పశ్చిమ గోదావరి: 2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 2021 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రణాళిక ప్రకారం పోలవరం పనులు ముందుకు సాగాలని, పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమైందని సూచించారు. 2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని ఆదేశించారు. కుడి, ఎడమ కాల్వలు అనుకున్న లక్ష్యంలోగా వినియోగంలోకి రావాలని, రెండు వైపులా టన్నెల్ తవ్వకం పనుల ప్రగతిని అధికారులకు అడిగి తెలుసుకొని, జూన్ కల్లా తప్పకుండా నీరు పోయేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పోలవరం ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాసాలపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. కాపర్ డ్యామ్ పూర్తిచేసే సరికి ముంపు పెరుగుతుందని, సహాయ పునరావాసాలపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని ఆదేశించారు. అర్ అండ్ ఆర్ పనుల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవతా దృక్పథంతో ఉండాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ సూచించారు.