వ్యవసాయం మీద ప్రేమ అంటే ఇట్టా ఉంటుంది

కేవలం రైతు భరోసా పథకం ద్వారా రూ.27,062 కోట్లు ఖర్చు చేశాం

అధికారంలోకి వచ్చిన నాటినుంచి రైతుల సంక్షేమం కోసం 1,45,751 కోట్లు ఖర్చు

`వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా` వరుసగా నాల్గో ఏడాది మూడో విడతగా నేడు 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1090 కోట్లు జమ

మాండూస్‌ తుపాన్‌ వల్ల పంటనష్టపోయిన 91,237 మంది రైతన్నల ఖాతాల్లో రూ.77 కోట్లు జమ

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఇదీ.. రైతన్నల మీద మమకారం అంటే ఇదీ

గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని సగం మండలాలు కరువు మండలాలే

మీ బిడ్డ ప్రభుత్వంలో నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించలేదు

దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కరిసి, ప్రతి రిజర్వాయర్, ప్రతి చెరువు నిండింది

గతంలో మాదిరిగా రెయిన్‌గన్లు లేవు.. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్‌ మాత్రమే ఉంది

మనది పేదల ప్రభుత్వం.. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ

తెనాలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గుంటూరు: ‘‘వరుసగా నాలుగో ఏడాది, మూడో విడత వైయస్‌ఆర్‌ రైతు భరోసా–కిసాన్‌ కింద నేడు అందిస్తున్న రూ.1090 కోట్లతో కలిపి ఈ ఒక్క పథకం ద్వారా నాలుగేళ్లు కూడా గడవకముందే రైతన్న కుటుంబాలకు మీ బిడ్డ అందించిన సాయం అక్షరాల రూ.27,062 కోట్లు. రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఇదీ.. రైతన్నల మీద మమకారం అంటే ఇదీ.. వ్యవసాయం మీద ప్రేమ అంటే ఇట్టా ఉంటుందని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెనాలి వేదికగా వరుసగా నాలుగో ఏడాది, మూడో విడత వైయస్‌ఆర్‌ రైతు భరోసా సాయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. అక్షరాల 51.12 లక్షల మంది రైతులకు రూ.2 వేల చొప్పున రూ.1090.76 కోట్లను బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. అదే విధంగా మాండూస్‌ తుపాన్‌ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేశారు. 

నిధుల విడుదలకు ముందు తెనాలి మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతులను, రైతు కుటుంబాలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. వ్యవసాయానికి ఈ మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో చేసిన ఖర్చును, రైతులకు చేస్తున్న మంచిని వివరించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం..
చిక్కటి చిరునవ్వుల మధ్య, చెరగని ఆప్యాయతల మధ్య, మీ ప్రేమా, అభిమానాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

దేవుడి దయతో రైతులకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమలు చేస్తున్నాం. అరకోటికి పైగా రైతు కుటుంబాలకు ఈ కార్యక్రమం వల్ల ఈరోజు మంచి జరుగుతుంది. ఇందులో మొదటిది వరుసగా నాలుగో ఏడాదికి సంబంధించి వైయస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ నాలుగో ఏడాది మూడో విడతకు సంబంధించిన నిధులు బటన్‌ నొక్కి నేరుగా విడుదల చేస్తాం. 

అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడు సంవత్సరాల 9 నెలల కాలంలో నాలుగో ఏడాదికి సంబంధించి చివరి విడతగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నాం. పంట నష్టపోయిన రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పరిహారం నిధులు కూడా విడుద‌ల చేస్తున్నాం. 

వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం అమలు చూస్తే..
రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా రూ.12,500 చొప్పున నాలుగు సంవత్సరాల్లో రూ.50 వేలు ఇస్తామని ఎన్నికల వేళ మాట ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టాం. కానీ, మీ బిడ్డ చెప్పినదానికంటే మిన్నగా ప్రతి ఏటా రూ.13,500 నాలుగు కాస్త ఐదు సంవత్సరాలకు పెంచి ప్రతి రైతన్నకు 50 వేల రూపాయలు కాదు.. అక్షరాల రూ.67,500 ప్రతి రైతు చేతులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నాలుగో ఏడాదికి సంబంధించి రైతు భరోసా కార్యక్రమంలో ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి 11,500 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మొదట మే మాసంలో 7,500, రెండో విడత అక్టోబర్‌ మాసంలో మరో రూ.4 వేలు ఇవ్వడం జరిగింది. మూడో విడతగా రూ.2 వేల చొప్పున అక్షరాల 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్‌ నొక్కి రూ.1,090 కోట్లను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని సగర్వంగా, మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. 

ఈరోజు మనమిచ్చే సాయంతో కలుపుకుంటే ఇప్పటి వరకు కేవలం వైయస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ ద్వారానే రాష్ట్రంలో రైతన్నల కుటుంబాలకు నాలుగు సంవత్సరాల కాలంలోనే ఒక్కో కుటుంబానికి అందిన సాయం అక్షరాల రూ.54 వేలు అందించినట్టు అవుతుంది. వైయస్‌ఆర్‌ రైతు భరోసా సాయం అందుకున్న ప్రతి రైతన్న కుటుంబానికి కూడా వచ్చే ఏడాది కూడా మనం ఇవ్వనున్న రైతు భరోసా రూ.13,500 కలుపుకుంటే మొత్తంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అక్షరాల రైతు కుటుంబానికి రూ.67,500 ఇచ్చినట్టుగా అవుతుంది. 

నేడు అందిస్తున్న రూ.1,090 కోట్లను కూడా కలుపుకుంటే.. రైతు భరోసా అనే ఒకే ఒక్క పథకంతో నాలుగేళ్లు కూడా గడవకముందే మన రైతన్న కుటుంబాలకు మీ బిడ్డ అందించిన సాయం అక్షరాల రూ.27,062 కోట్లు అని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను. ఇదీ రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఇదీ అని సగర్వంగా తెలియజేస్తున్నాను. రైతన్నల మీద మమకారం అంటే ఇదీ అని, వ్యవసాయం మీద ప్రేమ అంటే ఇట్టా ఉంటుందని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను. 

పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులు విడుదల..
ఏ సీజన్‌లో పంటనష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోగా పంట నష్ట పరిహారం అందిస్తున్నాం. మరోసారి ఆ మాట నిలబెట్టుకుంటూ.. 2022 డిసెంబర్‌లో మాండూస్‌ తుపాన్‌ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతన్నలకు నేడు 77 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీని రబీ 2022 ముగియక మునుపే నేడు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నామని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను. నేడు జమ చేయనున్న 77 కోట్ల రూపాయలు కలుపుకుంటే 22.22 లక్షల మంది రైతన్నలకు నాలుగు సంవత్సరాలు కూడా ముగియకమునుపే కేవలం ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపేనా అక్షరాల రూ.1,911 కోట్లు ఇచ్చినట్టు అవుతుందని ఈ సందర్భంగా మీ బిడ్డ సవినయంగా తెలియజేస్తున్నాడు. 

మనందరికీ ఆహార భద్రతతో పాటు 62 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న రంగం.. వ్యవసాయం. ఆ వ్యవసాయం అంటే మనందరికీ గౌరవం, కృతజ్ఞత. అయితే వర్షాలు బాగా కురిసినప్పుడు మాత్రమే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడు. రైతు, రైతు కూలీ ఇద్దరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇదంతా జరగాలంటే దేవుడి దయ చాలా అవసరం. మనందరి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నాలుగు సంవత్సరాలుగా దేవుడి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. గతంలో మాదిరిగా రెయిన్‌గన్లు లేవు.. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్‌ మాత్రమే ఉంది. 2019లో మనం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఈ నాలుగు సంవత్సరాల్లో దేవుడి దయతో ఎక్కడా కరువు ఊసేలేదు. 

ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి..

2014 నుంచి 2019 మధ్య గత ప్రభుత్వ హయాంలో ఒక అన్యాయస్థుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆ కాలంలో ప్రతి ఏటా కరువే. కనీసం ప్రతి ఏటా 300 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్‌ చేస్తే పరిస్థితి. అలాంటి పరిస్థితి, దుస్థితి ఈ నాలుగు సంవత్సరాలుగా దేవుడి దయ వల్ల ఎక్కడా లేదు. మీ బిడ్డ మీ అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాలుగు సంవత్సరాలుగా ఒక్క మండలం కూడా కరువు మండలంగా డిక్లేర్‌ చేయాల్సిన అవసరం లేకుండా దేవుడి దయతో పరిపాలన సాగుతోంది. కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌ 1995 నుంచి 2004 వరకు అప్పట్లో ఇదే అన్యాయస్థుడే ముఖ్యమంత్రి. మళ్లీ 2014–19 వరకు అప్పట్లో ఇదే అన్యాయస్థుడే ముఖ్యమంత్రి. ఈ అన్యాయస్థుడు ముఖ్యమంత్రి అయినా, ఎప్పుడు ఈ పెద్దమనిషి అధికారంలో ఉన్నా.. ఈయన వచ్చినప్పుడుల్లా కరువు కూడా కచ్చితంగా వచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ కనిపించింది. గతాన్ని చూస్తే కనిపించే నగ్నసత్యం ఇది. 

గతంలో నాన్నగారు ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలో అప్పుడూ, మనం 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చాం. మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సమృద్ధిగా వర్షాలుపడ్డాయి. దేవుడి దయతో ఎక్కడా కరువు లేదు. ఇదంతా మంచి పరిపాలన, మంచి మనసుతో చేసే పరిపాలనను దేవుడు కూడా ఆశీర్వదించినట్టుగా వర్షాలు కూడా సమృద్ధిగా పడుతున్నాయి. ఈ నాలుగేళ్లలో ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి రిజర్వాయర్‌ నిండింది. ఈ నాలుగేళ్లుగా మూడు ప్రాంతాల్లోని ప్రతి జిల్లాల్లో ప్రతి చెరువు నిండింది. నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూగర్భ జలాలు పెరిగాయి. చివరకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కుప్పం నియోజకవర్గం తీసుకున్నా.. ఒకప్పుడు ఎడారిగా మారిపోతుందన్న అనంతపురం జిల్లా తీసుకున్నా.. ఎక్కడ చూసినా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంచి మనసు, మంచి పరిపాలన ఎక్కడైతే ఉంటుందో.. అక్కడ దేవుడి ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయి. 

పంట దిగుబడి..
పంట దిగుబడిలో ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతి ఏటా 12 లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత పాలనలో ఆహార ధాన్యాల దిగుబడి సగటున 154 లక్షల టన్నులు అయితే.. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఆహార ధాన్యాల దిగుబడి 166 లక్షల టన్నులకు పెరిగింది. అక్షరాల 12 లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి ఈరోజు కనిపిస్తుంది. అంతేకాకుండా నాలుగు సంవత్సరాల కాలంలో ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. 

గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కలిపి వారు సేకరించిన ధాన్యం 2.65 కోట్ల టన్నులు అయితే.. మనందరి ప్రభుత్వం మూడు సంవత్సరాల 8 నెలల కాలంలోనే మనం సేకరించిన ధాన్యం అక్షరాల 2.94 కోట్ల టన్నులు ఇప్పటికే సేకరించాం. ఐదు సంవత్సరాల్లో 2.65 కోట్ల టన్నులు, కేవలం మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో ఇప్పటికే ఆ నంబర్‌ దాటిపోయి 2.94 కోట్ల టన్నులు సేకరించాం. ధాన్యం సేకరణ మీద గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు చేసిన వ్యయం కేవలం రూ.40,237 కోట్లు అయితే.. మీ బిడ్డ ఈ మూడు సంవత్సరాల 8 నెలల కాలంలోనే మీ బిడ్డ ఖర్చు చేసింది రూ.55,444 కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

మీ బిడ్డ పరిపాలనలో ఉద్యానపంటల పరిస్థితి చూస్తే.. కేవలం మూడు సంవత్సరాల 8 నెలల కాలంలోనే మొత్తంగా 1,43,901 హెక్టార్లు అదనంగా ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగింది. ఉద్యాన పంటల నుంచి దిగుబడి తీసుకుంటే.. గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నులు మాత్రమే ఉంటే.. మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేవుడి దయతో రైతన్నల కష్టం వల్ల ఏటా 332 లక్షల టన్నులకు పెరిగింది. ఏకంగా 104 లక్షల టన్నులు ఎక్కువగా నమోదవుతుంది. రైతు బాగుండాలని, మనం చేసే ప్రార్థనలు, పూజలు, నిండు మనసుతో మనందరి ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉండటాన్ని దేవుడు చూశాడు.. దేవుడు విన్నాడు.. దేవుడు దీవించాడు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 

ఇవన్నీ కూడా మన కళ్లముందే జరుగుతున్న వాస్తవాలు. ఇవన్నీ అభివృద్ధికి సూచికలు. అభివృద్ధి అంటే ప్రతి ఇంటా కనిపిస్తున్న సూచికలు. ఇదే సమయంలో రైతుకు తోడుగా మానవ ప్రయత్నంగా మనందరి ప్రభుత్వం 2019 నుంచి మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో మనం ఏం చేశామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం.. 

కేవలం రైతు భరోసా అనే ఒక్క కార్యక్రమం ద్వారా అక్షరాల రైతన్నల కుటుంబాలకు రూ.27 వేల కోట్లు అందించాం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. పట్టా ఉన్న రైతులకు మాత్రమే కాకుండా అసైన్డ్‌ భూములు ఉన్న రైతన్నలకు, పేద సామాజిక వర్గాల కౌలు రైతులకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతన్నలకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సహాయంగా ఈ స్థాయిలో ఇంతగా సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశం మొత్తం మీద ఏదైనా ఉందంటే.. అది మీ బిడ్డ ప్రభుత్వమే అని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను. 

దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామస్థాయిలోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే విధంగా ఆర్బీకే వ్యవస్థతో రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకేస్తుంది. ఆర్బీకేల ద్వారా మనం అందిస్తున్న సేవలు.. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ రైతును చెయ్యి పట్టుకొని అడుగులు ముందుకు వేయిస్తుంది. యంత్ర పరికరాలను కూడా గ్రామస్థాయిలోనే అందుబాటులో ఉంచేవరకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నాం. ఆర్బీకే స్థాయిలోనే ఈ–క్రాపింగ్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. దేశంలో తొలిసారిగా ప్రారంభించి అర్హులైన రైతులకు ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ఏర్పాటు చేసిన వ్యవస్థ కూడా దేశం మొత్తంలో మన రాష్ట్రం ఒక్కటే. ఇప్పుడు ఈ విధానాన్ని దేశమంతా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మొదలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినవారంతా వచ్చి మన ఆర్బీకేలను చూసివెళ్తున్నారు. 

పంటల బీమా..
పంటల బీమాకు ఒక్క రూపాయి కూడా రైతు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. మొత్తం తానే భరిస్తున్న రాష్ట్రం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోని మన రాష్ట్రం అని చెప్పడానికి గర్వపడుతున్నా. వైయస్‌ఆర్‌ పంటల బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని 44.48 లక్షల మంది రైతన్నలకు ఇప్పటి వరకు చెల్లించిన సొమ్ము రూ.6,685 కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఇదే పంటల బీమా పథకాన్ని తీసుకుంటే కేవలం 30.85 లక్షల మంది రైతన్నలకు అది కూడా ఐదు సంవత్సరాలు కలిపితే.. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చింది కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే. ఆలోచన చేయండి.. ఆరోజు కరువు కూడా ఎక్కడ చూస్తే అక్కడ విలయ తాండవం చేస్తున్న రోజుల్లో, అది కూడా తక్కువ మంది రైతులకు కవరేజీ ఇస్తూ ఉండేది. ఐదేళ్లు కలిపి 3,411 కోట్లు అయితే.. మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో 6,685 కోట్ల రూపాయలు ఎక్కడ అని ఆలోచన చేయండి. దాదాపుగా డబుల్‌. నోటిఫై చేసిన ప్రతి పంట కూడా ఈ–క్రాప్‌ ద్వారా ప్రతి రైతన్నకు ఇన్సూరెన్స్‌ అయ్యే పరిస్థితి. రైతన్న ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్‌ ద్వారా నోటిఫై చేసిన ప్రతి పంటకు ఇన్సూరెన్స్‌ కవరేజీ వస్తుంది. గతానికి, మన ప్రభుత్వానికి తేడాను గమనించాలని ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నా.. 

గతంలో వరదలు వచ్చినా, తుఫాన్‌ వచ్చినా రైతున్నల పరిస్థితి దయనీయం. ఎప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటిది ఈరోజు రైతన్నలకు ఏ కష్టం వచ్చినా, తుపాన్లు వచ్చినా, వరదలు వచ్చినా కూడా రైతన్నలకు ఆ సీజన్‌ ముగియక మునుపే ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకి వస్తుంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు.. గ్రామస్థాయిలో ఆర్బీకేల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం రైతుల జాబితాను ప్రదర్శిస్తున్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా రైతన్నకు మంచిచేసే అడుగులు పడుతున్నాయి. ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా అక్షరాల మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో రూ.1912 కోట్లను ఇవ్వగలిగామని మీ బిడ్డ సగర్వంగా తెలియజేస్తున్నాడు. 

  • ఆక్వా రైతులకు 1.50 రూపాయలకే కరెంట్‌ సబ్సిడీ ఇచ్చే విధంగా అడుగులు వేశాం. ఇప్పటి వరకు రూ.2647 కోట్లను కరెంట్‌ సబ్సిడీ కింద ఇచ్చి ఆక్వా రైతులను ఆదుకున్నాం. 
  • ఉచిత విద్యుత్‌ గుర్తుకువస్తుందంటే.. వైయస్‌ఆర్‌ పేరు గుర్తుకొస్తుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు ఈ మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో చేసిన ఖర్చు అక్షరాల 27,800 కోట్ల రూపాయలు.
  • నాణ్యమైన విద్యుత్‌ పగటిపూటే 9 గంటల పాటు ఇవ్వాలంటే ఫీడర్లు సామర్థ్యం పెంచాలి. వాటిని పెంచేందుకు అక్షరాల రూ.1700 కోట్లు ఖర్చుచేశాం. 
  • గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో వ్యవసాయ విద్యుత్‌ బకాయిలు 8,845 కోట్ల బకాయిలు పెట్టిపోతే.. మీ బిడ్డ రైతన్నల కోసం చిరునవ్వుతో ఆ బకాయిలు తీర్చాడు. 
  • సున్నావడ్డీ పథకం అమలు చేస్తూ.. పంట రుణాల మీద ప్రభుత్వమే కడుతున్న వడ్డీకి అక్షరాల 73.88 లక్షల మంది రైతులకు సున్నావడ్డీ మొత్తం కింద చెల్లించిన సొమ్ము గత బకాయిలతో కలిపి ఏకంగా రూ.1834 కోట్లు. 
  • గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.384 కోట్ల విత్తన బకాయిలు కూడా మీ బిడ్డ ప్రభుత్వమే చిరునవ్వుతో చెల్లించింది. 
  • గత ప్రభుత్వం ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు రైతులకు ఇవ్వకుండా ఎగ్గొడితే ఆ బకాయిలను కూడా చిరునవ్వుతో మీ బిడ్డే తీర్చాడు. 
  • ఇలా కేవలం మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో రైతన్నలకు భరోసాగా ఇస్తూ, వ్యవసాయానికి అండగా నిలుస్తూ మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం కేవలం రైతన్నల కోసం చేసిన ఖర్చు రూ.1,45,751 కోట్లు అని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను. 

ఇంత నిబద్ధతతో చేశాం కాబట్టే.. ఏమీ చేయని చంద్రబాబుకు, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు, రైతుకు ఇచ్చిన ప్రతి మాట తప్పిన చంద్రబాబుకు, ఆయన భజన బృందానికి, దుష్టచతుష్టయానికి మన ప్రభుత్వం మీద కడుపు మండిపోతోంది. కడుపుమంటకు మందులేదు. అసూయకు అసలే మందులేదు. మనది పేదల ప్రభుత్వం.. మనది రైతన్నల ప్రభుత్వం.. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ.

తెనాలికి సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్ వ‌రాలు..

  • మీ చెరగని చిరునవ్వులకు, మీ అప్యాయతలకు పేరు, పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎల్లప్పుడూ దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు మీ బిడ్డకు, మీ బిడ్డ ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకునే ముందు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ కాలనీల్లో ఇంతకుముందు శ్మశాన స్థలం కావాలని, దాని కోసం రూ.9 కోట్లు ఖర్చు అవుతుందని అడిగాడు.. వెంటనే ఆ నిధులు మంజూరు చేస్తున్నాను. 
  • షాదీ ఖానా కోసం ముస్లిం సోదరులంతా అడుగుతున్నారు.. తెనాలిలో షాదీఖానా కోసం రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నాం. 
  • అగ్రికల్చర్‌ మినీ మార్కెట్‌ యార్డ్‌ కోసం కొల్లిపరలో భూములు కొనుగోలు చేయడం కోసం మరో 5 కోట్ల రూపాయలు కావాలని అడిగాడు.. దాన్ని కూడా మంజూరు చేస్తున్నాను. 
  • దుగ్గిరాల–కొల్లిపర రోడ్డును విస్తీర్ణం చేయడం కోసం రూ.10 కోట్లను మంజూరు చేస్తున్నాను. 
  • తెనాలిలో మున్సిపాలిటీ బిల్డింగ్‌ కోసం రూ.5 కోట్లను మంజూరు చేస్తున్నాను. 
  • తెనాలి ప్ర‌జ‌ల‌కు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. 

 

Back to Top