చిన్నారుల వైద్యానికి మూడు కోవిడ్‌ కేర్‌ ఆస్పత్రులు

రూ.180 కోట్ల చొప్పున ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయండి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం 

తాడేపల్లి: చిన్న పిల్లల కరోనా చికిత్సకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పిల్లల కోసం మూడు కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ఒక్కో కేర్‌ సెంటర్‌కు రూ.180 కోట్ల చొప్పున ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. కృష్ణా– గుంటూరు, విశాఖ, తిరుపతి ప్రాంతాల్లో పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. 

కరోనా థర్డ్‌ వేవ్‌లో చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందన్న అంచనాల మేరకు ముందస్తు జాగ్రత్తలపై సీఎం వైయస్‌ జగన్‌ కీలక సమీక్ష నిర్వహించారు. ఒకవేళ థర్డ్‌ వేవ్‌ వచ్చి చిన్నపిల్లలకు కరోనా సోకితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి.. ఎటువంటి అవసరాలు ఉంటాయనే అంశాలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గర్భిణులు, చిన్నపిల్లల కోవిడ్‌  చికిత్సపై దృష్టిసారించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అన్ని ఆస్పత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన పిల్లల వార్డుల అభివృద్ధికి, మెడికల్‌ కాలేజీల్లో పీడియాట్రిక్‌ వార్డుల అభివృద్ధికి ఆదేశించారు. వార్డుల అభివృద్ధికి ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని స్పష్టం చేశారు. చిన్నారులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. 
 

Back to Top