతో మేం తీవ్రంగా నష్టపోతున్నాం. మా రైతులంతా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఇలాగైతే మా రైతులు ఏమవ్వాలి, మా సమస్యలు విన్న వైయస్ జగన్ గారు తప్పనిసరిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు.