నెలరోజుల్లో ప్రాధాన్యత ప్రకారం పనులు మొదలుపెట్టాలి

'స్పంద‌న' వీడియో కాన్ఫ‌రెన్స్‌లో కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

డిసెంబర్‌ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేయాలి

అక్టోబరు 25న ఈ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రద‌ర్శించాలి

ఉపాధి హామీ పథకం కింద‌ కనీస వేతనం రూ.240 అందేలా చూడాలి

ఎస్‌డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు

అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత, అదే రోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ 

నవంబరు 10న జ‌గ‌న‌న్న వసతి దీవెన విడుదల 

తాడేపల్లి: ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లో ఎమ్మెల్యేలు గడప గడపకూ మనప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన తరువాత నెలరోజుల్లో ప్రాధాన్యత ప్రకారం పనులు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 25న‌ సచివాలయాల్లో ఈ–క్రాపింగ్‌ జాబితాలను ప్రదర్శించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం రూ.240 అందేలా చూడాలని ఆదేశించారు. డిసెంబర్‌ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలన్నారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేస్‌–3 కింద డిసెంబర్‌లో ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి స్పందన కార్య‌క్ర‌మంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పనుల మంజూరు, వ్యవసాయం, ఈ– క్రాపింగ్, ఉపాధి హామీ పనులు, వైయస్ఆర్ విలేజ్, అర్బన్‌ క్లినిక్స్, గృహనిర్మాణం, ఇళ్ల పట్టాలు, జగనన్న భూ హక్కు – భూ రక్ష సర్వే, స్పందన అర్జీలు, జాతీయ రహదారులకు భూ సేకరణ అంశాలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షించారు. 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు పలు అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఏమన్నారంటే...

గడప గడపకూ మన ప్రభుత్వం
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం గ్రామ, వార్డు సచివాలయాల్లో కొనసాగుతోంది. ప్రజలనుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రాధాన్యత పనులకోసం ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించాం. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎలాంటి ఆలస్యానికీ, అలసత్వానికీ తావు ఉండకూడదు. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఈ కార్యక్రమం ద్వారా కవర్‌ చేస్తున్నాం. ఎమ్మెల్యే, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మండల స్దాయి సిబ్బంది అందరూ కూడా నెలలో కనీసం 6 సచివాలయాలను సందర్శించాలి. ఎమ్మెల్యే గ్రామ, మండల స్ధాయి సిబ్బందితో కలిసి కనీసం 2 రోజులు పాటు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో ఉండాలి. ప్రతి ఇంటినీ కూడా కవర్‌చేయాలి. ఒక రోజులో కనీసం 6 గంటలపాటు గ్రామ, వార్డు సచివాలయంలో గడప గడపకూ నిర్వహించాలి. మండల అధికారులు, పాలనా సిబ్బంది, సచివాలయ సిబ్బంది కూడా అంతే సమయం గడపాలి. 

ఒక గ్రామ లేదా వార్డు సచివాలయంలో రెండు రోజుల గడపగడపకూ కార్యక్రమం ముగిశాక అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనులను మంజూరు చేయాలి. ఈ మంజూరు చేసిన పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. మంజూరైన తర్వాత నెలరోజుల్లోగా పనులు ప్రారంభం కావాలి. గడప గడపకూ కార్యక్రమం.. నిర్దేశించుకున్న మేరకు ప్రతి వార్డు లేదా గ్రామ సచివాలయంలో 2 రోజులపాటు, రోజుకు 6 గంటలపాటు నిర్వహించకపోతే పనులు మంజూరు కావు. ఇలా నిర్దేశించుకున్న విధంగా నిర్వహించని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనులు మంజూరు కావు. ఇప్పటి వరకూ గడప గడపకూ నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రాధాన్యతగా గుర్తించిన పనులను మంజూరుచేయకుండా మిగిలిపోయిన వాటిని అక్టోబరు 5లోగా మంజూరుచేయాలి. ఇలా మంజూరు చేసిన పనులన్నీ కూడా అక్టోబరు చివరి నాటినుంచి ప్రారంభం కావాలి.

వ్యవసాయం..
ఈ– క్రాప్‌ అన్నది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. పొరపాట్లు లేకుండా నూటికి నూరుపాళ్లు ఈ–క్రాపింగ్‌ పూర్తి చేయాలి. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఈ–క్రాపింగ్‌పై సమీక్ష చేయాలి. ఈ సీజన్‌లో 107.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ– క్రాప్‌లో ప్రతి దశను కూడా నూటికి నూరుపాళ్లు పూర్తిచేయాలి. ఈ సీజన్‌లో సాగు చేసిన 107.62 లక్షల ఎకరాల్లో 96శాతం తొలిదశ పూర్తిచేశారని అధికారులు చెప్తున్నారు.
మిగిలిపోయిన 4శాతాన్ని సెప్టెంబరు 30లోగా పూర్తిచేయాలి. రైతులను వారి క్షేత్రాల్లోకి తీసుకెళ్లి ఫొటో తీసుకుని, వివరాలు నమోదు అనేది సెప్టెంబరు 30లోగా పూర్తిచేయాలి. ఇక రెండో దశ కింద విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, వీఆర్వోలు బయోమెట్రిక్‌ ద్వారా వీటిని ఆధీకృతం చేయాలి, అక్టోబరు 3లోగా ఇది పూర్తిచేయాలి. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, వీఆర్వోలు రైతుల కేవైసీలను అక్టోబరు 10లోగా పూర్తిచేయాలి. అక్టోబరు 10 నుంచి రైతులకు ఈ- క్రాప్‌లో డిజిటల్‌ రశీదులు, ఫిజికల్‌ రశీదులు ఇవ్వాలి. అక్టోబరు 15 లోగా ఈ రశీదులు ఇవ్వడం పూర్తికావాలి. అక్టోబరు 15 నుంచి సోషల్‌ ఆడిట్‌ చేయాలి. అక్టోబరు 25 నుంచి వారం రోజుల పాటు ఈ– క్రాప్‌ చేసిన తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. నవంబరు 1 నుంచి ఈ తుది జాబితాను అన్ని పోర్టల్స్‌లోను అందుబాటులో ఉంచాలి. ఈ షెడ్యూల్‌ప్రకారం ఈ– క్రాప్‌ పూర్తిచేసే బాద్యత కలెక్టర్లదే. ఇది సరిగ్గా జరిగిందా? లేదా? అన్నది కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి. కనీసం 10శాతం ఈ– క్రాప్‌లను స్వయంగా  ఎంఏఓ, ఎమ్మార్వోలు పరిశీలించాలి.  కనీసం 6 శాతం ఆర్డీఏలు, ఏవీఏలు పరిశీలించాలి. కనీసం 5శాతం ఈ–క్రాప్‌లను డీఓలు, 2 శాతం ఈ–క్రాప్‌లను జేసీలు, 1 శాతం కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలి:

ఉపాధిహామీ పనులు..
ఇప్పటివరకూ 17.05 కోట్ల పనిదినాలను సృష్టించారు, ఇది అభినందనీయం. ఇప్పటివరకూ సగటు వేతనం రూ. 210.02గా ఉంది, కనీసంగా రూ.240లు వేతనం అందాలి. ఉపాధిహామీ పనులకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం నుంచి రూ.1400 కోట్లు బకాయిలు రావాలి. ఇవి కూడా త్వరలోనే వస్తాయి. వీటిని వెంటనే విడుదలచేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌లను వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. 4500 గ్రామ సచివాలయాలకు డిసెంబర్‌లోగా కేబుల్‌ ద్వారా  ఇంటర్నెట్‌ సౌకర్యం అందుతుంది. అక్కడ డిజిటల్‌ లైబ్రరీలను పూర్తిచేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలి. మిగిలిన చోట్ల కూడా డిజిటల్‌ లైబ్రరీలను నిర్మాణంపట్ల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. పులివెందుల నియోజకవర్గంలో వేల్పుల వద్ద గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ నిర్మించారు. అందులో డిజిటల్‌ లైబ్రరీ కూడా ఉంది. ఆ గ్రామానికి చెందిన 30 మంది డిజిటల్‌ లైబ్రరీని వాడుకుంటూ వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. అందుకే వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని కలెక్టర్లకు చెప్తున్నాను.

గృహనిర్మాణం..
గృహనిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, ప.గో, బాపట్ల, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో గృహనిర్మాణం బాగుంది. సత్యాసాయి జిల్లా, ప్రకాశం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం జిల్లాలు దీనిపై దృష్టిపెట్టాలి. విశాఖపట్నంలో 1.24 లక్షల ఇళ్లు కేటాయించాం. అక్టోబరు  నాటికి అన్ని ఇళ్ల పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోండి. ఇళ్ల నిర్మాణపనులకోసం అవసరమైన మౌలిక సదుపాయాలు (బోర్‌వెల్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు, అప్రోచ్‌ రోడ్లు, సీడీ వర్క్స్, గోడౌన్స్‌) ఇప్పటికే 85శాతం పూర్తయ్యాయి. ఇక్కడ ఇళ్ల పనులు వేగంగా జరిగేలా సంబంధిత కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. పీఎంఏవై – వైయస్సార్‌ – గ్రామీణ కింద మంజూరైన ఇళ్లు నిర్మాణ పనులు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. పూర్తయిన పనులకు సంబంధించి పేమెంట్లు కూడా ఎప్పటికప్పుడు విడుదలచేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగంగా ముందుకు సాగాలి:

ఆప్షన్‌ –3 కింద 3.27 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. 10వేల ఇళ్లకు పైబడి ఉన్న లే అవుట్లలో స్టేజ్‌ కన్వర్షన్‌ వేగంగా జరగాలి. విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, ఆదోని, తిరుపతి, జీవీఎంసీ లే అవుట్లపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు పత్యేక దృష్టిపెట్టాలి. డిసెంబర్‌ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసేలా అడుగులు ముందుకేయండి. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకోండి. ఇళ్లు పూర్తయ్యే నాటికి ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్‌...  ఈ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. మిగిలిపోయిన లబ్ధిదారులకు డిసెంబర్లో ఫేజ్‌–3 కింద ఇళ్ల మంజూరుకు సంబంధించి కలెక్టర్లు కార్యాచరణ రూపొందించుకోవాలి. పంపిణీ చేసిన ఇళ్లస్థలాలపై ఆడిట్‌ చేయమని చెప్పాను. ఆడిట్‌ను సంపూర్ణంగా పూర్తిచేయాలి. ఇళ్లస్థలాల లబ్ధిదారులకు పూర్తిగా పట్టా పత్రాలు అందడం, వారికి పొజిషన్‌ చూపించడం దీని ఉద్దేశం. వచ్చే 20 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలి. డిసెంబర్‌ నాటికి 1.75 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తిచేసి ఇవ్వబోతున్నాం.  ఈమేరకు కలెక్టర్లు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగంగా పూర్తి కావాలి. టిడ్కో కాలనీల్లో ఇన్‌ఫ్రా పనులు కూడా పూర్తిచేయాల్సిన అవసరం ఉంది.

జగనన్న భూ హక్కు, భూ రక్ష సర్వేపై సీఎం సమీక్ష.
ఇప్పటివరకూ 5,738 గ్రామాల్లో డ్రోన్‌ ఫ్లైయింగ్‌ పూర్తి. 2,662 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలు జిల్లాలకు విడుదల. జగనన్న భూ హక్కు, భూ రక్ష సర్వేపై స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ప్రకారం ప్రక్రియ సాగాలి.  స్పందన అర్జీల్లో సమయపాలన, నాణ్యత కనిపిస్తోంది. దీనికి దోహదపడ్డ అధికారులకు అభినందనలు.  నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాక పెండింగ్‌లో ఉన్న కేసులు, అలాగే తిరిగి విచారణ చేయాల్సిన అర్జీల సంఖ్య బాగా తగ్గింది. పరిష్కారంలో నాణ్యత ఉందనేందుకు ఇది నిదర్శనం. కలెక్టర్లు అందరికీ అభినందనలు. అర్జీ పరిష్కారానికి ముందు విచారణ వివరాలను అర్జీదారులకు ఫోన్‌ద్వారా తెలియజేయాలి. ఈ కొత్త ఫీచర్‌ సెప్టెంబరు 14 నుంచి ప్రారంభం అయ్యింది. ఇది తప్పనిసరిగా అమలు చేయాలి. పిటిషనర్‌ను కలిసిన తర్వాత.. లొకేషన్‌లో పిటిషనర్‌తో సెల్ఫీ తీసుకుని, దాన్ని అప్‌లోడ్‌ చేయాలి. ఈ ఫీచర్‌ కూడా సెప్టెంబరు 26 నుంచి ప్రారంభం అయ్యింది. ఇదికూడా తప్పనిసరిగా పాటించాలి. ప్ర‌తి బుధవారం కలెక్టర్లు స్పందనపై సమీక్ష చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ సాయంత్రం 3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలి. కలెక్టర్ల నుంచి దిగువ స్థాయి అధికారుల వరకూ తప్పనిసరిగా స్పందనలో పాల్గొనాలి. స్పందన కార్యక్రమం నాటికి వారు అందుబాటులో ఉండాలి. స్పందనలో పాల్గొన్న అధికారులు తప్పనిసరిగా కలెక్టర్లు నిర్వహించే సమీక్షకు హాజరుకావాలి. స్పందన అర్జీల పరిష్కారంలో కలెక్టర్లు, అధికారులు, ఎస్పీలు మానవీయత ప్రదర్శించాలి. తిరిగి విచారణ చేయాల్సిన అర్జీల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాలి. అలా జరిగితేనే అర్జీలు పరిష్కారంలో నాణ్యత ఉన్నట్టు. తిరిగి అదే సమస్యపై అర్జీ వస్తే పై అధికారిచేత లేదా వేరే అధికారి చేత విచారణ చేయించండి. 

ఎస్‌డీజీ లక్ష్యాలు– కలెక్టర్ల పర్యవేక్షణ
ఎస్‌డీజీ లక్ష్యాలపైన కలెక్టర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. డేటాను సక్రమంగా అప్‌లోడ్‌ చేయాలి. అప్పుడే ఎస్‌డీజీల్లో మార్పులు కనిపిస్తాయి. ఎస్‌డీజీల ఆధారంగా కలెక్టర్లకు మార్కులు.  ఎస్‌డీజీ లక్ష్యాలపైన మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తం చూస్తుంది.  మీ పనితీరు, సమర్థత ఎస్‌డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా నిర్ణయిస్తాం. మీరు లక్ష్యాలను ఎలా అందుకున్నారన్నది మీ పనితీరుకు ప్రమాణం.

దిశ యాప్‌ను ప్రతి ఇంట్లో కూడా డౌన్లోడ్‌ చేసుకునేలా చూడాలి. దిశ పనితీరుపై పర్యవేక్షణ చేసేలా కలెక్టర్లు, ఎస్పీలు మాక్‌ కాల్స్‌ చేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఎసీబీ నంబర్‌ 14400 పోస్టర్‌ అందరికీ కనిపించేలా 3 బై 5 సైజులో ఉండాలి. ఈ పోస్టర్‌ లేకపోతే, సంబంధిత కార్యాలయంలో ఉండే ముఖ్య అధికారిని బాధ్యుడ్ని చేయండి. అలాగే ప్రతి కాలేజీలో కూడా ఎస్‌ఈబీ నంబర్‌ 14500 ఉండాలి. మాదక ద్రవ్యాలకు సంబంధిన ఘటనలపై తగిన చర్యలు తీసుకోవాలి.

జాతీయ రహదారుల భూసేకరణపైనా సమీక్ష.
జాతీయ రహదారులకు సంబంధించిన భూ సేకరణపై కలెక్టర్లు దృష్టిసారించాలి. బెంగళూరు – విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంలో 345 కి.మీ మేర ఉంది. దాదాపు రూ.17వేల కోట్లు ప్రాజెక్టు ఇది. దీనికి అవసరమైన భూసేకరణపై దృష్టిపెట్టాలి. జాతీయరహదారులకు సంబంధి 2758 కిలోమీటర్ల పరిధిలో రూ.33,507 కోట్లతో చేపడుతున్న 95 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మరో 2687 కిలోమీటర్ల పరిధిలో... రూ.55,890 కోట్లతో చేపడుతున్న మరో 63 ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయి. జాతీయ రహదారులకు సంబంధించి దాదాపు రూ.1.05 లక్షల కోట్లకు పైగా విలువైన పనులు చేపడుతున్నాం. వీటికి సంబంధించిన భూసేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలి.

– రైతు భరోసా రెండో విడత అక్టోబరు 26న, అదేరోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇస్తున్నాం.
– వసతిదీవెన నవంబర్‌ 10న విడుదల చేస్తున్నాం.

 ఈ సమీక్షా వేశంలో ముఖ్యమంత్రి ప్రధానసలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీస్‌ అజయ్‌ జైన్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌, వ్యవసాయశాఖ కమిషనర్‌ హరికిరణ్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top