తుపాన్ ప్ర‌భావంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

విద్యుత్ షాక్‌తో మ‌ర‌ణించిన కుటుంబాన్ని ఆదుకోవాల‌ని ఆదేశాలు

వ‌ర్షాల కార‌ణంగా ఏర్ప‌డిన న‌ష్టంపై త‌క్ష‌ణ సాయం అందించండి

తాడేప‌ల్లి: నివర్‌ తుపాను నేపథ్యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. గురువారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌కు ప‌లు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో విద్యుత్ షాక్‌తో మ‌ర‌ణించిన కుటుంబాన్ని ఆదుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు. వ‌ర్షాల అనంతరం పంట న‌ష్టంపై వెంట‌నే అంచ‌నాలు రూపొందించాల‌ని సూచించారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఏర్ప‌డిన న‌ష్టంపై త‌క్ష‌ణ సాయం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 

కాగా,  నివర్‌ తుపాను పుదుచ్చేరి సమీపాన బుధవారం అర్ధరాత్రి తీరాన్ని తాకింది. తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం, పుదుచ్చేరి వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమ బెంగుళూరు, తెలంగాణల మీద ప్రభావం పడనుంది. ఉత్తరకోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.  

నివర్‌ తుపాను నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవు పోర్టులో లోకల్ సిగ్నల్ మూడో నెంబర్ ప్రమాద సూచికను ఎగరవేయగా, విశాఖపట్నంలో డిస్టెన్స్ వార్నింగ్ సిగ్నల్ రెండో నెంబర్‌, కాకినాడ గంగవరం పోర్టులో నాలుగో నెంబర్ ప్రమాద సూచికలు ఎగురవేశారు. కాగా తీవ్రమైన నివర్ తుపాను క్రమంగా బలహీనపడుతూ నేటి సాయంకాలానికి వాయుగుండంగా మార్పు చెందనున్నట్లు సమాచారం.

Back to Top