పథకాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు

ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌ పెట్టాలి

రిఫరల్‌ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలి

కాల్‌ సెంటర్లకు మాక్‌ కాల్‌ చేసి పనితీరు పరిశీలించాలి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష

తాడేపల్లి: ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్య శాఖ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ఆస్ప్రత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని, ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎంపానల్డ్‌ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్‌ డెస్క్‌ కచ్చితంగా ఉండాలన్నారు. రిఫరల్‌ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఎంపానల్డ్‌ ఆస్పత్రులపై సమీక్ష చేయాలని, ప్రతి రోజూ కాల్‌ సెంటర్లకు మాక్‌ కాల్‌ చేసి పనితీరును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మాక్‌ కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను కూడా రికార్డు చేయాలన్నారు. 

నూతన వైద్య కాలేజీల నిర్మాణం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య వ్యవస్థను కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు బలోపేతం చేస్తాయన్నారు. 

Back to Top