అమరావతి: ఇసుక మాఫియాను అరికట్టడానికి అవసరమైన సాంకేతిక సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏ స్థాయిలో కూడా అవినీతి ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక విధానంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఇసుక మాఫియాను అడ్డుకోవడం వల్ల అది సహించలేని కొందరు ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక స్టాక్యార్డు పాయింట్లు పెంచాలని, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరద తగ్గగానే రీచ్ల నుంచి ఇసుక వీలైనంత త్వరగా స్టాక్ యార్డులకు చేరేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. ఇసుక రవాణా విషయంలో ఇబ్బందులు అధిగమించామా అని అధికారులను ప్రశ్నించారు. ఎక్కడెక్కడ ఇసుక కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫుటేజీని మానిటరింగ్ చేసే వ్యవస్ధ కూడా ఉండాలన్నారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని అధికారులకు చెప్పారు.