వచ్చే నెల 30 నాటికి కారుణ్య నియామకాలు పూర్తి

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక ఆదేశాలు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 30 నాటికి కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

కోవిడ్ నివార‌ణ, వ్యాక్సినేష‌న్‌పై సీఎం స‌మీక్ష‌

కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, జిల్లా ప్రధానకేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌హబ్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. అదే విధంగా జాతీయ ప్రమాణాలను అనుసరించి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకంపై చ‌ర్చించారు. 

వివిధ ఆస్పత్రుల్లో గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామకాల క్యాలెండర్‌ను రూపొందించామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. అక్టోబరు 20న పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీచేస్తామని అధికారులు తెలిపారు. డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూలో పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 20న నోటిఫికేషన్‌ ఇస్తామని, ఎంపిక ప్రక్రియను పూర్తిచేసుకుని డిసెంబర్‌ 10న నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు తెలిపారు. డీఎంఈలో పోస్టులకు సంబంధించి అక్టోబరు 20న నోటిఫికేషన్‌ జారీచేస్తామని, ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి డిసెంబర్‌ 5న నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. ఏపీవీవీపీలో పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 20 నుంచి 23 వరకూ నోటిఫికేషన్లు జారీ చేస్తామని, ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి డిసెంబర్‌ 21 –25 మధ్య నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా నియామకాలపై అధికారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఉండాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఇందులో రాజీకి ఆస్కారం లేదన్నారు. కొత్తగా నిర్మించదలిచిన 176 పీహెచ్‌సీల నిర్మాణంపై వెంటనే దృష్టిపెట్టాలని సూచించారు. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లోగా పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివ‌రించారు. 

కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు..
12,833 సచివాలయాల్లో జీరో కేసులు నమోదు
యాక్టివ్‌ కేసులు 6,034
రికవరీ రేటు 99.01 శాతం
పాజిటివిటీ రేటు 1.36 శాతం
0 నుంచి 3 లోపు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 12
3 నుంచి 5 లోపు పాజిటివిటీ రేటు ఉన్న  జిల్లా 1
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 91.28 శాతం
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 69.62 శాతం 
104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సరాసరి 500
అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ డీ టైప్‌ సిలెండర్లు 27,311 , కాన్సంట్రేటర్లు 27,311
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 140 ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటు 
చురుగ్గా సాగుతున్న పీఎస్‌ఏ ప్లాంట్ల నిర్మాణ పనులు
ఆక్టోబరు నెలాఖరు నాటికి అందుబాటులోకి రానున్న పీఎస్‌ఏ ప్లాంట్లు

వ్యాక్సినేషన్‌
ఇప్పటివరకు తొలి డోసు వ్యాక్సినేషన్‌ వేయించుకున్నవారు 1,33,80,259
రెండు డోసుల వ్యాక్సినేషన్‌ వేయించుకున్నవారు 1,66,58,195 మంది
మొత్తం వ్యాక్సినేషన్‌ వేయించుకున్నవారు 3,00,38,454
వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు 4,66,96,649

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన‌ ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌పోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టి. కృష్ణబాబు, 104 కాల్‌సెంటర్‌ ఇంచార్జి ఎ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి.వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్ వి.వినోద్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top