తాడేపల్లి: వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర.. ఒక్క పైసా కూడా తగ్గకూడదని, రైతులకు ఎంఎస్పీ ధర అందాల్సిందేనని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్ డిపార్ట్మెంట్లతో సమన్వయం ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. లైన్ డిపార్ట్మెంట్లతో సమర్థవంతంగా సమన్వయం.. ``రైతులకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా, పిషరీస్, పశుసంవర్థక, ఉచిత విద్యుత్, సీహెచ్జీల నిర్వహణ తదితర కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నాయి. ఈ కార్యకలాపాలు సమర్థవంతంగా ముందుకు సాగాలంటే.. సంబంధిత శాఖలతో (లైన్ డిపార్ట్మెంట్స్) చక్కటి సమన్వయం అవసరం. వ్యవసాయం, ఫిషరీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ తదితర శాఖలతో సమన్వయం సమర్థవంతంగా ఉండాలి. నిర్వహిస్తున్న కార్యకలాపాలకు సంబంధించి వివిధ శాఖలతో కలిసి అనుసంధానమై ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగేందుకు వీలుగా సమర్థవంతమైన మార్గదర్శక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు.. అవసరం లేకపోయినా, విచక్షణ రహితంగా ఎరువులు, పురుగు మందులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించాలి. దీనిపై అధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిరైతుకు తన భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డులను క్రమం తప్పకుండా ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలి. రైతు సాగుచేస్తున్న భూమి స్థితిగతులు ఏంటి? ఎలాంటి పంటలకు అనుకూలం? ఎలాంటి రకాలు వేయాలి? ఎంతమోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కల్పించాలి. దీనివల్ల విచక్షణ రహితంగా ఎరువుల వాడకం తగ్గుతుంది. ఒక మనిషికి డాక్టర్ ఎలా ఉపయోగపడతాడో, పంటలసాగులో రైతులకు ఆర్బీకేలు అదే విధంగా ఉపయోగపడాలి. ప్రతి ఖరీఫ్, రబీ ముగిసిన తర్వాత సాయిల్టెస్టులు చేసేవిధంగా ఒక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. వైద్య ఆరోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తరహాలో.. ఒక కార్యక్రమాన్ని రూపొందించి క్రమం తప్పకుండా రైతులకు ఈ విషయంలో సలహాలు సూచనలు గ్రామాల్లో అందాలి. ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం: ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలి. కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదు. రైతులకు ఎంఎస్పీ ధర అందాల్సిందే. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు. ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ టెస్టింగ్, క్వాంటిటీ టెస్టింగ్ జరగాలి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ మీద, ఎంఎస్పీ మీద, అనుసరించాల్సిన నియమాల మీద రైతుల్లో అవగాహన కల్పించాలి. దీనికి సంబంధించి కరపత్రాలను, పోస్టర్లను, హోర్డింగ్లను పెట్టాలి. ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలను నివారించడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల స్థాయిలో వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసుకోవాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం తీసుకోవాలి. వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి`` అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత మంత్రులు, అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, సివిల్ సప్లయిస్ కమిషనర్ గిరిజా శంకర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సి. హరికిరణ్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ వీరపాండ్యన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.